Chikoti Praveen: అవసరం అయినపుడు అందరి పేర్లు బయటపెడతానని క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ స్పష్టం చేశారు. ఈడీ విచారణ కొనసాగుతుందని.. తనపై వచ్చినవన్నీ ఆరోపణలే తప్ప వాస్తవాలు లేవని వివరించారు. ఇటీవల హిందూ మతం, దేవుళ్లపై కొందరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని వారికి మంచి బుద్ధి రావాలని దుర్గమ్మను ప్రార్థించినట్లు ప్రవీణ్ పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనక దుర్గమ్మను క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...  సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, ఆటల పోటీలను వీక్షేందుకు ఏపీకి వచ్చానని చెప్పారు. ఏపీలో క్యాసినో విషయంలో తనపై వచ్చినవి ఆరోపణలు తప్ప వాస్తవాలు లేవన్నారు. ఈడీ విచారణ కొనసాగుతుందని, అవసరమైనప్పడు అందరి పేర్లు బయట పెడతానని వివరించారు. టీడీపీ హయాంలో కూడా ఏపీలో కోడి పందాలు ఆడామని ఇప్పుడు కూడా పాల్గొంటున్నామని,  టీడీపీ వాళ్లు చేసేవి కేవలం ఆరోపణలు మాత్రమేనని కొట్టిపారేశారు.