బీజేపీలో రెబల్‌గా మారి కామెంట్స్ చేస్తున్న కన్నా లక్ష్మీనారాయణపై ఆ పార్టీ నేతలు నేరుగా స్పందించకపోయినా ఇన్‌సైడ్‌లో చాలా జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. ఆయనపై కేంద్ర నాయకత్వానికి రిపోర్ట్ పంపించారని చెబుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఆ పార్టీ లీడర్లు ఆరోపిస్తున్నారు. ఆయన జనసేన లేదా టీడీపీలోకి వెళ్లేందుకు రెడీ అవుతన్నారంటూ కేంద్రంలోని పెద్దలకు సమాచారం ఇస్తున్నారు. 


కన్నాని కంట్రోల్ చేయలేకపోతున్నారా? 


బీజేపిలో ఇటీవల కాలంలో సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ స్టేట్ మెంట్స్ సంచలనంగా మారుతున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సొము వీర్రాజును టార్గెట్‌గా చేసుకొని కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్ చేశారు. ఈ వ్యవహరంపై ప్రస్తుత అధ్యక్షుడు సొము వీర్రాజు తీవ్ర అసహనానికి గురయ్యారని అంటున్నారు. కన్నా కామెంట్స్‌ను పార్టీ తరపున ఖండిచలేకపోవటం, బయటకు మాట్లాడలేని పరిస్థితుల్లో వీర్రాజును తీవ్రంగా కలచివేశాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో ఈ వ్యవహరంపై వీర్రాజు కేంద్రంలోని పెద్దలకు సమాచారం అందించారు. కేంద్ర పెద్దలు కూడా కన్నా లక్ష్మీనారాయణ స్టేట్‌మెంట్‌లపై వివరణ కోరటంతో కన్నా కామెంట్స్‌ను ఇంగ్లీష్, హిందీలో ట్రాన్స్‌లేట్ చేసి మరీ ఢిల్లీ పెద్దలకు పంపారని పార్టి వర్గాలు చెబుతున్నారు. ఇదే సమయంలో పార్టీ మారాలని కన్నా భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుందని, టీడీపీ, జనసేన నేతలకు టచ్‌లో ఉన్నారని కూడా వీర్రాజు వివరించారని ప్రచారం జరుగుతుంది. అంతే కాదు కన్నా లక్ష్మీనారాయణ బీజేపిలో చేరే ముందు జరిగిన హైడ్రామాను కూడా పార్టీ నేతలకు వివరించారంట. ఆఖరి నిమిషం వరకు కన్నా వైసీపీలో చేరేందుకు యత్నించారని, బీజేపిలో అధ్యక్ష పదవి దక్కటంతోనే పార్టీలోకి వచ్చారని వీర్రాజు గుర్తు చేసినట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు.


కన్నాపై సెటైర్లు వేసిన వీర్రాజు


కన్నా పై పార్టీలోని నాయకుల వద్ద వీర్రాజు సెటైర్లు వేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. కన్నా లక్ష్మీనారాయణ ఈసారి స్టేట్‌మెంట్‌లు చేస్తే తెలుగుతోపాటు ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాట్లాడాలని రిక్వస్ట్ చేస్తున్నారట. కామెంట్లను హిందీ,ఇంగ్లీషు భాషల్లోకి ట్రాన్స్‌లేట్‌ చేసి ఢిల్లీలోని పెద్దలకు పంపించాల్సిన ఖర్మ చేసే తప్పుందంటున్నారట. అది కూడా ఆయన్నే చేయమని చెప్పండని కన్నాను ఉద్దేశించి వీర్రాజు ఎద్దేవా చేస్తూ మాట్లాడారట. ఇంతకీ కన్నాకు ఇంగ్లీ, హిందీ భాషలు వచ్చా అంటూ నవ్వుతూనే వీర్రాజు మాట్లాడారని చెబుతున్నారు. అవి రాకపోతే 30రోజుల్లో భాష నేర్చుకునే పుస్తకాలను కొనివవ్వాలని, లేదంటే వాటిని కూడా కన్నానే కొనుక్కోమని చెప్పండని వీర్రాజు సలహా ఇచ్చారని నేతలు సెటైర్ల వేస్తున్నారు...


అంటే జనసేన బీజేపితో ఉండదా....


ఇక్కడే మరో చర్చ తెరపైకి వస్తోంది. కన్నా ఎపిసోడ్ పై ఢిల్లీ పెద్దలకు వీర్రాజు వివరించే ప్రయత్నంలో జనసేనతో కన్నా టచ్‌లో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. అంటే జనసేన, బీజేపితో పొత్తు కొనసాగే పరిస్థితి లేదా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయని అంటున్నారు. కన్నా పార్టీ మారాలనుకుంటే, అధికార పార్టీలోకి వెళ్లేందుకు ద్వారాలు తెరిచే ఉన్నాయి. పార్టీ మారాలనుకుంటే, అధికార పక్షంలోకి వెళ్లటం ద్వారా కొంత మేలు కలిగే అవకాశం ఉందని.. కానీ జనసేనతో టచ్‌లో ఉన్నారని, పరోక్షంగా టీడీపీకి సోపర్ట్ చేస్తున్నారని చెప్పారట.  వీర్రాజు చెప్పటం చూస్తుంటే జనసేన బీజేపీ నుంచి సైడ్ అయ్యి టీడీపీకి దగ్గర అయ్యిందని ఒప్పుకున్నట్లే అన్న సంకేతాలు బయటకు వస్తున్నాయి. మరి అలాంటప్పుడు బీజేపి నేతలు, పదేపదే జనసేన తమతోనే ఉందని ప్రచారం చేసుకోవటం వెనుక అంతర్యం ఏంటన్నది కూడా చర్చనీయాశంగా మారింది.