Diamond Found in NTR District: ఓ వ్యక్తికి దొరికిన వజ్రం దొరకడంతో విషయం ఆనోటా ఈనోటా పాకడంతో చుట్టుపక్కల గ్రామాల వారు అక్కడికి వెళ్లి వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లలో ఇది జరిగింది. అరుదైన వజ్రం దొరకడంతో భారీ సంఖ్యలో స్థానికులు అక్కడికి వెళ్లి వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు.


సత్తెనపల్లి సమీపంలోని బిగుబండ గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్లలో వజ్రాల కోసం వేట సాగిస్తోంది. ఈ క్రమంలో ఓ వ్యక్తికి అరుదైన వజ్రం దొరికింది. వజ్రానికి 6 కోణాలు ఉండటం, ఇది షడ్ బుజి వజ్రం కావడం తో మంచి డిమాండ్ వచ్చింది. దీని విలువ అరకోటి ఉంటుందని భావిస్తున్నారు. దాదాపు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు షడ్ బుజి వజ్రం ధర ఉంటుందని అంచనా వేస్తున్నారు. 


వజ్రం దొరికిందని ఆనోటా ఈనోటా పాకడంతో స్థానికుల నుంచి విషయం తెలుసుకున్న వజ్రాల వ్యాపారులు ఆ కుటుంబాన్ని సంప్రదించారు. రూ.40 లక్షలు ఇస్తామని, తమకు ఆ అరుదైన వజ్రాన్ని విక్రయించాలని బేరసారాలు జరిపారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఆరు భుజాలు కలిగిన వజ్రానికి మరింత ధర వస్తుంది, మంచి ఆఫర్ కోసం వాళ్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. గుడిమెట్లతో పాటు ఏపీలో కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో వజ్రాల కోసం నిరంతరం ఏదో చోట తవ్వుతూ ఉంటారని తెలుస్తోంది.



ఓ వ్యక్తికి అరుదైన వజ్రం దొరికిందని తెలియడంతో గుడిమెట్లకు స్థానికులు క్యూ కట్టారు. లంచ్ బాక్సులతో సహా అక్కడ వాలిపోతున్నారు. కుటుంబాలు కుటుంబాలు గుడిమెట్లకు వచ్చి వజ్రాల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేట కొనసాగిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతం రాజుల పాలనలో ఉందని, కనుక వజ్రాలు దొరుకుతాయని స్థానికులు నమ్ముతున్నారు. రాత్రిళ్లు సైతం లైట్లు వేసుకుని మరీ భారీ గుంతలు తవ్వుతూ వజ్రాల కోసం వెతుకుతున్నారు. ఇటీవల ఒకేరోజు మూడు వజ్రాలు దొరికాయని ప్రచారం జరిగిన తరువాత గుడిమెట్లకు స్థానికులు క్యూ కడుతున్నారు. ఒక్క వజ్రం దొరికినా తమ కష్టాలు తొలగిపోతాయని వారు చెబుతున్నారు.