AP govt Dissolved Special Enforcement Bureau | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌)ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వైసీపీ హయాంతో ఏర్పాటు చేసిన సెబ్ ను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం (సెప్టెంబర్ 11న) ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోకు కేటాయించిన 4,393 మంది (70 శాతం) ఎక్సైజ్‌ శాఖ సిబ్బందిని తిరిగి మాతృ శాఖలోకి తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ హయాంలో సెబ్ ఏర్పాటు చేయకముందు ఉన్న తరహాలో ఎక్సైజ్ శాఖ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సెబ్ రద్దు చేసేందుకు ఏపీ కేబినెట్ అమోదం తెలిపింది. ఈ క్రమంలో సెబ్ రద్దు చేస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులను ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు విడుదల చేశారు.


సెబ్ ఏర్పాటు చేసే సమయంలో ఎక్సైజ్‌ శాఖలో ఉన్న 6,274 మంది సిబ్బంది ఉండగా, వారిలో 1,881 (30 శాతం) మందిని అదే శాఖలో ఉంచారు. మిగతా సిబ్బంది గత వైసీపీ ప్రభుత్వం సెబ్ లోకి తీసుకొచ్చింది. తాజాగా ఏపీ ప్రభుత్వం సెబ్ రద్దు చేయడంతో ఆ సిబ్బందిని తిరిగి మాతృశాఖ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ కు తిరిగి తీసుకొస్తున్నారు. ఐజీ ర్యాంకు ఉన్న ఓ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో త్వరలో ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఏర్పాటు చేయనున్నారు.


వైసీపీ హయాంలో లిక్కర్ విక్రయాలపై అవినీతి ఆరోపణలు


గత ప్రభుత్వ హయాంలో మద్యంపై భారీగా దోపిడీ జరిగిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో మద్యంపై టార్గెట్ పెట్టి, తమదైన రీతిలో మద్యంపై భారీగా అక్రమం సంపాదన పోగేశారని ఆరోపణలున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డులు, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ బదులుగా ఆఫ్‌లైన్ విధానంలో మద్యం విక్రయాలతో అపరిమిత దోపిడీకి వైసీపీ ప్రభుత్వం తెరతీసిందని టీడీపీ, బీజేపీ నేతలు పలుమార్లు ఆరోపించారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరీ సైతం ఓసారి మద్యం దుకాణానికి వెళ్లి ఆరోజు జరిగిన మద్యం విక్రయాలు, లెక్కలు చెక్ చేసి లెక్కలు బయటపెట్టడం అప్పట్లో దుమారం రేపింది. మద్యంపై జగన్ భారీగా పోగేశారని, లిక్కర్ విక్రయాల ఆదాయం తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్తోందని, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సైతం అప్పటి విపక్ష నేతలు ఢిల్లీకి వెళ్లి సైతం ఫిర్యాదు చేయడం తెలిసిందే.


Also Read: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ - ఐఎంజీపై పిటిషన్లలో ఆధారాల్లేవు - కొట్టేసిన తెలంగాణ హైకోర్టు