ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని  స్వరాజ్ మైదాన్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ స్మృతివనం, భారీ కాంస్య విగ్రహం ఏర్పాటుపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు కోసం దాదాపు రూ.268కోట్లు ఖర్చు చేస్తున్నారు. రాజ్యంగా నిర్మాత విగ్రహం తయారీ, దాని చుట్టూ చేపట్టిన సివిల్‌ వర్క్స్, సుందరీకరణ, మైదానికి ప్రధాన రహదారితో అనుసంధానం చేసే అంశాలపై  ముఖ్యంత్రి జగన్ అధికారులకో చర్చించారు. అంబేద్కర్ స్మృతివనం పనులపై అధికారులు వివరించగా..సీఎం పలు కీలక సూచనలు చేశారు.


మార్చి నెలాఖరుకు భారీ అంబేద్కర్ విగ్రహం పూర్తి


విగ్రహ పీఠంతో కలుపుకొని అంబేదర్క్‌ విగ్రహం దాదాపు 206 అడుగుల పొడవు వస్తుందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. అంబేద్కర్‌ స్మృతివనం ప్రాజెక్టు వ్యయం మొత్తంగా రూ.268 కోట్లు కాగా, పీఠం భాగంలో జీ ప్లస్‌ టూ నిర్మాణం ఉంటుందన్నారు. ప్రాంగణంలో ఒక కన్వెన్షన్‌ సెంటర్‌ కూడా వస్తుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అయితే, 2 వేల మందికి సరిపడేలా కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను జగన్ ఆదేశించారు. విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్‌ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్‌ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు విగ్రహ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. జనవరి 31 నాటికి విగ్రహానికి సంబంధించి కాస్టింగ్‌ చేసిన భాగాలన్నీ తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయని తెలిపారు.


నాణ్యత విషయంలో తగ్గొద్దన్న సీఎం జగన్


అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. నాణ్యత విషయంలో అస్సలు తగ్గొద్దని, అలాగే నిర్మాణాలు అందంగా ఉండాలని సూచించారు. పనుల పర్యవేక్షణకు ఉన్నతస్థాయి అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు.  కార్‌ పార్కింగ్, బస్‌ పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం కేటాయించామని, అలాగే అంబేద్కర్‌ స్మృతి వనానికి దారితీసే రోడ్లను సుందరీకరిస్తామని తెలిపిన అధికారులు.


ముఖ్యమంత్రి జరిపిన సమీక్షలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, బీసీ, ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారీ అంబేడ్కర్‌ స్మృతివనం భారతదేశానికే ఒక మణిదీపం అవుతుందని అంబేద్కర్ వాదులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్మృతివనం పూర్తయితే ప్రపంచ కీర్తి ఆంధ్రప్రదేశ్‌కు వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.