వ్యసనాలకు అలవాటు పడిన కొడుకు వేధింపులు తట్టుకొలేక, తల్లే కుమారుడిని అత్యంత కిరాతకంగా హత్య చేసింది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో వెలుగులోకి వచ్చిన విషయాలతో పోలీసులు కూడ షాక్‌కి గురయ్యారు.


విజయవాడ పాతబస్తి కొత్తపేటలో అప్పరావమ్మ వీధిలో మద్దూరి మాధవి అనే వివాహిత నివాసం ఉంటుంది. మాధవికి ఇద్దరు పిల్లలు. భర్త చనిపోవటంతో ఒక హోటల్‌లో రోజు వారి కూలికి పని చేస్తుంది. మాధవి కుమారుడు దేవ కుమార్‌కు 19 సంవత్సరాల వయస్సు. చిన్న వయస్సులోనే దేవ కుమార్ దారి తప్పడు. చెడు అలవాట్లకు బానిసగా మారాడు


వ్యసనాల బారిన పడ్డ దేవ కుమార్‌ ఇంట్లో తల్లి, చెల్లిపై దాడులకు పాల్పడుతున్నాడు. మద్యానికి డబ్బులు కావాలంటూ రోజూ ఇంట్లో గొడవ పడుతున్నాడు. డబ్బులు ఇవ్వకపోతే ఇంటిలో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను లీక్ చేసి చంపుతానని బెదిరింపులకు దిగుతున్నాడు. దీంతో విసిగిపోయిన తల్లి కొడుకు పెట్టే బాధలను భరించలేకపోయింది. కడుపున పుట్టిన బిడ్డ అని కూడా తీవ్ర నిర్ణయం తీసుకుంది. 


సహకరించి ఆ ఇద్దరు...
కొడుకు పెట్టే బాధలతో తల్లి మాధవి, 17సంవత్సరాల కుమార్తె, భయాందోళనకు గురయ్యారు. ఇదే సమయంలో తాను పని చేసే హోటల్‌లో ఓ వ్యక్తితో మాధవికి పరిచయమైంది. కొడుకు పెట్టే బాధలను గురించి అలీ ఖాన్‌తో చెప్పిన మాధవి అతన్ని చంపేయాలని నిర్ణయానికి వచ్చినట్టు కూడా వివరించింది. గత నెల 27న తాగి వచ్చిన కొడుకు దేవకుమార్ ఇంటిలో గొడవ పడ్డాడు. అదే సమయంలో అలీ ఖాన్ కూడా ఇంటికి వచ్చాడు. 


తాగిన మైకంలో ఉన్న దేవకుమార్‌పై తల్లి మాదవి, ఆమె ఫ్రెండ్‌ అలీఖాన్‌తోపాటుగా చెల్లెలు కూడా దాడి చేశారు. దేవ కుమార్‌కు ఊపిరి ఆడకుండా చేసి నోరు నొక్కి చంపేశారు. అయితే ఈ విషయం బయటకు రాకుండా మద్యం సేవించి చనిపొయాడంటూ మాధవి స్థానికులను నమ్మించింది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో దేవ కుమార్ డెడ్ బాడిని పోస్ట్ మార్టంకు తరలించారు. ఆ తరువాత అంత్యక్రయలు కూడా జరిగాయి.


పోస్ట్ మార్టం రిపోర్ట్‌తో నిజాలు వెలుగులోకి...
రెండు రోజుల క్రితం దేవ కుమార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. అది పోలీసులకు అందటంతో వాస్తవాలు తెలుసుకొని షాక్‌కి గురయ్యారు. నోరును నొక్కి పెట్టి, గొంతు మీద బలంగా దాడి చేసి ఊపిరి ఆడకుండా చేయటం వలన దేవ కుమార్ చనిపోయినట్లుగా వైద్యులు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో పేర్కొన్నారు. దీంతో అనుమానాస్పద మృతి గా మెదట కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తరువాత హత్య కేసుగా మార్చారు. విచారిస్తే అసలు గుట్టు వెలుగులోకి వచ్చింది. వేధింపులు భరించలేక తల్లి మాధవి హత్య ప్లాన్ చేయటం, ఇందుకు అలీ ఖాన్‌తో పాటుగా చెల్లి సహకరించిందని విచారణలో తేలింది. విచారణ నిమిత్తం తల్లి మాధవి, ఆమెకు సహకరించిన అలీ ఖాన్, కుమార్తెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనార్టీ తీరని కుమార్తెను జువైనల్ హోంకు తరలించారు. దీంతో రెండు కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డట్టు అయింది.