YS Jagan Latest News: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బుధవారం గుంటూరులోని మిర్చియార్డ్ను సందర్శించారు. ప్రస్తుతం అక్కడ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దాన్ని ఉల్లంఘించి ఎలాంటి అనుమతి తీసుకుండానే భారీ జనసందోహంతో మిర్చియార్డును సందర్శించారు. దీనిపై ఎన్నికల సంఘం అధికారులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు జగన్ సహా ఏడుగురిపై కేసు పెట్టారు.
గుంటూరులో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్
ఆంధ్రప్రదేశ్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరుగతున్న జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. అక్కడ ఏం చేసినా ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలి. ఇప్పుడ జగన్ పర్యటించిన గుంటూరులో కూడా కోడ్ అమలులో ఉంది. అయితే ఎన్నికల సంఘం అధికారుల అనుమతి తీసుకోకుండా జగన్ పర్యటించారు.
జగన్ సహా ఏడుగురు
ఈసీ అనుమతి లేకుండా గుంటూరులో పర్యటించడాన్ని అధికారులు తప్పుపట్టారు. కోడ్ నియమాలను ఉల్లంఘించినందుకు జగన్పై అధికారులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం అధికారుల ఫిర్యాదు అందుకున్న పోలీసులు జగన్పై కేసు పెట్టారు. ఆయనతోపాటు వైసీపీ నేతలు కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపపాల్ రెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్నాయుడుని కూడా నిందితుల లిస్ట్లో చేర్చారు.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇవే
జగన్తోపాటు వీళ్లంతా ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే కాకుండా అమలులో ఉన్న పోలీస్ యాక్ట్ను కూడా పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలాంటి అనుమతి తీసుకోకుండానే కనీసం మిర్చి యార్డు సెక్రటరీ పర్మిషన్ కూడా తీసుకోలేదని ఫిర్యాదులో అధికారులు పేర్కొన్నారు. దీని వల్ల స్థానిక ప్రజలు, మిర్చి రైతులు ఇబ్బంది పడ్డారని తెలిపారు. పెద్ద సంఖ్యలో వచ్చిన వైసీపీ నేతల వల్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. ముందస్తు పర్మషన్ తీసుకోకుండా వచ్చి ప్రజలకు ఇబ్బంది పెట్టినందుకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపారు.
ఈ కేసులో పేర్ని నానిని చేర్చడంపై వైసీపీ విమర్శలు చేస్తోంది. అసలు ఆ పర్యనటకు రాని నానిని నిందితుల జాబితాలో ఎందుకు చేర్చారని ప్రశ్నించారు అంబటి రాంబాబు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన... ప్రభుత్వం కుట్ర అర్థమవుతుందని మండిపడ్డారు.
Also Read: ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం
ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
బుధవారం మిర్చియార్డ్లో పర్యటించిన జగన్ అక్కడి రైతులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం పది గంటలకు వచ్చిన జగన్ దాదాపు గంట పాటు అక్కడ ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మిర్చి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులంతా ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు.
వైసీపీ హయాంలో రైతులకు మేలు చేసే పథకాలు, సంస్కరణకు తీసుకొచ్చామని వాటిని కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు జగన్. మిర్చి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల తరఫున వైసీపీ ప్రత్యక్ష పోరాటాలకు దిగుతుందన్నారు. ఎప్పుడూ లేనంతగా మిర్చి ధర పడిపోతే కనీస మద్దతు ధర ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
Also Read: సైలెంట్గా యాక్టివ్ - జగన్ జిల్లాల టూర్లు ప్రారంభమయినట్లేనా ?