Ysrcp Leader Gorantla Madhav: హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు విజయవాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు.   మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మార్చి ఐదో తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఓ  పోక్సో కేసులో బాధితురాలి పేర్లను బయట  పెట్టడమే కాకుండా అసభ్యంగా మాట్లాడారు. ఈ మాటల వీడియోలతో సహా వాసిరెడ్డి పద్మ గత నవంబర్‌లో ఫిర్యాదు చేశారు. 

గోరంట్ల మాధవ్ సీఐగా పని చేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనంతపురంలో సీఐగా పని చేస్తున్న సమయంలో జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై చేసిన కొన్ని వ్యాఖ్యలతో ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. పోలీసు అధికారుల సంఘం అని చెప్పుకుని ఆయన మీసాలు మెలేసి..తొడలు కొట్టి హైలెట్ అయ్యారు. ఆయన సామాజికవర్గం కూడా కలసి రావడంతో జగన్ పిలిచి వైసీపీ టిక్కెట్ ఇచ్చారు. వైసీపీ గాలిలో ఎంపీగా గెలిచారు. 

అయితే ఆయన పని తీరు మాత్రం అత్యంత వివాదాస్పమయింది. ఓ సారి ఆయన అసభ్య వీడియోలు వెలుగులోకి వచ్చాయి. పలుమార్లు ఆయన రాజకీయ ప్రత్యర్థులపై దూకుడైన విమర్శలు చేశారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఇటీవల కూడా చంద్రబాబును చంపేస్తామన్నట్లుగా మాట్లాడి వివాదాస్పదం అయ్యారు. అయితే ఈ విషయాల్లో ఆయనపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు కనీ.. పోలీసు అధికారి అయి ఉండి ఓ పోక్సో కేసులో బాధితురాలి ఐడెంటీటీ  బయట పెట్టకూడదని తెలిసి కూడా ఆయన బయట పెట్టారు. అప్పట్లోనే దీనిపై విమర్శలు వచ్చాయి. వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుతో కేసులు నమోదయ్యాయి. 

మరో వైపు  ఈ నోటీసులను అందుకున్న గోరంట్ల మాధవ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో భావ ప్రకటన  స్వేచ్చ లేదని.. ప్రశ్నించిన వారందరిపై అరెస్టులు చేసి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. త్వరలో రాష్ట్రంలో అంతర్యుద్ధం వస్తుందని హెచ్చరించారు. తనకు ఈ నోటీసులు ఇప్పుడే ఇచ్చారని.. ఐదో తేదీన విచారణకు వెళ్లడంపై ఆలోచిస్తానన్నారు.న్యాయ నిపుణుల సలహా తీసుకుంటానని .. వారి సలహా మేరకు నడుచుకంటానన్నారు. విచారణ తేదీ మార్చాలని కూడా అడుగుతానన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని.. రాష్ట్రంలో జరుగుతున్న ఘోరాలను ప్రశ్నించినందుకే తనపై కేసులు పెడుతున్ారని ఆరోపించారు.       

గోరంట్ల మాధవ్ పోలీసు అధికారి. పోలీసులు ఇచ్చిన నోటీసులకు విచారణకు హాజరు కాకపోతే ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఈ కేసులో అరెస్టు చేయకుండా కోర్టుకు వెళ్లడం లేదా.. మరో న్యాయపరమైన అవకాశాలను ఆయన పరిశీలించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆయన అత్యంత దారుణంగా మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూంటాయి. దాంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.          

Also Read:  వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన