ఓ ముంబై మోడల్ కి.. ఓ ఇండస్ట్రియలిస్ట్ మధ్య ప్రేమ వ్యవహారంలో ఏపీ పోలీసులు ఇన్వాల్స్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కిందటి ప్రభుత్వ హయాంలో బెజవాడ పోలీసులు ఓ పెద్ద వ్యవహారాన్నే నడిపినట్లు ప్రచారం జరుగుతోంది.  ఆరునెలల కిందట విజయవాడలో నమోదైన ఓ కేసులో కొత్త కోణం బయటకు వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలోని ఓ పెద్ద ప్రోద్భలంతో అప్పట్లో పోలీసు బాసులు నటిని వేధించినట్లు ప్రచారం జరుగుతోంది. 


అసలేం జరిగిందంటే..
గుజరాత్ కు చెందిన ఓ నటి ముంబైలో నివాసం ఉండేది. తన ఈవెంట్లతో పాటు సినిమాలు చేసుకుంటూ బిజీ లైఫ్ లీడ్ చేసింది. ఈ క్రమంలో ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త వారసుడితో ప్రేమలో పడింది. ఇండస్ట్రియలిస్ట్ మనవడు ముంబైలో ఆ నటితో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాడు. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పగా, రొటీన్ సీన్ జరిగింది. అమ్మాయి తల్లిదండ్రులు వీరి ప్రేమ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటి కావడంతో నటితో ప్రేమను అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. వారి పెళ్లికి నో చెప్పారు. ఆమెకు దూరంగా ఉండాలని ఆ యువకుడికి చెప్పి చూసినా ప్రయోజనం లేకపోవడంతో కుటుంబసభ్యులు మరో ప్లాన్ చేశారు. 


మధ్యలో వైసీపీ నేత ఎంట్రీతో మారిన సీన్!
గత వైసీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఓ ముఖ్యమైన వ్యక్తికి ఈ ప్రేమ జంటను విడగొట్టేందుకు పారిశ్రామికవేత్త ఫ్యామిలీ నుంచి డీల్ వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో భారీగానే డబ్బు చేతులు మారినట్లు చెబుతున్నారు. ఇదంతా ఈ ఏడాది జనవరిలో జరిగింది. పెద్ద కుటుంబం నుంచి డీల్ రావడంతో ఏకంగా ఐపీఎస్ స్థాయి అధికారి ఓ సీఐను, ఎస్సైను తీసుకుని ముంబై వెళ్లారంట..  పెళ్లి విషయం సెటిల్ చేస్తామని తీసుకువచ్చి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ చోట ఫ్యామిలీని నిర్బంధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఆ నటి, ఆమె ఫ్యామిలీపై కేసు నమోదై ఉంది. కానీ ఇదంతా బెదిరింపులో భాగమే అంటున్నారు. కృష్ణాజిల్లాకు చెందిన ఓ వ్యక్తిని మోసం చేసినట్లు ఫిర్యాదు తీసుకుని దాని ద్వారా ఈమెను బెదిరించారు. ఆమె కుటుంబసభ్యుల ఫోన్లు తీసుకుని, వారి సోషల్ మీడియా ఖాతాల నుంచి ప్రేమ వ్యవహారానికి సంబంధించిన అన్ని ఫొటోలు, వీడియోలు డిలీట్ చేశారు.. అనంతరం నటితో పాటు ఆమె కుటుంబసభ్యులపై అక్రమ కేసులు బనాయించి టార్చర్ చేశారని ప్రచారం జరుగుతోంది.  


2 ఫిబ్రవరి 2024న చీటింగ్ కేసు పెట్టించి, ఆ కుటుంబాన్ని విచారించినట్లు ప్రచారం నడుస్తోంది.  ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి నటి మోసం చేసిందని ఫిర్యాదులో  ఆ వ్యక్తి పేర్కొన్నాడు. తనకు మాయమాటలు చెప్పి ఆకట్టుకుందని.. తన నుంచి 5 లక్షలు వసూలు చేసిందని అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై ఆమెను ఆమె ఫ్యామిలీని అరెస్టు చూపించి... ఆ తర్వాత బెయిల్ పై విడుదుల చేశారు. అయితే బెయిల్ ఇచ్చిన వ్యక్తులను కూడా పోలీసులే ఏర్పాటు చేశారని.. ఫిర్యాదుదారుడు, బెయిల్ ఇచ్చినవారు, పోలీసులు కలిసి ఒక టీమ్ గా నడిపించినట్లు అర్థమవుతోంది. అయితే బాగా బెదిరించడంతో ప్రస్తుతం ఆమె సైలంట్ అయిపోయింది. కేసు నడుస్తుండటంతో దీనిపై మాట్లాడేందుకు కూడా ఇష్టపడటం లేదు.


ప్రభుత్వం మారిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. రాజకీయ కారణాలతో ఈ విధంగా ప్రచారం చేస్తున్నారా.. లేక ఇదంతా నిజంగానే జరిగిందా అన్నవిషయం నిర్థారణ కాలేదు విజయవాడలో అయితే పోలీసు వర్గాల్లో దీని గురించి బాగానే చర్చ జరుగుతోంది. మాజీ పోలీసుబాస్ పై కక్ష పెంచుకున్న కొందరు పోలీసులే ఈ విషయాన్ని లీక్ చేశారని కూడా చెప్పుకుంటున్నారు. 


స్పందించిన విజయవాడ సీపీ
నటిపై వేధింపుల అంశంపై విజయవాడ నగర కమిషనర్  రాజశేఖర్ బాబు స్పందించారు. మీడియాలో కథనాలు చూశాం, అయితే తమను వేధించారంటూ ఏ నటిగానీ, ఆమె ఫ్యామిలీ నుంచి గానీ ఫిర్యాదు అందలేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే, కేసు నమోదు చేసి విచారణ చేపడతామని చెప్పారు. అప్పుడే ఇందులో విజయవాడ పోలీసుల పాత్ర ఉందా లేదో తెలిసే ఛాన్స్ ఉందన్నారు.