Vadde Sobhanadeeswararao: సీఎం జగన్ పైశాచికానందం కోసమే టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ కేసు పెట్టారని మాజీ మంత్రి వడ్డీ శోభనాద్రీశ్వరరావు అన్నారు. యువతలో నైపుణ్యాలు వృద్ధి చేయాలనే సదుద్దేశంతో గతంలో రాష్ట్రంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పెట్టారని చెప్పుకొచ్చారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రం దురదృష్టకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీం జగన్ పద్ధతి మార్చుకోకపోతే పతనమే ఎదురవుతుందని తెలిపారు. అలాగే వైసీపీకి బీజేపీ మద్దతు ఉందని ప్రజలకు అర్థం అవుతోందని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో ఏమీ లేని లిక్కర్ పాలసీలో కుంభకోణం జరిగిందని ఈడీ, సీబీఐలతో కేసులు పెట్టారని గుర్తు చేశారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజలు ప్రాణాల మీదకు తెస్తున్నారని మండిపడ్డారు. మద్యం ద్వారా వేలకోట్లు సంపాదిస్తూ వైసీపీ నేతలు వెనకేసుకుంటున్నా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 


టీడీపీ కార్యకర్తలకు, ప్రజలకు ఒకటే చెబుతున్నానని.. చంద్రబాబు ఎలాంటి తప్పు  చేయలేదని మాజీ మంత్రి శోభనాద్రీశ్వరరావు చెప్పుకొచ్చారు. చంద్రబాబు త్వరలోనే నిర్దోషిగా బయటకు వస్తారని వివరించారు. దేశంలో అన్ని స్కిల్ సెంటర్ల కంటే రాష్ట్రంలోనే నిర్వహణ బాగుందని కేంద్ర సంస్థలు మెచ్చుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పద్దతి మార్చుకోకపోతే పతనం కాక తప్పదని హెచ్చరించారు.  


మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నారా లోకేష్ ఫిర్యాదు


మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని .. ప్రతిపక్షాల్ని అణిచి వేస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో కలిసి రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్మును పార్టీ నేతలతో సహా కలిశారు.  టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు.  చంద్రబాబుపై కక్షగట్టిన ఏపీ సర్కార్ ఏ ఆధారాలు లేకుండా మాజీ సీఎంను అరెస్ట్ చేశారని  స్కిల్ కేసు వివరాలు అదించారు.  లోకేష్ తో పాటు  ఎంపీలు కనకమేడల, కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు  ఉన్నాయి.  కక్ష సాధింపు లో భాగంగా అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ని అరెస్ట్ చేసిన తీరు గురించి రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు.   ఎటువంటి ఆధారాలు లేకపోయినా కేవలం అవినీతి బురద చల్లే లక్ష్యంతో అరెస్ట్ చేశారు అంటూ తమ వద్ద ఉన్న సమాచారాన్ని, ఆధారాలను రాష్ట్రపతి కి అందించారు.   ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్రపతిని కోరారు. 


అంతకు ముందు నారా లోకేష్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తనను ఏ 14గా చేర్చడంపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. యువ‌గ‌ళం పేరు వింటే సైకో జ‌గ‌న్ గ‌జ‌గ‌జ‌లాడుతున్నాడని.. ఏం చేసినా సరే యువగళం ఆగదని హెచ్చరించారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ఢిల్లీ వెళ్లిన లోకేష్ కేసు గురించి జాతీయ మీడియాలో తన వాదనలు వినిపించారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో.. ఎంపీల ద్వారా దేశం దృష్టికి తీసుకెళ్లారు.  న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నారు.   ఢిల్లీకి వెళ్లి వాస్తవాలు చెబుతున్నారని..  దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఏపీలో జరుగుతున్న అంశాలను వివరిస్తున్నారని టీడీపీ నేతలంటున్నారు.