Pawan Kalyan Razolu tour: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో అనుమానాస్పద వ్యక్తి అంశం హాట్ టాపిక్‌గా మారింది.  ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల రాజోలు నియోజకవర్గంలో చేపట్టిన పర్యటన సందర్భంలో ఓ అపరిచిత వ్యక్తి ఆయనకు అతి సమీపంలో సంచరించడం సంచలనం రేపింది. ఈ వ్యక్తి వైఎస్ఆర్‌సీపీకి చెందిన కార్యకర్తగా గుర్తించినట్టు సమాచారం.   దీంతో ఉప ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, ఈ విషయాన్ని డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు.  తగిన విచారణ చేపట్టాలని కోరారు.

Continues below advertisement

నవంబర్ 26వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంలో శంకరగుప్తం డ్రయిన్ మూలంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలిస్తున్న సమయంలో, అధికారులతో సంభాషిస్తున్నప్పుడు, అలాగే తర్వాతి కార్యక్రమాల్లోనూ ఈ అపరిచిత వ్యక్తి పవన్ కల్యాణ్‌కు  చాలా చేరువగా కనిపించాడు. సాధారణంగా ఇలాంటి పర్యటనల్లో భద్రతా ప్రోటోకాల్ పాటిస్తూ, అధికారిక పాస్‌లు ఉన్నవారిని మాత్రమే సమీపంలోకి అనుమతిస్తారు. అయితే, ఈ వ్యక్తి ఎలా చొరబడ్డాడు? అతని ఉద్దేశ్యం ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరిన సమాచారం ప్రకారం, ఈ వ్యక్తి రాజోలు నియోజకవర్గంలోని వైఎస్ఆర్‌సీపీకి చెందిన కార్యకర్త. అతని వ్యవహార శైలి, కదలికలు సాధారణంగా లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. పర్యటన సమయంలో ఆయన చుట్టూ తిరిగిన విధానం, అధికారులతో మాట్లాడుతున్నప్పుడు సమీపంలో ఉండటం వంటివి భద్రతా సిబ్బంది గమనించారు. "ఇది కేవలం యాదృచ్ఛికమా లేక ఏదైనా ప్రణాళికాబద్ధమా?" అని ఉప ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. వైఎస్ఆర్‌సీపీ, జనసేన పార్టీల మధ్య ఇప్పటికే ఉన్న రాజకీయ ఉద్రిక్తతల  కారణంగా ఈ అనుమానాస్పద వ్యక్తి ఎంట్రీ మరిన్ని చర్చలకు దారితీస్తోంది. పవన్ కళ్యాణ్ ఇటీవల వైఎస్ఆర్‌సీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం.   ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు వెంటనే డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీకి తెలియజేశారు. అతని కదలికలు, పర్యటన కార్యక్రమానికి జారీ చేసిన పాస్‌లు, అతను ఎలా చేరాడు అనే సందేహాలను వివరంగా వివరించారు.  జిల్లా పోలీసు అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం.  

Continues below advertisement

కోనసీమ జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు. అయితే, పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, సీసీటీవీ ఫుటేజ్‌లు, పాస్ రికార్డులు, సాక్షుల వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. ఈ వ్యక్తి గతంలో ఏవైనా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నాడా, అతని బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి అనే అంశాలపై దృష్టి సారించారు.