Two Days Are Mourning Days in AP: మీడియా దిగ్గజం, రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు (Ramoji Rao) అస్తమయం అంతటా తీవ్ర విషాదం నింపింది. రామోజీరావు మరణంతో ఏపీలో రెండు రోజులు సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 9 (ఆదివారం), 10 (సోమవారం) తేదీల్లో సంతాప దినాలుగా పేర్కొంటూ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), ఆయన సతీమణి ఫిలింసిటీలో రామోజీరావు పార్థివదేహానికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రామోజీరావు చివరి వరకూ సమాజ హితం కోసమే పని చేశారని చంద్రబాబు అన్నారు. ప్రజలను చైతన్య వంతులను చేయడానికి ఆయన అనుక్షణం పరితపించారని కొనియాడారు. 'రామోజీరావు ఓ వ్యక్తి కాదు.. ఆయన ఓ గొప్ప శక్తి. ఈనాడు ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని, విజ్ఞానవంతుల్ని చేశారు. జర్నలిజానికి విశేష సేవలందించారు.  మొదటి నుంచి ప్రజల పక్షాన నిలబడతానని చెప్పిన గొప్ప వ్యక్తి. ఫిలింసిటీని నిర్మించి చిత్ర పరిశ్రమకు ఎనలేని సహకారం అందించారు. రామోజీరావు ఇచ్చిన స్ఫూర్తితో తెలుగుజాతిని ముందుకు తీసుకెళ్తా. రామోజీ కుటుంబ సభ్యులు, ఉద్యోగులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.' అని చంద్రబాబు పేర్కొన్నారు.


అటు, రామోజీరావు మరణంపై టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతికి సంతాప సూచకంగా ఆదివారం చిత్ర పరిశ్రమ బంద్‌కు పిలుపునిచ్చినట్లు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది. ఆదివారం షూటింగ్స్ నిలిపేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.


Also Read: Ramoji Rao : ప్రజాజీవితంలోకి లేని పవర్ ఫుల్ లీడర్ రామోజీరావు - తలవంచని మీడియా ప్రతిపక్ష సారధి !