Aadhaar Authentication in TTD: ఏపీలోన కూటమి ప్రభుత్వం ప్రముఖ తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో ఆధార్ ఆధార్ ఆథెంటికేషన్, ఈకేవైసీలు అమలు చేయనుంది. శ్రీవారి దర్శనాలు, సేవలు, వసతులు తదితర టికెట్ల బుకింగుల్లో దుర్వినియోగం, దళారుల ప్రమేయాన్ని నిరోధించేందుకు, పారదర్శకతను పెంచేందుకు ఈ చర్యలు చేపట్టనుంది. ఆధార్ వినియోగానికి అనుమతినిస్తూ గతేడాది ఆగస్టు 5న కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ సమ్మతి తెలపగా.. ఆ నోటిఫికేషన్ను దేవాదాయ శాఖ శనివారం గెజిట్లో ప్రచురించింది.
దేవాదాఖ శాఖ కార్యదర్శి వి.వినయ్చంద్ ఉత్తర్వులు జారీచేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల గుర్తింపును పరిశీలించేందుకు, ఒకరి పేరుతో మరొకరు రాకుండా నిరోధించేందుకు ఆధార్ అథెంటికేషన్ ఉపయోగపడనుంది. ఆలయంలో సేవలు పొందేసమయంలో తనిఖీ ప్రక్రియ క్రమబద్ధీకరణకు వీలవుతుంది.
భక్తుల ఆధార్ ఆథెంటికేషన్ అనుమతి కోసం గతేడాది జులైలో దేవాదాయ శాఖకు తితిదే ఈవో లేఖ రాశారు. దేవాదాయ శాఖ ఆ లేఖను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఆగస్టులో కేంద్రం నుంచి అనుమతి లభించింది. దానిపై నవంబరు 18న తితిదే బోర్డు తీర్మానం చేయగా ఈ వ్యవస్థను అమలు చేసేందుకు మార్గం సుగుమమైంది. అందుకు అనుగుణంగా ఇప్పుడు నోటిఫికేషన్ను గెజిట్లో ప్రచురించారు.