top political updates Highlights in Andhra Pradesh 2022 : ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా హైపర్ యాక్టివ్ స్టేట్. ప్రతీ రోజూ ఏదో వివాదం చోటు చేసుకుంటూనే ఉంటుంది. అదే ఎన్నికల వేడి ప్రారంభమైతే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి వేడి 2022 మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో కనిపించింది . అన్ని రాజకీయ పార్టీలు తమదైన రాజకీయ వ్యూహంతో ముందుకెళ్తాయి. ఈ కారణంగా అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటిని ఇప్పుడు చూద్దాం. 


అమరావతి - మూడు రాజధానులు !


ఆంధ్రప్రదేశ్‌లో ఏడాది మొత్తం ఎప్పుడూ వార్తల్లో నిలిచిన అంశం.. అమరావతి - మూడు రాజధానులు.  ఒక్క వైఎస్ఆర్‌సీపీ మూడు రాజధానుల వాదనను తెరపైకి తెస్తే.. మిగిలిన పక్షాలన్నీ ముక్త కంఠంతో అమరావతి వాదన వినిపించాయి. మార్చిలో ఏపీ హైకోర్టు అమరావతి నిర్మించి తీరాల్సిందేనని తీర్పు ఇస్తూ.. ఆ అంశంపై ఏపీ అసెంబ్లీ చట్టం చేయలేదని రిట్ ఆఫ్ మాండమస్ ప్రకటించింది. అక్కడ్నుంచి ప్రారంభమైన అమరావతి అంశం మలుపులు తిరుగుతూనే ఉంది. ప్రభుత్వం బిల్లులు వెనక్కి తీసుకుంది. ఆరు నెలల ఆలస్యంగా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయినా ఊరట లభించలేదు. ఈ మధ్యలో.. అమరావతి రైతులు అరసవిల్లి వరకూ పాదయాత్ర ప్రారంభించారు. కానీ వైసీపీ నేతల నిరసనలతో మధ్యలో ఆగిపోయింది. వైసీపీ నేతలు ప్రాంతీయ గర్జనలు ప్రారంభించారు. విశాఖ, కర్నూలులో గర్జనలు నిర్వహించారు. ఈ ఏడాది్ మొత్తం.. ఏపీలో హాట్ టాపిక్ అయిన  అంశం ఇదే. 


వైఎస్ఆర్‌సీపీకి విజయమ్మ రాజీనామా ! 


వైఎస్ఆర్‌సీపీకి ఎవరైనా రాజీనామా చేయవచ్చు కానీ.. విజయమ్మ రాజీనామా చేస్తారని ఎవరైనా అనుకుంటారా ?. అనుకోలేరు.. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని మరోసారి నిరూపించేలా వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి ఈ ఏడాదే విజయమ్మ రాజీనామా చేశారు. వైసీపీ ప్లీనరీ వేదికగా ఆమె ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. వైసీపీ పార్టీ నుండి తప్పుకుంటున్నానని స్పష్టం చేశారు. ఇకపై తన కుమార్తె, వైఎస్సార్‌ తెలంగాణపార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయమ్మ చెప్పారు. తెలంగాణలో వైఎస్‌ షర్మిల ఒంటరిగా పోరాటం చేస్తోందని, షర్మిలకు అండగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని తెలిపారు. జగన్‌, షర్మిల వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలో ఉన్నారని, తాను రెండు పార్టీల్లోనూ కొనసాగడం సరికాదన్నారు. అందుకే రాజీనామా నిర్ణయం తీసుకుంటున్నానని విజయలక్ష్మి పేర్కొన్నారు. దీంతో వైఎస్ఆర్‌సీపీ వ్యవస్థాపక గౌరవ అధ్యక్షురాలు వైదొలిగినట్లయింది. 


చంద్రబాబు - పవన్ భేటీ ...  మోదీ - పవన్ భేటీ !


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఏడాది మలుపు తిప్పే రాజకీయ పరిణామాలుగా భావించే భేటీల్లో...  చంద్రబాబుతో పవన్ భేటీ,  మోదీతో పవన్ భేటీ కావడం ముందు వరుసలో ఉంటాయి.  విశాఖపట్నం పవన్ టూర్‌ను పోలీసులు అడ్డుకున్న తర్వాత ఆయనకు సంఘిభావం చెప్పేందుకు చంద్రబాబు విజయవాడలోని ఓ హోటల్‌లో పవన్ ను కలిశారు. ఇది రాజకీయంగా సంచలనం సృష్టించింది. రెండు పార్టీల మధ్య పొత్తు వార్తలు హల్ చల్ చేశాయి. తర్వాత విశాఖ టూర్‌కు వచ్చిన మోదీ.. పవన్ కల్యాణ్‌ను ప్రత్యేకంగా ఆహ్వనించి భేటీ అయ్యారు. ఈ భేటీలో వారేం చర్చించుకున్నారన్నది కూడా హాట్ టాపిక్ అయింది. కానీ అసలు విషయం  బయటకు రాలేదు. ఈ రెండు భేటీలు మాత్రం రాబోయే రోజుల్లోనూ ట్రెండింగ్ కానున్నాయి. రాబోయే రోజుల్లో రాజకీయాలను మలుపు తిప్పుతాయని భావిస్తున్నారు. 


ఫిబ్రవరిలో ప్రభుత్వాన్ని వణికించిన ఉద్యోగుల మిలియన్ మార్చ్ 


పీఆర్సీ విషయంలో మోసం చేశారంటూ.. ఉద్యోగులు ఫిబ్రవరిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయవాడలో నిర్వహించిన సభ ఏపీలో హాట్ టాపిక్ అయింది. ప్రభుత్వం పోలీసులు ఎంత కష్టడి చేసినా.. విజయవాడకు ఉద్యోగులు వెల్లువలా వచ్చారు. మారువేషాల్లో పోలీసులను తప్పించుకుంటూ వాహనాలు రైళ్లు బస్సులు ప్రైవేటు రవాణా మార్గం ద్వారా విజయవాడ చేరుకుని ప్రభుత్వాన్ని కదిలించడమే కాదు ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ కెరటం ప్రభుత్వాన్ని నివ్వెరపరిచింది. ఓ ఉప్పెనలా బెజవాడకు చేరుకున్నారు. చెప్పిన టైమ్‌కి, చెప్పిన చోటుకొచ్చి నిలబడి గట్టిగానే తమ నిరసన తెలియజేశారు. నోటీసులనూ లెక్క చేయలేదు. అప్పటి వరకూ మొండికేసిన ప్రభుత్వం తర్వాత ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచింది. అప్పటికి చర్చలు పరిష్కారమైనా ఉద్యోగులు మాత్రం ఇప్పటికీ ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే ఉన్నారు. 


అమిత్ షా - జూనియర్ ఎన్టీఆర్ భేటీ చర్చనీయాంశం ! 


రాజకీయ నేతలు ఏం చేసినా అందులో రాజకీయం ఉంటుంది. బీజేపీ అగ్రనేత అమిత్ షా హైదరాబాద్‌లో జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశం కావడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. నోవాటెల్ హోటల్ లో వీరిద్దరి భేటీ జరిగింది. ఇద్దరూ కలిసి డిన్నర్ చేశారు. నోవాటెల్ హోటల్ లో దాదాపు 15 నిమిషాల పాటు వీరి భేటీ ఏకాంతంగా సాగింది. అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ ఏయే అంశాలపై చర్చించారు అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపింది.   జూనియర్ ఎన్టీఆర్ తో భేటీకి ముందు.. అమిత్ షా.. రామోజీరావును కూడా కలిశారు. దీంతో ఖచ్చితంగా రాజకీయం  ఉందని అనుకున్నారు. కానీ ఇప్పటి వరకూ ఈ భేటీ వల్ల ఎలాంటి రాజకీయ పరిణామాలు జరగలేదు. 


 చిరంజీవికి వైసీపీ రాజ్యసభ ఆఫర్ - దండం పెట్టిన మెగాస్టార్ 


చిరంజీవి రాజకీయంగా రిటైర్ అయ్యారు కానీ.. ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తూనే ఉన్నారు.  సినిమా టిక్కెట్ రేట్ల ఇష్యూలో ఓ సారి సీఎం జగన్‌తో ఆయన ఒక్కరే సమావేశం అయ్యారు. ఆ సమావేశం ముగిసిన తర్వాత  చిరంజీవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటు ఆఫర్ చేసిందని  జోరుగా ప్రచారం జరిగింది. వెంటనే చిరంజీవి రాజ్యసభ సీటుపై వస్తున్న ఊహాగానాలకు మెగాస్టార్ చిరంజీవి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. రాజకీయాల నుంచే తాను పూర్తిగా వైదొలిగినట్లు ప్రకటించేశారు. ఆ తర్వాత సినీ ప్రముఖులతో సీఎం జగన్ నిర్వహించిన ఓ సమావేశంలో.. పాల్గొన్న ఆయన విషయంలో సీఎం జగన్ గౌరవంగా ప్రవర్తించలేదన్న విమర్శలు వచ్చాయి. చిరంజీవి దండం పెట్టి జగన్ ను వేడుకున్న వీడియో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. ఇది కూడా రాజకీయవర్గాల్లో కీలక పరిణామంగా మారింది. 


ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరు తొలగింపు వివాదం 


ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా చర్చనీయాంశమైన వాటిలో ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం.  రాత్రికి రాత్రి తీసుకున్న ఈ నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీనిపై తెలుగుదేశం పార్టీ నిరసనలు వ్యక్తం చేసింది. అయితే ఏపీలో వైద్య రంగం ఎక్కువగా వైఎస్ వల్లే ఉందని.... అనేక మెడికల్ కాలేజీలు పెట్టారని అందుకే.. ఆయన పేరు సముచితమని  పెడుతున్నామని జగన్ వాదించి పెట్టేశారు. ప్రస్తుతం విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ లేదు.. వైఎస్ఆర్ హెల్త్ వర్శిటీ ఉంది. ఈ అంశంపై సీఎం జగన్ నిర్ణయాన్ని షర్మిల కూడా ఖండించారు. 


ఏపీలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు 


ఏప్రిల్‌లో ఏపీ సీఎం జగన్ మంత్రులందరితో రాజీనామాలు చేయించి.. కొత్త కేబినెట్ ను ఏర్పాటు చేశారు. ఈ అంశం కూడా హాట్ టాపిక్ అయింది. పాత మంత్రివర్గంలోని 11 మందిని మళ్లీ మంత్రివర్గంలో తీసుకోగా.. కొత్తగా 14 మందికి స్థానం కల్పించారు. పూర్తిగా ఎన్నికల కోణంలో కొన్ని సామాజికవర్గాలకు పదవుల్ని తీసేయడం.. మరికొన్ని సామాజికవర్గాలకు పదవులు కేటాయించడం చేయడంతో .. ఈ కూర్పు కూడా చర్చనీయాంశమైంది . కొన్ని కులాల ఓట్లు రావని జగన్ డిసైడై ఇలా చేశారని చర్చించుకున్నారు. ఈ కేబినెట్ మార్పు ఇప్పటికీ హాట్ టాపిక్ అవుతోంది.  


వివేకా హత్య కేసు  రాజకీయంగా ఇప్పటికీ హాట్ టాపిక్కే ! 


వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకా హత్య కేసు ఈ ఏడాది కూడా రాజకీయంగా కీలకంగా నిలిచింది. సాక్షులను నిందితులు బెదిరిస్తున్నందున తన తండ్రి హత్య కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టు  కేసును విచారిస్తుందని స్పష్టం చేసింది. 2019 మార్చి 15 న వివేకానందరెడ్డి హత్య జరిగింది. తొలుత గుండెపోటుతో చనిపోయారని వార్తలు వచ్చినా ఆ తర్వాత హత్యగా తేలింది. అయితే కేసు విచారణపై వివేకా కూతురు సునీత అనుమానం వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపేందుకు కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  ఈ కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి విచారణ తెలంగాణలో జరగనుంది. 
 
 ఏపీలో పార్టీ పెడతానంటూ సమావేశాలు నిర్వహించిన షర్మిల భర్త బ్రదర్ అనిల్ 


ఏపీలో కొత్త పార్టీ పెట్టేందుకు బ్రదర్ అని సమావేశాలు నిర్వహించడం ఈ ఏడాది  హైలెట్ అయింది. విజయవాడ, విశాఖతో పాటు పలు చోట్ల సమావేశాలు నిర్వహించారు. బీసీలను ముఖ్యమంత్రిని చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. అయితే పార్టీ పెడుతానని ఆయన ఎప్పుడూ కన్ఫర్మ్ చేయలేదు. ఓ సందర్భంలో పార్టీ ప్రకటనకు సిద్ధమయ్యారన్న ప్రచారం జరిగింది.కానీ తర్వాత వెనక్కి తగ్గారు. మళ్లీ ఎలాంటి రాజకీయ సమావేశాలు ఏర్పాటు చేయలేదు. ఆయన భార్య షర్మిల.. ఎక్కడైనా పోటీ చేయవచ్చని ప్రకటించారు. కానీ తాను తెలంగాణకే పరిమితమని స్పష్టం చేశారు. 2023లో బ్రదర్ అనిల్ ఏమైనా రాజకీయ సంచనాలను చేస్తారేమో వేచి చూడాలి.  


ఇవీ 2022 ఏపీ టాప్ పొలిటికల్ డెవలప్‌మెంట్స్.