శ్రీనివాసుడి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆగస్టు 23వ తేదీ మంగళ వారం ఒక్క రోజునే 68,467 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 35,506 మంది తలనీలాలు సమర్పించగా.. 4.67 కోట్ల రూపాయల హుండీ ఆదాయం నెలకొది. అయితే సర్వదర్శనం భక్తుల వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోయాయి. దీంతో సామాన్య భక్తులు బయట క్యూలైన్స్ లో టీబీసీ వరకు వేచి ఉన్నారు. ఇక స్వామి వారి సర్వదర్శనానికు 20 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. 


శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో‌ భాగంగా బుధవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిని స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వీఐపీ భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వామి వారికి రెండో గంట నివేదన, బలి జరిపారు. 


ఎందుకు రద్దు చేసిందంటే..?


ప్రతి "బుధవారం" రోజు నిర్వహించే "సహస్రకళషాభిషేకం"ను విగ్రహ అరుగుల పరిరక్షణకై టీటీడీ రద్దు చేసింది. కేవలం ఏడాదికి‌ ఓ మారు మాత్రమే సర్కారు వారి సహస్రకళషాభిషేకాన్ని నిర్వహిస్తొంది. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. శ్రీవారి ఉత్సవ మూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి,‌ ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభవోత్సవ మంపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు అర్చకులు. సాయంకాలం సహస్ర దీపాలంకారసేవ కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు.


నిత్య సేవల్లో ‌భాగంగా సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి సహస్ర దీపాలంకార సేవను నిర్వహించి, తిరు ఉత్సవం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఉత్సవ మూర్తులు శ్రీవారి ఆలయం చేరుకోగానే, సర్వ దర్శనం భక్తులను నిలిపి వేసి రాత్రి  కైంకర్యాలు ప్రారంభిస్తారు. తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు. సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు.