Puthalapattu Politics: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది రోజు రోజుకి రాజకీయ సమీకరణాలు మారుతూ రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ పార్టీలు పోటా పోటీగా నువ్వా, నేనా అంటూ ఎన్నికల బరిలో తేల్చుకునేందుకు సిద్దం అవుతున్నాయి. ఇక చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లాలో పూతలపట్టు నియోజకవర్గంకు వస్తే వైసీపీ, వర్సెస్ టీడీపీగా రాజకీయ పోరు కొనసాగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు మరోసారి అవకాశం దక్కకపోయే సరికి ఏకంగా అధిష్టానంపైనే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.


ఒకసారి కాంగ్రెస్, రెండుసార్లు వైసీపీ
చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి తొలిసారి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రెండుసార్లు వరుసగా వైసీపీ విజయ ఢంకా మోగించింది. కానీ ఈసారి చరిత్ర తిరగరాసేందుకు సిద్ధమయ్యారు టీడీపీ నేత డాక్టర్ కలికిరి మురళీమోహన్. పూతలపట్టులో తెలుగుదేశం జెండా రెపరెప లాడించబోతున్నారు. ఇప్పటికే ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేయగా ఎన్నికల సమరం కోసం వ్యూహాత్మకంగా పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేస్తున్నారు మురళీ మోహన్. పూతలపట్టు నియోజవర్గం ఏర్పడిన నాటి నుంచి అక్కడ టీడీపీకి బలమైన కేడర్ ఉంది. అయితే ఆ కేడర్ ని నడిపించే లీడర్ ఇన్నాళ్లు కనపడలేదు. ఇప్పుడు మురళీ మోహన్ రూపంలో వారికి సరైన లీడర్ దొరికారనే భావిస్తున్నారు. గత మూడు దఫాలుగా ఇక్కడ టీడీపీ విజయం సాధించక పోవడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయనే చెప్పాలి.


గతంలో టీడీపీ ఎదుర్కొన్న సమస్యలలో వర్గ పోరు మొదటిది అయితే, కార్యకర్తల మధ్య ఐక్యత లేకపోవడం మరో కారణంగా రెండోవది అయితే, నేతల మధ్య సమన్వయ లోపం, ఏ నాయకుడు చెబితే వినాలో కార్యకర్తలకు తెలియక పోవడంతో, టీడీపీ గత మూడు పర్యాయాలు పరాజయం పాలవుతూ వచ్చింది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం పార్టీ క్యాడర్ లో నూతన ఉత్సాహం నింపింది. జర్నలిస్ట్ గా ప్రజా సేవకు అంకితమైన పాత్రికేయుడు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ను  పూతలపట్టు నియోజకవర్గ  ఇన్ చార్జ్ గా నియమించడంతో పార్టీ గాడిలో పడిందని టీడీపీ‌ కేడర్ లో ప్రస్తుతం వినిపిస్తున్న మాట..



పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బాధ్యతలు చేపట్టిన మురళీ మోహన్, మొదట పార్టీలోని మూలాలను సరిదిద్దే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. స్థానికంగా పార్టీలో ఉన్న లోపాలను గుర్తించి ఆ లోపాలకు సవరిస్తూ కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతూ, మండల, నియోజకవర్గ స్థాయి నేతల్లో ఉన్న అనైక్యతను పోగొట్టి అందరం తెలుగు తమ్ముళ్లమనే భావన తీసుకురావడంలో పుల్ సక్సెస్ అయ్యారు. జర్నలిస్ట్ గా తన అనుభవాన్ని ఉపయోగిస్తూ కార్యకర్తలకు, ప్రజలకు తనదైన శైలిలో భరోసా కల్పిస్తున్నారు. దీంతో క్యాడర్ లో నూతనోత్సాహం నెలకొంది. ఇన్నాళ్లు వర్గాలుగా ఉన్న క్యాడర్ మురళీ మోహన్ పూతలపట్టు పగ్గాలు తీసుకున్నాకా గెలుపు దిశగా ఉరకలు వేస్తుంది అనే చెప్పాలి. అధికార పార్టీ చేపట్టిన పలు సర్వేలు, ఇతర ప్రైవేట్ సర్వేలు సైతం పూతలపట్టులో టీడీపీ విజయం నల్లేరు మీద నడకే అంటున్నాయి. మొదటి సారి ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలుపు ఖాయంగా తెలుస్తోంది. 


వైసీపీకి తలనొప్పి
ఎమ్మెల్యే ఎంఎస్ బాబుపై ఉన్న వ్యతిరేకత, మరో నేతను వెతికి ఇక్కడ నిలబెట్టినా ప్రయోజనం లేదన్న సంకేతాలు వైసీపీకి తలనొప్పిగా మారింది. సొంత పార్టీ నేతలనే పట్టించుకోక పోవడం,‌ తనదైనశైలిలో పార్టీ కార్యక్రమాలు పాల్గొంటూ, తన వారికే పదవులు కట్టబెడుతూ, అయిన వారినే దగ్గర పెట్టుకోవడంతో పార్టీ కేడర్ లో భారీగా వ్యతిరేకత మొదలైంది. సమస్యలతో ఎమ్మెల్యే వద్దకు వచ్చినా వారికి సమస్యలు తీర్చడం మానేసి, తనే ఓ‌ సమస్యగా ఎంఎస్.బాబు తయారు కావడంతో నియోజకవర్గం ప్రజల నుండి వ్యతిరేకత రావడం, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకు వెళ్ళినా ఎమ్మెల్యేను గ్రామాల్లోకి రానీకుండా అడ్డుకోవడం వంటివి జరిగాయి. మరోవైపు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు ఆధిపత్య ధోరణి విద్యావంతులకు నచ్చక పోవడం, దీంతో ఎస్సీ మేధావులు వైసీపీని వీడి టీడీపీ వైపు చూసే పరిస్ధితికి చేరింది. దళిత వాడల్లో పల్లె నిద్ర చేపట్టడం, వారితో మమేకం కావడంలో మురళీ మోహన్ సక్సెస్ అవ్వగా, బహిరంగ సభల్లో సైతం దళితుల పక్షాన తానున్నాననే భరోసా కల్పిస్తున్నారు..
 
బీటలు బారుతున్న కంచుకోటను కాపాడుకొనే క్రమంలో వైసీపీ ఎత్తులు వేస్తూ టీడీపీకి చెందిన ఒకరిద్దరు ఎస్సీ నేతలకు ఎర వేస్తూ, వారి ద్వారా టీడీపీని బలహీన పరిచేందుకు ప్రయత్నం జరిగాయి. కానీ వైసీపీ ఎత్తులను పసిగట్టినా టీడీపీ అభ్యర్ధి మురళిమోహన్ తీసుకున్న నిర్ణయాలతో వలసలు ఆగిపోగా, వైసీపీ నుంచి కొందరు కీలక నేతలు టీడీపీ వైపు వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజా క్షేత్రంలో పోరాటం చేస్తున్న మురళీ మోహన్ పై పోలీసులు 12 కేసులు పెట్టారు. 53 రోజులు ఆయన అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది. అయినా కూడా భయపడకుండా ప్రజల పక్షానే నిలబడ్డారు మురళీ మోహన్. మొత్తమ్మీద టీడీపీ బోణీ కొట్టని పూతలపట్టుని టీడీపీకే కంచుకోటగా తయారు చేసి, 2024లో టీడీపీ గెలిచే స్థానాలను పూతలపట్టు నుంచి లెక్కబెట్టుకోవాలనే ధీమాతో ఉంటే, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్.బాబుకు వ్యతిరేకంగా సర్వే రావడంతో అధిష్టానం మరోసారి ఎంఎస్.బాబుకు స్ధానం కల్పించేందుకు నిరాకరించింది.


దీంతో తీవ్రంగా మనోవేదనకు గురైన ఎమ్మెల్యే అధిష్టానంపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. అదే రీతిలో మంత్రి పెద్దిరెడ్డి కూడా ఎంఎస్.బాబు వ్యాఖ్యలను ఖండిస్తూ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి రేసులో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌ను రంగంలోకి దింపేందుకు సిద్దం అవుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే వైసీపీ రేసులో సునీల్ తో పాటుగా మరో ముగ్గులు రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. నియోజకవర్గంలోని వారికి కాకుండా స్ధానికేతరులకు పార్టీ భాధ్యతలు అప్పగిస్తే ఈసారి పూతలపట్టు నియోజకవర్గం టీడీపీ విజయం తధ్యంమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు..