Tirumala Laddu: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు స్వామి వారి దర్శనంతో పాటు లడ్డూ ప్రసాదం లభించడం ఎంతో పుణ్యఫలంగా భావిస్తారు. అలాంటి శ్రీవారి లడ్డూ ప్రసాదంపై గత రెండు రోజులు కాలంలో జరుగుతున్న ప్రచారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


తిరుమల శ్రీవారి ప్రసాదాలు ఎన్ని ఉన్నా అందులో భక్తులకు తెలిసింది.. ఇష్టమైంది అయితే లడ్డూ ప్రసాదం. అలాంటి లడ్డూ ప్రసాదం కోసం తిరుమల వెళ్లి వచ్చిన వారిని సైతం అడుగుతుంటారు. మాకు లడ్డూ ప్రసాదం తెచ్చారా అని అంటారు. అందుకే లడ్డూలు ఎన్ని వీలైతే అన్ని ఇంటికి తీసుకెళ్లాలనే ఆలోచనతో భక్తులు ఉంటారు.  


శ్రీవారికి కూడా ఎంతో ప్రీతికరమైనది లడ్డూ అని అర్చకులు చెబుతుంటారు. లడ్డూ ప్రసాదాన్ని వైష్ణవ బ్రాహ్మణులు, బ్రాహ్మణులు తయారు చేస్తారు. పురాణ కాలం నుంచి బుందీ తయారీ బ్రాహ్మణులు చేస్తుంటే వాటిని లడ్డూగా మార్చేది మాత్రం వైష్ణవ బ్రాహ్మణులు. నేటికి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.


లడ్డూ తయారీలో వినియోగించేది 
తిరుమల శ్రీవారి లడ్డూ రుచి, శుచి, నాణ్యత, బరువు తప్పకుండా ఉండేలా టీటీడీ చర్యలు చేపట్టింది. ఇందుకు ఒక ప్రత్యేక అధికారి సైతం ఉంటారు. తిరుమల లడ్డూ కోసం దిట్టం అని ఉంటుంది. 5001 లడ్డూలకుగాను 165 కిలోల ఆవు నెయ్యి, 180 కిలోల శనగపిండి, 400 కిలోల చక్కెర, 30 కిలోల జీడిపప్పు, 16 కిలోల ఎండు ద్రాక్ష, 8 కిలోల కలకండా, 4 కిలోల యాలకులు వేసి తయారు చేస్తారు. ఈ లడ్డూ తయారీకి ప్రపంచ వ్యాప్తంగా పేటెంట్ హక్కులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 200 నుంచి 250 కోట్లు టీటీడీ ఈ లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగిస్తుంది.


లడ్డూ నాణ్యత లేదా..? 
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటేనే ఎక్కడ లేని రుచి ఉంటుందని ప్రతీతి. ఒక లడ్డూ ఉంటే ఇళ్లు మొత్తం సువాసనతో నిండిపోతుంది. అలాంటి లడ్డూ ప్రస్తుతం అందుబాటులో లేదు. ఇది లడ్డూలో వినియోగించే ముడి సరుకులు, నెయ్యి కారణమని తేలింది. లడ్డూ బరువు గురించి గత 5 సంవత్సరాల కాలంలో పట్టించుకున్న అధికారులు లేరు. దీనిపై భక్తులు ఎవరైనా ఫిర్యాదు చేసిన వారిపై అక్కడ సిబ్బంది నుంచి పై స్థాయి అధికారుల వరకు దూషణలకు దిగిన పరిస్థితి ఉండేది. దీంతో స్థానికులు సైతం ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయింది.


కూటమి ప్రక్షాళన ఇదేనా..!
ఎన్నికల ఫలితాలు.. ప్రమాణ స్వీకారం అనంతరం తిరుమలకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా తిరుమల వేదికగా ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం తిరుమల నుంచి ప్రక్షాళన చేస్తానని అన్నారు. ఆ మరుసటి రోజే టీటీడీ ఈవోగా శ్యామలరావును నియమించారు. ఆ తరువాత అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని ఇంటికి పంపి అదనపు ఈవోగా వెంకయ్య చౌదరిని నియమించారు. ఆ తరువాత విజిలెన్స్ విచారణ అంటూ హడావిడి జరిగింది. విజిలెన్స్ విచారణ మొత్తం ఇంజినీరింగ్ విభాగం పైన జరిగింది. ఆ తరువాత నెయ్యి నాణ్యత సరిగ్గా లేదు.. నెయ్యి మార్చుతున్నట్లు ఈవో ప్రకటించారు. అప్పటి నుంచి ఎలాంటి హడావుడి లేదు. దీంతో టీటీడీ ప్రక్షాళన అంటే ఇదేనా అని చర్చించే పరిస్థితి ఎదురైంది.


నాణ్యత పరీక్షల ల్యాబ్ 
టీటీడీ అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న హోదా.. ఉద్యోగ బలం, వ్యవస్థలు, ఆర్థిక బలం, అధికారులు ఉన్నారు. టీటీడీ తలుచుకుంటే ప్రపంచంలో ఏదైన తీసుకొచ్చే పరిస్థితి. అలాంటి టీటీడీ నాణ్యమైన లడ్డూ ఎందుకు అందించలేక పోయింది అంటే మాత్రం వైసీపీయో టీడీపీయో... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాలదో కాదు. టీటీడీ చరిత్రలో రాజకీయ పలుకుబడితో ఏర్పాటైన పాలకమండలి సభ్యులది అని కొందరు విశ్రాంతి అధికారులు చెబుతున్నారు. అసలు ఇంత వ్యవస్థ ఉన్న టీటీడీలో ఎందుకు నాణ్యత ప్రమాణాలు తనిఖీ చేసే వ్యవస్థ లేదు.. ఎందుకు ల్యాబ్ ఏర్పాటు చేయలేకపోతున్నారు అనేది అర్ధం కానీ ప్రశ్న. అసలు టీటీడీ లాంటి పుణ్యక్షేత్రంలో ఎంతో ఖ్యాతి ఉన్న శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వినియోగించారంటే అసలు ఏమి జరుగుతోంది... టీటీడీ ఉన్నతాధికారులు స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉందని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. 


Also Read: తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కన్ఫామ్, వారిపై కఠిన చర్యలు - చంద్రబాబు