తిరుపతిలో రెండేళ్ల బాలుడు కిడ్నాప్‌ అయ్యాడు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లోని ప్లాట్‌ఫామ్‌ నెంబర్‌ 3 దగ్గర ఈ సంఘటన జరిగింది. చెన్నైలోని వరసవక్కంకు చెందిన  రామస్వామి చంద్రశేఖర్ కుటుంబం శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చింది. దర్శనం చేసుకున్న తర్వాత... తిరిగి వెళ్లేందుకు తిరుపతి బస్టాండ్‌కు వచ్చారు. చెన్నై బస్సులు ఆగే స్టాప్‌ దగ్గర రాత్రి సేదతీరారు. అయితే, అర్థరాత్రి రెండు, రెండున్న గంటల మధ్యలో బాలుడు తప్పిపోయినట్టు గుర్తించారు తల్లిదండ్రులు. బాబు కోసం చుట్టుపక్కల  వెతికినా కనిపించలేదు. దీంతో... వెంటనే తిరుపతి పోలీసులను ఆశ్రయించారు. 


కిడ్నాప్‌ అయిన చిన్నారి చెన్నైలోని వరసవక్కంకు చెందిన రామస్వామి చంద్రశేఖర్ రెండో కుమారుడు అరుల్ మరుగన్‌గా గుర్తించారు. బాలుడి వయస్సు రెండేళ్లు. బస్టాండ్‌లో  నిద్రపోతుండగా ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తిరుపతి పోలీసులు... బస్టాండ్‌లోని సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. కిడ్నాప్‌ అయిన  బాలుడిని ఎత్తుకుపోతున్న ఫుటేజ్‌ని గుర్తించారు. బాలుడితోపాటు కిడ్నాపర్‌ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం సర్కిల్ వద్ద ఉన్న కెన్సస్ హోటల్ వైపు వెళ్లినట్టు  సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కిడ్నాప్‌ కోసం గాలిస్తున్నారు. 


బాలుడిని ఎత్తుకెళ్లిన కిడ్నాపర్‌ వయస్సు 32ఏళ్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అతను వైట్‌ షూ, గ్రీన్‌ కలర్‌ షర్ట్‌ వేసుకున్నట్టు సమాచారం. తిరుపతి  బస్టాండ్‌లోని రిజర్వేషన్‌ కౌంటర్‌ నుంచి.. బాలుడిని బస్టాండ్‌ బయటకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి... కిడ్నాప్‌ర్‌ కోసం  గాలిస్తున్నారు. తిరుపతిలోని అన్ని పోలీస్‌స్టేషన్లకు సమాచారం అందించారు. బాలుడి ఆచూకీ కనుక్కునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు తిరుపతి పోలీసులు.


గత ఏడాది ఇలానే... తిరుమలలో ఐదేళ్ల బాలుడు కిడ్నాప్‌ అయ్యాడు. శ్రీవారి ఆలయం ఎదురుగానే ఈ కిడ్నాప్‌ జరిగడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. గుండు  గీయించుకున్న మహిళ... ఐదేళ్ల బాలుడు గోవర్ధన్‌ను ఎత్తుకెళ్లింది. బాలుడి తల్లి తిరుమల కొండపై భక్తులకు తిరునామాలు పెడుతూ జీవనం సాగిస్తోంది. 2022, మే ఒకటో  తేదీన శ్రీవారి ఆలయంలో ముందు భక్తులకు నామాలు పెడుతూ... బాలుడిని పక్కన కూర్చోబెట్టింది తల్లి. ఆ సమయంలోనే బాలుడిని అపహరించింది మహిళ. మే ఒకటో తేదీ  సాయంత్రం 5గంటల 45 నిమిషాలను బాలుడిని తీసుకుని వెళ్లిపోయింది. బాలుడి తల్లి ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా విచారణ జరిపారు. ఐదు  రోజుల పాటు బాలుడి కోసం గాలించారు. చివరికి కిడ్నాప్‌ చేసిన మహిళే.. బాలుడితోపాటు మళ్లీ తిరుమల కొండకు రావడంతో ఆమెను పట్టుకున్నారు పోలీసులు. బాలుడిని  తల్లికి అప్పగించి కిడ్నాపర్‌ను అరెస్ట్‌ చేశారు.


ప్రస్తుతం... తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో తిరుమల, తిరుపతి బస్టాండ్‌ కూడా కిక్కిరిసింది. ఈ సందట్లో కిడ్నాపర్లు కూడా మాటు వేసినట్టు సమాచారం.  రాత్రిళ్లు బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల దగ్గర నిద్రపోతున్న పిల్లలను ఎత్తుకెళ్లేందుకు కాచుకు కూర్చున్నారో ఏమో. చిన్నపిల్లలతో వెళ్లే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండటం చాలా  అవసరం. పిల్లలతో పాటు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో నిద్రపోయే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. పిల్లలను ఓ కంట కనిపెడుతూనే ఉండాలి. ఆదమరిచి నిద్రపోయారో..  అంతే సంగతులు. పిల్లలను కిడ్నాపర్లు అప్పగించినట్టే. తస్మాత్‌ జాగ్రత్త.