TTD Sarva Darshan Tickets: శ్రీవారి దర్శనార్థం అనూహ్య రీతిలో భక్తులు తిరుపతికి చేరుకున్నారు. నిన్న అర్ధరాత్రి నుండి స్వామి వారి సర్వదర్శనం టోకెన్ కోసం భారీ సంఖ్యలో భక్తులు క్యూలైన్ లో వేచి ఉన్నారు. పాఠశాలలకు మధ్యాహ్నం సెలవులు కావడంతో తిరుమలకు భక్తుల తాకిడి మరింత పెరిగింది. తిరుపతిలో స్వామి వారి సర్వదర్శనాల టిక్కెట్లను రైల్వే స్టేషన్ కు సమీపంలోని గోవిందరాజ స్వామి సత్రాలు, బస్టాండు సమీపంలోని శ్రీనివాసం, అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ వద్ద కేటాయిస్తోంది టీటీడీ. 

  


5 రోజులు విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
అధిక రద్దీ కారణంగా రేపు అనగా బుధవారం నుండి ఆదివారం వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. 5 రోజులు విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారని భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని టీటీడీ పీఆర్వో ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


అధిక రద్దీ నేపధ్యంలో ఈ నెల తొమ్మిదోవ తారీఖునే 12కి సంబంధించిన టోకెన్ల (Sarva Darshan Tickets At Tirumala)ను జారీ చేసింది. ఆపై రెండు రోజుల పాటు ఆది, సోమవారాల్లో టోకెన్ల జారీ ప్రక్రియని టీటీడీ తాత్కాలికంగా నిలిపి వేసింది. దీంతో టిక్కెట్లు తీసుకున్న భక్తులు రెండు రోజుల పాటు తిరుపతిలో వేచి ఉండాల్సిన పరిస్ధితి ఏర్పడింది. మరోవైపు సర్వదర్శనం టోకెన్ల కోసం సుదూర ప్రాంతాల నుండి విచ్చేసి భక్తులు కూడా రెండు రోజుల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. ఈక్రమంలో ఈనెల 13వ తేదీకి సంబంధించిన టోకెన్ల ప్రక్రియ నేటి ఉదయం నుండి ప్రారంభించింది. దీంతో పెద్దయెత్తున భక్తులు క్యూలైన్ వద్దకు చేరుకోవడంతో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో క్యూలైన్స్‌లో ఉన్న చంటిబిడ్డలు, వయోవృద్దులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా ఊపిరి ఆడక స్వామి దర్శనం మాకు వద్దంటూ వెను తిరిగారు.


భక్తులపై పోలీసుల దురుసు ప్రవర్తన
క్యూలైన్స్ వద్దకు చేరుకున్న పోలీసులు భక్తులను నియంత్రించలేక భక్తులపై దురుసుగా ప్రవర్తించారు.‌ క్యూలైన్స్ వద్ద సరైన సౌఖర్యాలు లేక భక్తులు మండుట ఎండలో క్యూలైన్స్ లో వేచి ఉండడమే కాకుండా త్రాగునీరు లేకుండా ఇబ్బందుకు గురయ్యారు. గత రెండు రోజులుగా తిరుపతిలో తిండి తిప్పలు లేకుండా వేచి చంటిపిల్లలతో, వయోవృద్దులతో వేచి ఉన్నా తమకు టోకెన్లు మాత్రం అందలేదని భక్తులు మండిపడుతున్నారు. కోవిడ్19కు ముందు వరకూ జారీ చేస్తున్న విధానాన్ని టీటీడీ మళ్లీ అమలు చేయాలని భక్తులు కోరుతున్నారు. 


టీటీడీ అవలంబిస్తున్న విధానంపై భక్తులు తీవ్ర స్ధాయిలో మండిపడుతున్నారు. టోకెన్లు పొందిన భక్తులు తమకు కేటాయించిన సమయం వరకూ తిరుపతిలో వేచి ఉండలేక తిరుగు ప్రయాణం అవుతున్న పరిస్ధితులు నెలకొన్నాయి. మరోవైపు గోవిందరాజసత్రం వద్ద అధిక భక్తుల రద్దీ కారణంగా క్యూలైన్స్ వద్ద ఉన్న భక్తుల తపులాటతో భక్తులకు గాయాలు అయ్యాయి..
Also Read: Zodiac Signs : ఏప్రిల్ 13 నుంచి రాశి మారనున్న బృహస్పతి, ఈ ఐదు రాశులవారికి అదృష్టం మామూలుగా లేదు