అఖిలాండ కోటి బ్రహ్మాండ‌ నాయకుడు కొలువై ఉన్న తిరుమల పుణ్యక్షేత్రానికి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఎన్నో వ్యయ ప్రాయాసలకోర్చి తిరుమలకు చేరుకుంటారు భక్తులు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్ధం తిరుమలకు చేరుకునే భక్తులకు టిటిడి‌ వివిధ రూపాల్లో దర్శనం కల్పిస్తుంది.. సర్వదర్శనం, దివ్యదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, విఐపి బ్రేక్ దర్శనం, శ్రీవాణి‌ట్రస్టు, ఆర్జిత సేవ, వివిధ ట్రస్టులకు విరాళాలు అందించిన దాతలకు దర్శనం ఇలా అనేక రూపాల్లో టిటిడి భక్తులకు స్వామి వారి‌ దర్శన భాగ్యం‌ కల్పిస్తుంది. ఇలా వివిధ పద్దతుల్లో స్వామీ వారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తులు పూనీతులు అవుతుంటారు. 


కరోనాకు ముందు కరోనా తర్వాత 


కరోనా కంటే ముందు వరకూ టిటిడిలో‌ కొనసాగేది అలా ఉంటే కరోనా తర్వాత దర్శనాల తీరు మారిపోయింది. కోవిడ్ తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలోనే‌ భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ ఉంటేనే లోపలికి అనుమతి ఇస్తున్నారు.  వీటన్నింటినీ అలిపిరి‌ తనిఖీ కేంద్రం వద్ద  టిటిడి విజిలెన్స్ సిబ్బంది చెక్ చేసి భక్తులను తిరుమల కొండకు అనుమతిస్తున్నారు. 


కరోనా రూల్స్‌ తప్పనిసరి


కొండకు చేరుకున్న ప్రతి భక్తుడు మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించే విధంగా టిటిడి‌ చర్యలు చేపడుతుంది. పరిమిత సంఖ్యలోనే‌ ఆన్లైన్‌లో విడుదల చేసే ప్రత్యేక ప్రవేశ దర్శనం, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ‌ఉన్నతాధికారుల సిఫార్సు లేఖలు, శ్రీవాణి ట్రస్టు, వర్చువల్ ఆర్జిత సేవ టిక్కెట్లు కలిగిన భక్తులనే ప్రస్తుతం తిరుమలకు అనుమతిస్తుంది‌ టిటిడి. కోవిడ్ మహమ్మారి కారణంగా‌ సర్వదర్శనాన్ని రెండు ఏళ్ళ‌గా నిలిపి వేసింది. దీంతో సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. 


గ్రామీణ ప్రాంత భక్తుల్లో అసంతృప్తి


సామన్య భక్తుల కోసం ఆఫ్లైన్ టిక్కెట్లు జారీ చేసేందుకు టీటీడీ చాలా సార్లు ట్రై చేసింది. కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉండడం, క్యూలైన్స్ వద్ద అధిక రద్దీ కారణంతో జారీని వాయిదా వేస్తూ వచ్చింది. 
ప్రస్తుతం పరిమిత సంఖ్యలో ఆన్లైన్ ద్వారా టోకెన్లు కేటాయిస్తుంది టిటిడి. ఇలా ఆన్లైన్ టోకెన్లు జారీ చేయడంతో చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో‌ భక్తులకు దర్శన టోకెన్లు అందడం లేదు. స్వామి వారి దర్శనానికి దూరమవుతున్నామన్న అసంతృప్తి వారిలో ఉంది. ఈ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని భక్తుల‌ వద్ద నుంచి టిటిడికి భారీగా లేఖలు వస్తున్నాయి. దీంతో టిటిడి ఆలోచనలో పడింది. అందుకే ఆప్లెన్‌ టికెట్‌ జారీ ప్రారంభించాలని భావించింది. 


15 నుంచి సర్వదర్శనం టోకెన్లు


ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో వైద్య నిపుణుల సలహాలు, సూచనలతో సర్వదర్శనం టోకెన్లపై టిటిడి‌ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఆఫ్లైన్‌లో నిత్యం 15 వేల సర్వదర్శనం టోకెన్లను భక్తులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాస, గోవిందరాజ సత్రాల్లో సర్వదర్శనం టోకెన్లు‌ జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రాల వద్ద ప్రతి భక్తుడు భౌతిక దూరం పాటించే‌ విధంగా‌ క్యూలైన్‌లో గుర్తులు వేస్తోంది‌ టిటిడి. 


వచ్చే నెలలో ఆర్జిత సేవలకు అనుమతి!


దాదాపు రెండు ఏళ్ళ తరువాత మొదటిసారి‌ సామాన్య భక్తుల కోసం అత్యధిక సంఖ్యలో సర్వదర్శనం టిక్కెట్లు టిటిడి జారీ చేయడంపై శ్రీవారి భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఈ ఏడాది మార్చి నెలలో జరుగబోవు టిటిడి పాలక మండలి సమావేశంలో శ్రీవారి ఆర్జిత సేవలపై టిటిడి నిర్ణయం తీసుకోనుంది. ఆర్జిత సేవలకు భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతించేందుకు పాలక మండలి నిర్ణయం తీసుకోనుంది.