తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ముల ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షునిగా తాను ప‌ని చేసిన నాలుగేళ్ల‌లో ఎక్కువ‌ మంది సామాన్య భ‌క్తుల‌కు శ్రీ వేంక‌టేశ్వ‌ర‌ స్వామివారి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు తాము కొన్నినిర్ణయాలు తీసుకున్నామని టీటీడీ ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 టికెట్లు ర‌ద్దు చేయ‌డం, సామాన్యుల‌కు స్వా మివారి తొలి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు విఐపి బ్రేక్ స‌మ‌యాన్ని మార్చుతూ తీసుకున్న నిర్ణ‌యాలు అత్యంత సంతృప్తి నిచ్చాయ‌ని సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమ‌ల ద‌ర్శ‌నానికి వ‌చ్చే సామాన్య భ‌క్తులకు వ‌స‌తి, ఇత‌ర స‌దుపాయాలు మెరుగుప‌ర‌చ‌డం కోసం అనేక నిర్ణ‌యాలు తీసుకున్నామ‌ని, ఈ రెండు నిర్ణ‌యాలు మాత్రం ఎప్ప‌టికీ మ‌రువ‌లేనివ‌ని తెలిపారు. నాలుగేళ్ల‌ పాటు ఛైర్మ‌న్‌గా ప‌ని చేసే అదృష్టం ప్ర‌సాదించిన శ్రీ‌ వేంక‌టేశ్వ‌ర‌ స్వామి వారికి, త‌నకు అవ‌కాశం ఇచ్చిన వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌ రెడ్డికి, టీటీడీ పాలకమండలి సభ్యులు, అధికారులు, సిబ్బందికి సుబ్బారెడ్డి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.


నూత‌న ఛైర్మ‌న్‌గా నియ‌మితులైన భూమ‌న క‌రుణాక‌ర్‌ రెడ్డి అనుభ‌వం టీటీడీ అభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఆయ‌న చెప్పారు. టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి చివ‌రి స‌మావేశం సోమ‌వారం (ఆగస్టు 7) తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అధికారులు ఛైర్మ‌న్ నాలుగేళ్ల ప‌ద‌వీ కాలంలో తీసుకున్న ముఖ్య‌మైన నిర్ణ‌యాలకు సంబంధించిన ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. అనంత‌రం వైవీ.సుబ్బారెడ్డి మీడియాకు బోర్డు నిర్ణ‌యాల‌ను వెల్ల‌డించారు. 4 కోట్లతో అలిపిరి కాలిబాట మార్గంలోని మొదటి ఘాట్‌ రోడ్డులో మోకాలి మెట్టు నుండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం వరకు ఫుట్‌పాత్‌ షెల్టర్ల నిర్మాణానికి పాలక మండలి నిర్ణయం తీసుకుందన్నారు.


2.20 కోట్లతో తిరుమలలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డులో విద్యుత్‌ బస్సుల కోసం ఛార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసేందుకు, రూ.2.50 కోట్లతో తిరుమ‌ల‌లోని పీఏసీ-1లో అభివృద్ధి పనులకుగానూ పాలక మండలిలో చర్చించి నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇక 24 కోట్లతో రెండు ఘాట్ రోడ్ల‌లో ర‌క్ష‌ణ గోడ‌ల నిర్మాణానికి పాలక మండలి ఆమోదం తెలిపింది. రూ.4.50 కోట్లతో శ్రీవారి ప్రసాదాలు, అన్నప్రసాదం తయారీకి వినియోగించే వంట సరుకులను మరింత నాణ్యంగా పరిశోధించేందుకు వీలుగా అత్యాధునిక యంత్ర ప‌రిక‌రాలు కొనుగోలు చేసేందుకు పాలక మండలి ఆమోదించింది. అదే విధంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం చెంత భక్తులు వేచి ఉండేందుకు తిరుమ‌ల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ త‌ర‌హాలో రూ.23.50 కోట్లతో యాత్రికుల వసతి భవనం నిర్మాణం చేసేందుకు పాలక మండలి నిర్ణయం తీసుకుంది.


డాక్టర్ల నియామకానికి ఆమోదం


త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్న శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్ల‌ల సూప‌ర్‌స్పెషాలిటీ ఆసుప‌త్రికి అవ‌స‌ర‌మైన స్పెష‌లిస్టు డాక్ట‌ర్లు, డ్యూటీ డాక్ట‌ర్లు, స్టాఫ్‌న‌ర్సులు, ఇత‌ర పారామెడిక‌ల్ సిబ్బంది నియామ‌కానికి అనుమ‌తించారు. అదేవిధంగా 75.86 కోట్ల‌తో అత్యాధునిక‌ వైద్య‌ప‌రిక‌రాల కొనుగోలు చేసేందుకు ఆమోదం తెలిపారు. తిరుప‌తిలోని శ్రీ‌నివాసం కాంప్లెక్స్‌లో భ‌క్తుల స‌దుపాయం కోసం 3 కోట్ల‌తో స‌బ్‌వే నిర్మాణంపై పాలక మండలి చర్చించి నిర్ణయం తీసుకున్నారు. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో పార్కింగ్‌ వసతి, మినీ కల్యాణకట్ట, ఫెసిలిటీ సెంటర్‌ తదితర అభివృద్ధి పనులు గానూ 3.10 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు.


శ్రీవాణి ట్రస్టు నిధులతో వకుళ మాత ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు సౌకర్యాల ఏర్పాటుకు గానూ 9.85 కోట్లు నిధులు మంజూరు చేశారు. తిరుప‌తిలోని శ్రీ‌నివాస సేతుకు గాను చివ‌రి విడ‌త‌గా 118.83 కోట్లను ప‌నులు పూర్తి కాగానే చెల్లించ‌డానికి ఆమోదం తెలిపారు. తిరుప‌తిలోని ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యంలో అభివృద్ధి ప‌నుల‌కు 5 కోట్లు మంజూరు చేయగా, తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో కైంక‌ర్యాల‌కు వినియోగించేందుకు ఎస్వీ గోసంర‌క్ష‌ణ‌శాల‌లో సంప్ర‌దాయ‌ ప‌ద్ధ‌తిలో నెయ్యి త‌యారీ ప్లాంటు ఏర్పాటుకు గానూ 4.25 కోట్ల రూపాయలు కేటాయించారు.


ఆయుర్వేద హాస్పిటల్‌లో మరో అంతస్తు


ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రిలో అదనపు అంత‌స్తు నిర్మాణానికి 11.50 కోట్లను, 2.60 కోట్లతో గ్రౌండ్‌ ఫ్లోర్‌ అభివృద్ధి పనులు, 3 కోట్లతో ఆయుర్వేద‌ కళాశాల విద్యార్థినుల హాస్టల్‌ భవనంలో అదనంగా మరో రెండు అంతస్తుల నిర్మాణం చేసేందుకు పాలక మండలి నిర్ణయం తీసుకుందన్నారు. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో నూతన టీబీసీడీ వార్డు నిర్మాణానికి గానూ 2.20 కోట్ల నిధులు, రూ.11 కోట్లతో ఎస్వీ సంగీత కళాశాల, ఎస్వీ నాదస్వర పాఠశాలలో చదువుతున్న బాలురకు హాస్టల్‌ భవన నిర్మాణ పనులు, శ్రీ‌వాణి నిధుల‌తో తిరుపతిలోని పల్లెవీధిలో వెలసి ఉన్న వేశాలమ్మ ఆలయ అభివృద్ధి, శ్రీ తాళ్ళపాక పెద్ద గంగమ్మ ఆలయ పున‌ర్నిర్మాణం గానూ 1.65 కోట్లు కేటాయించారు.


రూ.1.25 కోట్లతో దేశవ్యాప్తంగా ఉన్న రక్షణ లేని 69 టీటీడీ భూములకు కంచె నిర్మాణానికి పాలక మండలి‌ నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా గ‌రిమెళ్ల బాల‌కృష్ణ‌ప్ర‌సాద్‌ను మ‌రో మూడేళ్ల పాటు నియామ‌కం చేయడం జరిగిందని, తెలుగు రాష్ట్రాల్లో శ్రీ‌వాణి నిధుల‌తో 26 ఆల‌యాల అభివృద్ధి చేసేందుకు పాలక మండలి ఆమోదించడం జరిగిందని టీటీడీ పాలక మండలి ఛైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.