తిరుమలలోని నూతన నోట్ల పరకామణి మండపంలో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ కెమెరాల నిఘా ఏర్పాటు ఉన్నా కూడా అతను చోరీకి పాల్పడడంతో అధికారులు విస్తుపోయారు. సీసీటీవీ కెమెరాల ద్వారా విజిలెన్స్ అధికారులు నిందితుడిని ఇట్టే గుర్తించారని ప్రకటనలో పేర్కొన్నారు.


నోట్ల లెక్కింపు సమయంలో కొన్ని విదేశీ నోట్లను మల ద్వారం వద్ద ఉంచుకుని బయటకు వెళుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగిని సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించారు. విజిలెన్స్ అధికారులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో నోట్లను గుర్తించి వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. నూతన పరకామణి మండపంలో కట్టుదిట్టమైన భధ్రతా ఏర్పాట్లు చెయ్యడం, అడుగడుగునా సీసీటీవీ కెమెరాల నిఘా ఉంచడంతో ప్రతి ఒక్కరి కదలికపై సూక్ష్మ స్థాయిలో నిఘా ఉంచుతున్నారు. 


గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా వెంటనే గుర్తించే వెసులుబాటు ఉండేది కాదు. నూతన పరకామణి మండపంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన భధ్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది.  దీంతో స్వామి సేవ కోసం వచ్చి, చోరీకి పాల్పడుతున్న వారిని వెంటనే గుర్తించగలుగుతున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతుందని భద్రత అధికారులు స్పష్టం చేశారు.


ఇటీవలే కొత్త పరకామణి భవనం ప్రారంభం


తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలో నిర్మించిన నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నాన్ని గత ఫిబ్రవరిలో టిటిడి ఈవో ఏవీ.ధర్మారెడ్డి ప్రారంభించారు. ముందుగా ఉదయం 9 గంటల నుండి నూతన పరకామణి భవనంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, గోమాత ప్రవేశం, గోపూజ, సుదర్శన హోమం వంటి కార్యక్రమాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఆలయం నుండి తీసుకుని వచ్చిన హుండీ కానుకలను వేరు చేయడం, లెక్కించడం ప్రక్రియను ప్రారంభించారు.  


బెంగళూరుకు చెందిన దాత మురళీకృష్ణ అందించిన రూ.23 కోట్ల విరాళంతో అధునాత‌న సౌక‌ర్యాల‌తో కూడిన నూత‌న పరకామణి భవనాన్ని టీటీడీ నిర్మించింది. గత ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబరు 28న ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి ఈ నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఈ భవనంలో అభివృద్ధి పనులను టిటిడి చేపట్టింది. శ్రీవారి దర్శనార్శం తిరుమలకు విచ్చేసిన భక్తుడు స్వామి వారికి సమర్పించే కానుకల లెక్కింపు స్వయంగా వీక్షించే విధంగా భవనంకు నలువైపులా అద్దాలు ఏర్పాటు చేసింది టిటిడి. ఈ సందర్భంగా టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ. తిరుమలలో అత్యాధునిక వసతులతో నిర్మించిన నూతన పరకామణి భవనంను ప్రారంభించడం జరిగిందన్నారు.  


ఈ నూతన పరకామణి భవనంలో అన్ని సిబ్బందికి అవసరం అయ్యే అన్ని ఏర్పాట్లు కల్పించడం జరిగిందని, అయితే ఇవాళ 12 హుండీలను శ్రీవారి ఆలయం నుండి నూతన పరకామణికి తరలించి, లెక్కింపు ప్రక్రియను ప్రారంభించామన్నారు. అయితే ముందస్తుగా హుండీ కానుకలను పరకామణికి తరలించేందుకు ట్రయల్ రన్ చేశామని, నేడు అది సక్సెస్ పుల్ అయిందని అన్నారు. రేపటి నుండి హుండీ కానుకలను నూతన పరకామణి భవనంలో లెక్కించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. శ్రీవారి ఆలయంలో ఉన్న ప్రస్తుత పరకామణిలో భక్తులు కూర్చుని ధ్యానం చేసుకోడానికి స్థలం కేటాయించడం జరిగిందన్నారు.