తిరుమల తిరుపతిలో చిరుత నాలుగేళ్ల చిన్నారి లక్షితను చంపేసిన ఘటన తరువాత అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే నడక మార్గంలో వచ్చే భక్తులందరికీ అధికారులు చేతి కర్రలు ఇస్తున్నారు. దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ నడుస్తుంది. 


దీని గురించి నూతనంగా నియమితమైన టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడారు. గురువారం ఉదయం అలిపిరి నడక మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కుకున్నట్లు తెలిపారు.


దీనిని మగ చిరుతగా గుర్తించామని వివరించారు. ఆ ప్రాంతాన్ని టీటీడీ అధికారులతో కలిసి టీటీడీ ఈవో, టీటీడీ ఛైర్మన్‌ భూమన పరిశీలించారు. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 ప్రాంతంలో చిరుత బోనులో చిక్కిందని భూమన మీడియాతో తెలిపారు. భక్తుల భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వివరించారు.


నడక దారిలో వారికి భద్రతను కల్పిస్తూనే చిరుతలను బంధించడానికి చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. భక్తులకు కర్రలు ఇవ్వాలన్న అటవీ అధికారులు ఆదేశాలతోనే అందరి చేతికి కర్రలు ఇస్తున్నామని ఆయన వివరించారు. అంతేకానీ కేవలం కర్రలు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని సోషల్‌ మీడియాలో వస్తున్న దానిలో వాస్తవం లేదని ఆయన వివరించారు. 


ఇలాంటి నిందలు వేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఇప్పటికీ ఆపరేషన్‌ చిరుతను కొనసాగిస్తున్నామని, మరికొన్ని చిరుతలను బంధించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నమని ఆయన వెల్లడించారు. ఆయన తరువాత మీడియాతో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మాట్లాడారు. ఇప్పటికే చిరుతలను గుర్తించేందుకు అటవీ ప్రాంతంలో 300 కెమెరా ట్రాప్‌ లను ఏర్పాటు చేశామని తెలిపారు.


మరో 200 కెమెరా ట్రాప్‌ లను ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. ఇందుకు శ్రీశైలం అటవీ ప్రాంతం నుంచి కొంతమంది ఎక్స్‌పర్ట్‌ నిపుణులను పిలిపిస్తున్నామని వివరించారు. డ్రోన్‌ టీం సైతం తిరుమలకు తీసుకుని వచ్చామన్నారు. పులులతోపాటు ఎలుగుబంట్లును కూడా పట్టుకోబోతున్నామని వివరించారు. కానీ వాటని బంధించేందుకు బోన్లు సరిపోవని, అలా కుదరదని ఆయన వివరించారు. 


వలలు వేయడం, ట్రాంకులైజ్ ద్వారా పట్టుకోగలంమన్నారు. టీటీడీ అధికారులు, అటవీశాఖ అధికారులు అహర్నిశలు శ్రమిస్తున్నారని, చిరుతలు ఎత్తైన మనుషులపైన , జంతువుల పై దాడి చేయద్దన్నారు. చిరుత కన్నాఎత్తైన ఏనుగులపై ఇప్పటి వరకు దాడి చేసిన సందర్భాలు లేదని, చిన్న పిల్లలను చూసినప్పుడు చిన్న జంతువు అనుకొని దాడులు చేస్తాయో కానీ, చేతిలో కర్ర పెట్టుకోవడం వల్ల మనిషి మరింత ఎత్తు కనపడే అవకాశం ఉందన్నారు. 


దీంతో చిరుత ఎత్తును చూసి భయపడి వెనక్కి వెళ్లిపోతుందని శాస్త్రీయంగా నిరూపితమైందన్నారు. కర్ర ఇవ్వడం చిన్న సహాయం మాత్రమేనని, వందమంది కర్రలతో ఉంటే చాలా బలం ఏర్పడుతుందన్నారు. చర్యలు చేపట్టినప్పుడు అభినందించాలి కానీ విమర్శలు చేసి మనోబలాన్ని తగ్గించడం సబబు కాదన్నారు. 


కొత్త సాంకేతికతతో బోనాల సైతం ఏర్పాటు చేస్తున్నామని, ట్రాప్‌ ల ద్వారా చిరుత కదలికలు నిరంతరం కొనసాగిస్తున్నామని, బయట నుంచి తీసుకు వచ్చిన చిరుతలను ఇక్కడ పెట్టి మాయ మాటలు చెప్తున్నామంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న వాదనలు అవాస్తవమని ఆయన అన్నారు. చిరుతలు బోను చిక్కినప్పుడు సీసీ కెమెరాలలో రికార్డు అయిన వీడియో విజువల్స్‌ ను కూడా మీడియాకు విడుదల చేస్తామని వారు పేర్కొన్నారు.