YSRCP Sarpanch Tears: అధికార వైసీపీకి చెందిన ఓ సర్పంచ్ ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధికి నిధులు ఇవ్వకపోవడం వల్లే తాను గ్రామాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నానని కంటతడి పెట్టుకున్నారు. గ్రామాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయని సర్పంచి అంటూ టీడీపీ నేతలు హేళన చేస్తున్నారని ఆవేదన చెందారు. తిరుపతి జిల్లా వెంకటగిరి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో వైసీపీ సర్పంచి విజయలక్ష్మి ఈ విధంగా మాట్లాడారు. లక్షలు ఖర్చు పెట్టి సర్పంచి అయితే.. తమకు అండగా ఉంటే నాయకుడే లేరంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు గ్రామస్థులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేకపోతున్నానని... అందరూ వచ్చి తనను ఇదే విషయమై నిలదీస్తున్నారని చెప్పుకొచ్చారు. వెంకటగిరిలో సీఎం జగన్ పర్యటన సందర్బంగా.. స్వయంగా తానే 350 మందిని తన పంచాయతీ నుంచి తీసుకెళ్లానని గుర్తు చేశారు. కనీసం ఆ సమావేశానికి వెళ్లిన వాళ్లకు భోజనం కూడా పెట్టలేరని ఆవేదన వ్యక్తం చేశారు. 


నియోజకవర్గ నేత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి దగ్గరకు వెళ్తే.. కనీసం ఆయన తనతో మాట్లాడేందుకు కూడా ఇష్ట పడలేరని సర్పంచి విజయలక్ష్మి వివరించారు. ప్రజల కోసమే తాను పోటీ చేసి.. లక్షలు ఖర్చు పెట్టి మరీ సర్పంచి అయ్యానని.. కనీసం గ్రామంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేకపోతున్నానని చెప్పుకొచ్చింది. అలాగే కొందరి భూ సమస్యల గురించి తానే స్వయంగా రెవిన్యూ అధికారుల వద్దకు వెళ్లినా తనను పట్టించుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇకనైనా నిధులు ఇవ్వడంతో పాటు.. తాము కూడా వైసీపీ పార్టీకి చెందిన వాళ్లమే అని గుర్తించుకొని మండల నాయకులు మెలిగేలా చేయాలని కోరారు. 


ఇటీవలే మంత్రిపై మాజీ సర్పంచి భర్త ఆరోపణలు


ఏపీ మంత్రి మేరుగ నాగార్జున వల్ల తనకు ప్రాణాహాని ఉందని బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం మూల్పురు మాజీ సర్పంచ్ భర్త మాణిక్యరావు ఆరోపించారు. బాపట్ల జిల్లా తెనాలిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. తనపై అక్రమ కేసులు పెట్టేందుకు మంత్రి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తాను చనిపోతే పూర్తి బాధ్యత మంత్రి మేరుగ నాగార్జునదే అని వివరించారు. బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నారని వీడియో విడుదల చేసి తర్వాత తనపై కక్ష పెంచుకున్నారని, ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే మంత్రిపై ఆరోపణలు చేస్తూ మాణిక్య రావు వీడియో విడుదల చేశారు. తన భార్య రోజ్ మేరీ సర్పంచ్ గా ఉన్న సమయంలో గ్రామాభివృద్ధికి సంబంధించిన బిల్లులు రాకుండా మంత్రి అడ్డుకుంటారని వీడియోలో ఆరోపించారు. స్థానిక నాయకులు ఆడించినట్లుగా ఆడుతూ.. మంత్రి మేరుగ దళితులను వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. మాణిక్యరావు చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.   



అసలేం జరిగిందంటే..?


గ్రామ అభివృద్ధికి సంబంధించిన బిల్లులు రాకుండా మంత్రి మేరుగ నాగార్జున అడ్డుకుంటున్నారని బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం మూల్పూరు మాజీ సర్పంచ్ రోజా మేరీ భర్త మాణిక్యాల రావు ఆరోపించారు. 2013-2018 వరకు రోజా మేరీ సర్పంచ్ గా పని చేశారు. ఆ సమయంలో కోట్ల రూపాయలతో పంచాయతీ అభివృద్ధి చేశామని మాణిక్య రావు చెప్పారు. అయితే 14వ ఆర్థిక సంఘం నిధుల్లో తమకు రావాల్సిన బిల్లులు రాకుండా స్థానిక నాయకుల మాటలు విని మంత్రి మేరుగ నాగార్జున బిల్లులు రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి ఉపయోగం లేదని వాపోయారు. స్థానిక నాయకుల చేతిలో కీలుబొమ్మగా మారి మంత్రి నాగార్జున దళితులను వేధిస్తున్నారని మండిపడ్డారు. తన ఆవేదనను చెప్పుకుంటున్నందుకు.. కొందరు చంపేస్తామని బెదిరింపులకు పాల్పడడం దారుణం అన్నారు.