Tiruapti News: తిరుపతి ఆధ్యాత్మిక నగరం.. ఇక్కడ నిత్యం గోవింద నామ స్మరణలు మారుమోగుతుంటాయి. ఎప్పుడు చూసినా దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులతో సందడిగా ఉంటుంది. ఇలాంటి నగరంలో వినాయక చవితి వేడుకలు అంటే ఎలా ఉండాలి. మీరు అనుకున్నది నిజమే.. ఆధ్యాత్మిక నగరం లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. 11 రోజుల పాటు గణనాథుడికి పూజలు చేసే భక్తులు ఉండగా... ఆ వినాయకుడే వినలేని, చూడలేని విధంగా సినిమా పాటలు.. రికార్డు డ్యాన్సులు, అశ్లీల నృత్యాలతో పవిత్రమైన గణేష్ చతుర్థి నవరాత్రుల వేడుకలను కొందరు అపవిత్రం చేస్తున్నారు.


వినాయకుడి ముందే డ్యాన్సులు 


తిరుపతి జిల్లా పోలీస్ శాఖ, తిరుపతి వరసిద్ధి వినాయక నిమజ్జన కమిటీ చాల రోజుగా భక్తి భావంతో పూజలు చేయాలి... సినిమా పాటలు పెట్టరాదు అంటూ అవగాహన కల్పించారు. ఇందులో చాలా మంది వినాయక మండప నిర్వాహకులు సైతం అదే పాటించారు. కొందరు ఆ మాటలను పట్టించుకోకుండా వినాయక మండపంలో రికార్డింగ్ డాన్స్ ఏర్పాటు చేశారు.


ఏడు మందిని అరెస్ట్ చేసిన పోలీసులు


తిరుపతి నగరంలోని సప్తగిరి నగర్ లో ఈనెల 9వ తేదీన ఓ మండపం నిర్వహకులు రికార్డింగ్ డాన్స్ ఏర్పాటు చేశారు. బయటకు నుంచి వచ్చిన వారితో డ్యాన్సులు వేయించారు. ఇందులో మహిళలు సైతం ఉన్నారు. ఆ వీడియోలు మంగళవారం వైరల్ గా మారాయి. దీనిపై కొందరు వ్యతిరేకంగా మాట్లాడడం తో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వరకు విషయం తెలిసింది. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని అలిపిరి పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన అలిపిరి సీఐ రామ్ కిషోర్ నిర్వాహకుల 7 మంది పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మధుసూదన్ రెడ్డి, రాజేంద్రప్రసాద్, వినోద్ కుమార్, కిరణ్ కుమార్, జస్వంత్ రెడ్డి, వినయ్, హేమంత్ లను అరెస్టు చేశారు.


తిరుపతి లాంటి పుణ్యక్షేత్రం లో రికార్డింగ్ డాన్స్ లు, అశ్లీల నృత్యాలకు తావులేదు. వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి పోలీస్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు హెచ్చరించారు.


వినాయకుని మంటపం వద్ద డాన్స్ వేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు


బి కొత్తకోట మండలం నాయిని బావిలో విషాదం చోటు చేసుకుంది. వినాయకుని మంటపం వద్ద డ్యాన్స్ వేస్తూ ఆకాష్ అనే యువకుడు కుప్పకూలాడప. స్నేహితులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గ మధ్యంలోనే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. నాయుని బావికి చెందిన శంకర, రెడ్డెమ్మ దంపతుల పెద్ద కుమారుడు అతను.