చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై పురంధేశ్వరి స్పందించారు. తిరుపతి జిల్లా పర్యటన వేళ రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన విధానాన్ని ముందు నుంచి వ్యతిరేకిస్తున్నామని, ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా, కేసుపై చంద్రబాబు వాదన వినకుండా సిఐడి అధికారులు అరెస్ట్ చేశారన్నారు. చంద్రబాబుకు బెయిల్ రావడం స్వాగతిస్తున్నామని, చంద్రబాబు మద్యం లీజుకు ఇచ్చిన కంపెనీలను వైసీపీ నాయకులు బెదిరించి సబ్ లీజ్ కు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. మొదట నుంచి అదే అంశాన్నే మాట్లాడుతున్నామని ఆమె చెప్పారు.  


భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 26 జిల్లాలను పర్యటించడం జరుగుతుందని, మొట్ట మొదటి సారిగా చిత్తూరు జిల్లాతో పర్యటన ప్రారంభించడం జరిగిందన్నారు. రెండు రకాలుగా జిల్లాలో దృష్టి సారించడం జరిగిందని, ఇందులో మొదటిది సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం, రెండోది కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రతి జిల్లా అభివృద్ధికి నిధులను అందిస్తూ ఉంటే ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తున్నట్లు చెప్పుకోవడం‌ బాధాకరంమన్నారు. స్వామి వారి పాదాల నుండి తాను తన జిల్లాల పర్యటనను ప్రారంభించడం నా అదృష్టం భావిస్తున్నానని, స్వామి వారి ఆశీస్సులు, చల్లని చూపు పార్టీపై పార్టీ కార్యకర్తలపై ఉంటుందని నేను ఆశిస్తున్నట్లు చెప్పారు.  


తిరుపతి అభివృద్ధికి కేంద్రం పెద్ద ఎత్తున తన సహకారాన్ని అందించడం జరిగిందని, రేణిగుంట నుంచి నాయుడుపేట వరకు 1860 కోట్ల రూపాయలతో 71వ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతును ఇవ్వడం జరిగిందన్నారు. తిరుపతిని ఎడ్యుకేషనల్ హబ్ గా అయ్యేందుకు ఐఐటి, ట్రిపుల్ ఐటి, ఐసర్, కల్నరి యూనివర్సిటీపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించడం జరిగిందన్నారు. కేంద్ర విద్యా సంస్థలు అన్నింటికీ 600 నుంచి 700 కోట్ల రూపాయలు పెట్టుబడులు అవసరం ఉండగా, అందుకు కావాల్సిన సంపూర్ణ మద్దతును అందిస్తూ ఆ యొక్క పెట్టుబడులను కేంద్రం అందిస్తోందన్నారు. కల్వరి యూనివర్సిటీకి దాదాపు 70 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని, ప్రస్తుతం ఆ యూనివర్సిటీ నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు.  


తిరుపతిని స్మార్ట్ సిటీగా గుర్తించి దాదాపు 87 ప్రాజెక్టులు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం 1680 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని, అంతేకాకుండా ప్రధానమంత్రి ఆవాస యోజన క్రింద పాతిక లక్షల ఇండ్లను రాష్ట్రానికి కేటాయిస్తే, ఒక తిరుపతికి 213 వేల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఒక్క ఇల్లు నిర్మాణం కూడా సవ్యంగా జరగకుండా ఒక్క పేదవాడికి న్యాయం చేస్తూ వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఇళ్లను కేటాయించే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. గత ప్రభుత్వం మూడు లక్షల ఇల్లు కట్టమన్న ఆ ఇళ్లను సైతం పేద ప్రజలకు కేటాయించిన దాఖలు అయితే మాత్రం ప్రస్తుత ప్రభుత్వంలో లేదని ఆరోపించారు.  


తిరుపతిలో 21 వేలకు పైగా కొళాయి కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని, కేవలం మా జేబులు మాత్రమే నిండాలని ధోరణిలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అన్నిటిలో అవినీతి చూపిస్తుందని, రాష్ట్రాన్ని అప్పుల ఊగులోకి నెట్టివేసి ఆర్థిక స్థితిని అద్వాన స్థితిలోకి వైఎస్ఆర్ సీపీ నెట్టివేసిందని ఆమె మండి పడ్డారు‌. సర్పంచులకు వచ్చే నిధులను కూడా పక్క దారి పట్టించి ఆ నిధులను కూడా వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు. నాణ్యత లేని మద్యాన్ని రాష్ట్రాల్లోని ప్రజలకు అందిస్తూ వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం పేదవారి ప్రాణాలతో చెలగాటం మాడుతుందని, పేదల కుటుంబాలు రోడ్డున పడిన పరవాలేదు కానీ మా జేబులో నిండితే చాలునని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఉందన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ద్వారా ప్రకృతిని‌ కూడా వైసీపి‌ ప్రభుత్వం కబలిస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు‌ పురంధేశ్వరి మండిపడ్డారు.