స్లాట్ విధానం ద్వారా సామాన్య భక్తులకు త్వరలో స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తామని టిటిడి ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తుల సలహాలు, సూచనలు ఈవో ధర్మారెడ్డి తీసుకున్నారు. ఏప్రిల్ 12వ తేదీన భక్తులు అధిక సంఖ్యలో రావడం ద్వారా స్లాట్ విధాన టిటిడి రద్దు చేశామని వివరించారు. 


సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నామన్నారు ధర్మారెడ్డి. టిటిడిలో సమయాన్ని బట్టి, రద్దీ బట్టీ సేవలను రద్దు చేసే వ్యవస్ధ తిరుమలలో ఉందని, అందుకే వివిధ పర్వదినాల్లో కొన్ని ఆర్జిత సేవలు రద్దు చేయడం జరుగుతుందన్నారు.‌


సహస్ర కలశాభిషేకం, విశేష పూజ, వసంతోత్సవాన్ని ఉత్సవర్లను అరుగుదల నుంచి కాపాడేందుకు అర్చకులు, జియ్యంగార్ల ఆదేశాల మేరకు రద్దు చేసామని చెప్పారు ధర్మారెడ్డి. అష్టదళ, తిరుప్పావడ జూన్ 30వ తేదీ వరకూ తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందని తెలిపారు. 


అధిక భక్తుల రద్దీ ఉన్న పరిస్థితుల్లో ఆర్జిత సేవల సమయంలో మరింత మంది భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఈవో. వయోవృద్దులకు సంబంధించిన విషయాలపై కొందరు భక్తుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చామన్నారు. వయోవృద్దులకు ప్రతి రోజు ఆన్లైన్ స్లాట్ విధానం ద్వారా వెయ్యి మందికి దర్శనం కల్పిస్తున్నట్లు వివరించారు. చంటి బిడ్డల తల్లిదండ్రులకు, ఎన్.ఆర్.ఐ దర్శనాలు కూడా ప్రస్తుతం తిరుమలలో యథావిధిగా కొనసాగుతుందని తెలియజేశారు. 


ఏప్రిల్ నెలలో శ్రీవారి ఇరవై లక్షల అరవై నాలుగు వేల మంది దర్శనం పొందారని, హుండీ ద్వారా 127 కోట్లు ఆదాయం రాగా, ఈ హుండీ కానుకులు 4.41 కోట్లు ఆదాయం లభించిందన్నారు ధర్మారెడ్డి. 99.07 లక్షలు శ్రీవారి లడ్డూలు విక్రయించడం జరిగిందని ఈవో ధర్మారెడ్డి తెలియజేశారు. పరకామణిలో ఓ సిబ్బంది నగదు తీసుకెళ్తుండగా విజిలెన్స్ సిబ్బంది పట్టుకుని రిమాండ్ చేయడం జరిగిందని, పరకామణిలో కఠినంగా పరిశీలిస్తున్నాం, స్వామి వారి సొత్తును దొంగలిస్తే కచ్చితంగా పట్టుబడుతారని ఆయన చెప్పారు.