Tirumala Tirupati Devasthanam:టీటీడీలో ఇంజినీరింగ్ విభాగంలో కలకలం రేగుతోంది. గతంలో జరిగిన తప్పిదాలకు సమాధానం చెప్పాలని నోటీసులు పంపించడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కానీ ఉన్నతాధికారులు చెప్పినట్టు చేసిన తమను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. 


టీటీడీలో గత ప్రభుత్వ హయాంలో ఛైర్మన్లుగా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి శ్రీవాణి ట్రస్ట్‌ను పూర్తి స్థాయిలో నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం, పాడు బడిన పురాతన ఆలయాల పునర్నిర్మాణం, శిధిలావస్థలో ఉన్న పాత ఆలయాల నిర్మాణం చేయడం శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ ( శ్రీవాణి) ముఖ్య ఉద్దేశం. ఈ ట్రస్ట్‌కు భక్తులు ఎవరైనా రూ.10వేలు అంతకంటే ఎక్కువ చెల్లించవచ్చు. ఇలా చెల్లించిన వారికి స్వామి వారి బ్రేక్ దర్శనం రూ.500 తో చేసుకునే అవకాశం కల్పించారు.


స్వామి వారి బ్రేక్ దర్శనం కోసం పరితపించే భక్తులు ఈ ట్రస్ట్ ద్వారా రూ.10 చెల్లించి అదనంగా టికెట్ కొనుగోలు చేయడం సులభతరం కావడంతో ఎక్కువ మంది మొగ్గు చూపారు. ఈ ట్రస్ట్ ద్వారా రూ.100కోట్లపైన టీటీడీకి విరాళాలు అందాయి. ఈ ట్రస్ట్ కార్యకలాపాలు అన్ని అవినీతి అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం అప్పట్లో ఆరోపించింది. నిధులు దారి మళ్లించారు, అవసరం లేని ప్రాంతాల్లో ఆలయ నిర్మాణాలు చేసి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేశారు, అనుకూలురకు కాంట్రాక్టర్లుకు అధిక శాతం పనులు అప్పగించి కమీషన్లు తీసుకున్నట్లు ఆరోపించారు. 


ఇంజినీరింగ్ విభాగంలో రివర్స్ టెండర్లు పిలిచి 1500 కోట్ల పనులు చేశారని కూడా విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తానని అన్నారు. అక్కడితో అంతా ఏమి జరుగుతుందో అని ఎదురు చూడగా మరుసటి రోజు టీటీడీ ఈవో నియామకం... అప్పటి వరకు అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని బదిలీ చేశారు. శ్రీవాణి ట్రస్ట్‌ను పక్కన పెట్టి ఇంజినీరింగ్ విభాగం పై దృష్టి పెట్టారు.


55 మందికి షోకాజ్ నోటీసులు
అంతే కాకుండా టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. కూటమి ప్రభుత్వం గత పాలకులు చేసిన తప్పిదాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగం లోని 55 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇది విమర్శల పాలైంది. అసలు చేసింది పాలకులు.. అప్పటి టీటీడీ బోర్డు అయితే తామేం చేశామని నోటీసులు ఇచ్చారని అంటున్నారు ఉద్యోగులు.


చర్యలు తీసుకుంటారా?
ప్రభుత్వం నియమించిన టీటీడీ బోర్డు నిర్ణయం మేరకు.. ఉన్నతాధికారుల ఆదేశాలతో సర్వీస్ రూల్స్ ప్రకారం విధులు చేపట్టామంటున్నారు ఉద్యోగులు. ఏదైనా తప్పు జరిగిందా... తాము ఏమైన తప్పు చేశామా అంటూ ఇంజినీరింగ్ విభాగం ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులను సైతం కలిసారు. వారి నుంచి సానుకూల స్పందన వచ్చినా సంతృప్తికరంగా నిర్ణయం రాలేదని అంటున్నారు. 


నోటీసులపై ఆగ్రహంగా ఉన్న ఉద్యోగులు ఇవాళ ఇంజినీరింగ్ యూనియన్ సమావేశం నిర్వహిస్తున్నారు. భవిష్యత్ కార్యచరణపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అవసరమైతే టీటీడీ, రాష్ట్ర విజిలెన్స్‌పై పోరాటానికి కూడా సిద్దమవుతామని అంటున్నారు. తప్పు చేసిన వారిని పట్టుకుని శిక్షించాలని సంబంధం లేని తమకు నోటీసులు ఏంటని ప్రశ్నిస్తున్నారు.