TTD News: అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం అక్టోబర్ 28 రాత్రి మూతపడనుంది. అక్టోబర్ 29న తిరిగి తెరవనున్నట్లు టీటీడీ తెలిపింది. అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1:05 నుంచి తెల్లవారుజామున 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం గంటలకు పూర్తవుతుంది. అక్టోబర్ 28న రాత్రి 7:05 గంటలకు ఆలయ తలుపులు మూసివేయనున్నారు. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. 


అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3:15 గంటలకు ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తారు. చంద్రగ్రహణం కారణంగా ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయి. ఈ కారణంగా సహస్ర  దీపాలంకార సేవ, వికలాంగులు మరియు వయోవృద్ధుల  దర్శనం అక్టోబర్ 28న రద్దు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెరటాసి నెల రద్దీ కారణంగా అక్టోబర్ 2వ తేదీన ఎస్‌ఎస్‌డీ టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరుతుంది.


తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. పెరటాసి మాసం సందర్భంగా తమిళనాడు నుంచి భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు‌‌‌. భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అక్టోబరు 7, 8, 14, 15వ తేదీల్లో ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.


వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2, నారాయణగిరి షెడ్‌లలోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, క్యూ లైన్లు నందకం విశ్రాంతి భవనం దాటిపోయాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, అన్నప్రసాదాలు, వసతి తదితర అంశాలపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. ఈవో ధ‌ర్మారెడ్డి ఆదేశాల మేరకు టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గురువారం నుంచి క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ నిరంతరాయంగా టీటీడీ అందిస్తోంది. 


తిరుమలలో స్వచ్చత హి సేవ 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు టీటీడీ ఆదివారం తిరుమలలో స్వచ్చతా హి సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. గోగర్భం డ్యాం సర్కిల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం,  ఎస్ఈ -2 జగదీశ్వర్ రెడ్డి, డీఎఫ్ఓ శ్రీనివాసులు, వీజీఓ బాలి రెడ్డి, ఆరోగ్య శాఖ అధికారి శ్రీదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య పనులు చేశారు.


అక్టోబ‌ర్‌లో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు



  • అక్టోబర్ నెలలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పలు విశేష సేవలు జరుగనున్నాయి. అవి ఏంటంటే?

  • అక్టోబ‌ర్‌4 - రోహిణి నక్షత్రం - రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారి ఊరేగింపు

  • అక్టోబ‌ర్‌ 6 పద్మావతి అమ్మవారి తిరుచ్చి

  • అక్టోబ‌ర్‌ 13 పద్మావతి అమ్మవారి  తిరుచ్చి

  • అక్టోబ‌ర్‌ 14 సూర్య నారాయణ స్వామి తిరుచ్చి

  • అక్టోబ‌ర్‌ 15 నుంచి 24 వరకుమపద్మావతి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు

  • అక్టోబ‌ర్‌ 20మపద్మావతి అమ్మవారి తిరుచ్చి

  • అక్టోబ‌ర్‌ 24 - విజయదశమి - పద్మావతి అమ్మవారి గజ వాహనం

  • అక్టోబ‌ర్‌ 27 పద్మావతి అమ్మవారి  తిరుచ్చి

  • అక్టోబ‌ర్‌ 31 రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామి వారి ఊరేగింపు