Tirumala Hundi Income: తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రతి సోమవారం నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను టీటీడీ రద్దు చేసింది. విగ్రహాల పరిరక్షణలో‌ భాగంగా ఆగమ సలహాదారుల సూచనల మేరకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం అంటే ఆగస్టు 7వ తేదీన 81,903 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 39,594 మంది తలనీలాలు సమర్పించగా, 4,74 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 25 కంపార్ట్మెంట్లల్లో సర్వ దర్శనం కోసం భక్తులు వేచి‌ ఉండగా, స్వామి వారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది.


బెల్లంతో కలిపిన నువ్వుల పిండి నైవేద్యం..


శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో‌ భాగంగానే సోమవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం  తోమాల, అర్చన సేవలు నిర్వహించి ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాస మూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిని స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.


అద్దాల మండపంలో డోలోత్సవం..


సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి ప్రోటోకాల్ పరిధిలోని భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి సోమవారం రోజు నిర్వహించే "చతుర్ధశ కలశ విశేష పూజ" ను టీటీడీ రద్దు చేసింది. ఉత్సవ మూర్తుల విగ్రహాలు పరిరక్షణలో‌ భాగంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. అటు తరువాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహిస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనానికి భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.


ముందుగా సీఆర్వో కార్యాలయం వద్ద వసతి గదులు..


శ్రీనివాసుడి దర్శనం కోసం తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులు అలిపిరి‌ నడక మార్గం, శ్రీవారి నడక మార్గం, తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసి తిరుమల పుణ్యక్షేత్రంకు చేరుకోవచ్చు. ఇలా తిరుమలకు వచ్చిన భక్తులు ముందుగా సీఆర్వో కార్యాలయం వద్ద వసతి గదులు పొంది, స్వామి వారికి తలనీలాలు సమర్పించి స్వామి వారి దర్శన భాగ్యం పొందే అవకాశం కల్పిస్తోంది టీటీడీ. ఇక యాత్రికుల సౌఖర్యార్ధం తిరుమలలో ప్రధాన ప్రాంతాల్లో పుడ్ కౌంటర్లతో పాటుగా, మాతృశ్రీ వెంగమాంబ అన్నదాన సత్రంలో ఉదయం ఏడు గంటల నుండి రాత్రి 11 గంటల వరకూ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తోంది టీటీడీ. అదే విధంగా భక్తులకు కోరినన్ని లడ్డూలను భక్తులకు టీటీడీ అందిస్తోంది. ఇక తిరుమల యాత్రతో పాటుగా వివిధ యాత్ర ప్రదేశాలు భక్తులు సందర్శించేందుకు బస్సు సౌకర్యం కల్పించింది.