TTD Board New Members: టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా ఆదివారం ముగ్గురు సభ్యులు శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 28 మందితో టీటీడీ బోర్డు ఏర్పాటైన విషయం తెలిసిందే. వీరిలో తుడ ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. అలాగే ధర్మకర్తల మండలి సభ్యులుగా సుదర్శన్ వేణు, నెరుసు నాగసత్యం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలో స్వామివారి సన్నిధిలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
స్వామివారి దర్శనానంతరం బోర్డు సభ్యులకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని జేఈవో వీరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, డెప్యూటీ ఈవోలు లోకనాథం, గోవిందరాజన్, హరీంద్రనాథ్, విజివో బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం (ఆగస్టు 27న) ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపుచేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుంగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచసూక్తాలను పఠించారు. ఆ తర్వాత పవిత్ర ప్రతిష్ట జరిగింది. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు.


అనంతరం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కారణంగా ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో ఎవి.ధర్మారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.