Tirumala Devotees praise the sandal tracking system:  ఏడుకొండల వాడి చెంతకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన  QR కోడ్ ఆధారిత పాదరక్షల ట్రాకింగ్  అండ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ  అద్భుత ఫలితాలను ఇస్తోంది. గత ఆరు నెలల్లోనే సుమారు  8.45 లక్షలకు పైగా పాదరక్షల లావాదేవీలను ఈ విధానం ద్వారా సమర్థవంతంగా నిర్వహించారు. భక్తులు తమ పాదరక్షలను భద్రపరుచుకోవడంలో గతంలో ఎదుర్కొన్న గందరగోళానికి ఈ ఆధునిక సాంకేతికత చెక్ పెట్టింది.

Continues below advertisement

ఆరు నెలల్లో 8.45 లక్షల లావాదేవీలు

2025 సెప్టెంబర్ నుండి 2026 ఫిబ్రవరి 15 వరకు ఈ స్మార్ట్ విధానం ద్వారా మొత్తం  4,24,047 పాదరక్షలను భక్తులు దర్శనానికి వెళ్తూ భద్ర పరుచుకోగా.. అందులో **4,21,769 జతలను** అత్యంత సురక్షితంగా తిరిగి అందజేశారు. అంటే సేకరించిన వాటిలో దాదాపు 99 శాతం విజయవంతంగా పంపిణీ కావడం ఈ వ్యవస్థ పనితీరుకు అద్దం పడుతోంది. కేవలం ఫిబ్రవరి మొదటి 15 రోజుల్లోనే 1.35 లక్షల లావాదేవీలు జరగడం ఈ వ్యవస్థ పట్ల భక్తులకున్న నమ్మకాన్ని తెలియజేస్తోంది.

Continues below advertisement

 ప్రధాన కేంద్రాల్లో రికార్డు స్థాయి నిర్వహణ

తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో  పీఏసీ-5  కేంద్రం అత్యధికంగా 1.38 లక్షల పాదరక్షల నిర్వహణతో అగ్రస్థానంలో నిలిచింది. రామ్ భగీచా వద్ద 76,556,  కృష్ణ తేజ సర్కిల్  వద్ద  56,019, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం వద్ద 55,238,  వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద  53,250,  ఏటీజీహెచ్ వద్ద  44,714 జతల చెప్పులను భక్తులకు సురక్షితంగా అందచేశారు. పై కేంద్రాల్లో పాదరక్షలు తప్పిపోయే అవకాశం లేకుండా టెక్నాలజీ సాయంతో భక్తులకు వేగంగా సేవలు అందుతున్నాయి.

అదనపు ఈవో చొరవ.. కోరమాండల్ సహకారం

గతంలో రద్దీ ప్రాంతాల్లో పాదరక్షలు అస్తవ్యస్తంగా పడి ఉండటం వల్ల భక్తులు పడే ఇబ్బందులను గమనించిన  టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఈ వినూత్న పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ సహకారంతో, డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్ భక్తులకు చేరువైంది. భక్తుల నుంచి ఈ విధానంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండటంతో, త్వరలో కల్యాణకట్ట, బేడి ఆంజనేయస్వామి ఆలయం, ఏటీసీ సర్కిల్ వద్ద మరో మూడు నూతన కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

 మాడ వీధుల్లో నిషిద్ధం.. భక్తులకు విజ్ఞప్తి

శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధులు అత్యంత పవిత్రమైనవని, అక్కడ నిత్యం స్వామి వారు విహరిస్తుంటారు కాబట్టి పాదరక్షలు ధరించడం నిషిద్ధమని టీటీడీ గుర్తు చేసింది. భక్తులు తమ పాదరక్షలను నిర్ణీత కౌంటర్లలో ఈ స్మార్ట్ పద్ధతి ద్వారా డిపాజిట్ చేసి, దర్శనం అనంతరం సులభంగా పొందాలని కోరింది. ఈ 'స్మార్ట్ షూ కీపింగ్' విధానం తిరుమలలో పరిశుభ్రతను పెంచడమే కాకుండా, సామాన్య భక్తులకు ఆహ్లాదకరమైన దర్శన అనుభూతిని కలిగిస్తోంది.