Manchu Vishnus statement on fine for Mohan Babu University | తిరుపతి: మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (APHERMC) చేసిన కొన్ని సిఫార్సులపై మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలపై వర్సిటీ ప్రో ఛాన్సలర్ మంచు విష్ణు స్పందించారు. ఉన్నత విద్యా కమిషన్ మోహన్ బాబు విశ్వవిద్యాలయంపై చేసిన సిఫార్సులను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
మంచు విష్ణు ప్రకటనలో పేర్కొన్న అంశాలివే..
‘అవి కేవలం సిఫార్సులు మాత్రమే. ఆ సిఫార్సులు ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో విచారణలో (సబ్-జ్యుడిస్) ఉన్నాయని గమనించగలరు. ఈ విషయాన్ని పరిశీలించిన హైకోర్టు APHERMO సిఫార్సులకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయానికి అనుకూలంగా హైకోర్టు 'స్టే' ఉత్తర్వును జారీ చేసింది. కానీ APHERMC వారు కోర్టు ఉత్తర్వును ధిక్కరించి పోర్టల్లో పెట్టడం దురదృష్టకరం.
హైకోర్టుపై నమ్మకం ఉంది
APHERMC చేసిన సిఫార్సులు సరికాదని మోహన్ బాబు విశ్వవిద్యాలయం గట్టిగా నమ్ముతోంది. ఈ విషయంపై విచారణ జరుపుతున్న హైకోర్టు న్యాయం చేస్తుందని విశ్వాసంతో ఉంది. విషయాన్ని తీవ్రతరం చేసి, విశ్వవిద్యాలయ ప్రతిష్టను దిగజార్చడానికి ఉద్దేశపూర్వకంగా కొంత సమాచారాన్ని మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దని తల్లిదండ్రులకు, మీడియాకు, మా భాగస్వాములందరికీ తెలియజేస్తున్నాం.
వర్సిటీ విద్యార్థులకు మంచి ప్యాకేజీలు..
మోహన్ బాబు విశ్వవిద్యాలయం నేడు భారతదేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థలలో ఒకటిగా నిలుస్తూ, రాయలసీమను ఉన్నత విద్యకు గుర్తింపు పొందిన కేంద్రంగా మారుస్తోంది. గత కొన్నేళ్లుగా MBU విద్యార్థులకు అత్యధిక ప్లేస్మెంట్లు, వేతన ప్యాకేజీలను స్థిరంగా సాధిస్తోంది. ఇది దేశంలోని అనేక ప్రభుత్వ లేదా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు సాధ్యపడని రికార్డు.
ఎంతో మందికి ఉచిత విద్య అందించిన సంస్థ
1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్థాపించినప్పటి నుండి, ఈ వర్సిటీ బలమైన సామాజిక నిబద్ధతను కొనసాగిస్తోంది. ఎంతోమందికి ఉచిత విద్యను అందించడం, సాయుధ దళాలు, పోలీసు సిబ్బంది పిల్లలకు పూర్తి స్కాలర్ షిప్ ఇవ్వడం, అనాథలను దత్తత తీసుకుని వారికి పూర్తి విద్య, సంరక్షణ అందించడం వంటివి వర్సిటీ చేస్తోంది. విద్య, సమాజ సేవలో మా సహాయ సహకారాలు బహిరంగ రికార్డులలో ఉన్నాయి. దురుద్దేశంతో కొంతమంది పదే పదే మా ప్రయత్నాలను విమర్శిస్తున్నారు.
మా అకడమిక్ నాణ్యత అంతర్జాతీయ స్థాయిలో ప్రతిబింబిస్తున్నది. QS 100 ర్యాంకు పొందిన పెన్ స్టేట్ యూనివర్శిటీ (USA)తో జాయింట్ డిగ్రీ ప్రోగ్రామును ప్రవేశపెట్టిన భారతదేశపు మొదటి విశ్వవిద్యాలయం MBU. మాకు RWTH ఆకెన్ విశ్వవిద్యాలయం (జర్మనీ) మరియు విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం (USA)తో కూడా అవగాహన ఒప్పందాలు ఉన్నాయి. ఈ భాగస్వామ్యాల ద్వారా విద్యార్థులు భారతదేశంలో తమ డిగ్రీలను కొనసాగిస్తూనే విదేశీ యూనివర్శిటీలలో సెమిస్టర్ మరియు పరిశోధన కార్యక్రమాలను అభ్యసించడానికి వీలు కలుగుతుంది.
తప్పు జరగలేదని కమిషన్ తెలిపింది
కొద్దిమంది సభ్యులతో ఏర్పడిన కమిటీ, ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనేక విశ్వవిద్యాలయాల అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన సమయంలో చిన్న అంశాలను పెంచి చూపి అనవసర వివాదాన్ని సృష్టించడం దురదృష్టకరం. విచారణ సమయంలో మోహన్ బాబు యూనివర్శిటీ బృందం మాకు పూర్తిగా సహకరించిందని అదే కమీషన్ తన నివేదికలో పేర్కొంది. అంటే ఎలాంటి తప్ప జరగలేదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.
మాకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ వస్తున్న వేలాది మంది తల్లిదండ్రులకు, విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఛాన్సలర్, డాక్టర్ ఎమ్. మోహన్ బాబు మార్గదర్శకత్వంలో మేము ప్రపంచ స్థాయి సమగ్ర విద్యను అందిస్తూ యువతను శక్తివంతం చేసే ప్రయత్నాన్ని కొనిసాగిస్తున్నామని’ మోహన్ బాబు యూనివర్శిటీ ప్రో ఛాన్సలర్ విష్ణు మంచు ఓ ప్రకటనలో తెలిపారు.