తిరుపతి : దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ అబ్దుల్ నజీర్, బిజెపి నాయకులు, వైయస్సార్సీపి ఎంపీలు ఎమ్మెల్యేలు, అధికారులు.. రేణిగుంట విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు బయటలుదేరిన ప్రధాని మరికాసేపట్లో అక్కడికి చేరుకోనున్నారు.


రేణిగుంట వద్ద అభిమానులకు, ప్రజలకు అభివాదం చేశారు ప్రధాని. ఆ సమయంలో ప్రధానిపై పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తిరుమలలోని అర్చన అతిధి గృహంలో ఇవాళ రాత్రి బస చేయనున్నా ప్రధాని మోదీ. ఆయన రేపు (నవంబర్ 27న) ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. స్వామి వారి దర్శనంతరం ప్రధాని మోదీ తిరిగి పయాణం కానున్నారని సమచారం.


ప్రముఖులు బస చేసే అతిథి గృహాలను ఇప్పటికే ఎన్ ఎస్ జీ బలగాలు తమ ఆధీనంలో తీసుకున్నాయి. ప్రధాని ఏ మార్గాలు అయితే ప్రయాణిస్తారో ఆ మార్గాల్లో బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాల ఉన్నతాధికారులు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఆలయం ఇతర ప్రవేశాలను టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డితో కలిసి పరిశీలించారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రధాని మోదీ 2015, 2017, 2019లో శ్రీవారిని దర్శించుకున్నారు. 2023 నాలుగో పర్యాయం మోదీ తిరుమలకు వస్తున్నారు. ప్రధాని మోదీ తిరుమల, తిరుపతి పర్యటన క్రమంలో కాన్వాయ్ ట్రైలర్ శనివారం రాత్రి నిర్వహించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలలోని రచన గృహం వరకు. అటు తరువాత శ్రీవారి ఆలయం వరకు ట్రైల్ రన్ కొనసాగింది. ఇప్పటికే అటు కేంద్ర ఇటు రాష్ట్ర పోలీసు బలగాలు తిరుమలను జల్లెడ పట్టారు.


తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ..
ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం తూఫ్రాన్ (Thupran), నిర్మల్ (Nirmal) లోని సకల జనుల సంకల్పం పేరుతో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లుగా రాష్ట్రంలో కుటుంబ పాలనే నడుస్తోందని, రాష్ట్రంలో రూ.కోట్లల్లో ఇరిగేషన్ స్కాం జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తారని, ప్రజల భవిష్యత్ గురించి చింత లేదని ధ్వజమెత్తారు. నిర్మల్ లో బొమ్మల పరిశ్రమను బీఆర్ఎస్ పట్టించుకోలేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అంటే పేదలకు గ్యారెంటీ ప్రభుత్వమని స్పష్టం చేశారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యమని, అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని పునరుద్ఘాటించారు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply


Also Read: Telangana Elections 2023: 'కేసీఆర్ పదేళ్ల పాలన అవినీతిమయం' - అధికారం ఇస్తే ప్రజా పాలన చూపిస్తామన్న రాహుల్ గాంధీ