Anna Konidela visits Tirumala temple | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సతీమణి అన్నా కొణిదల (అన్నా లెజినోవా) సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికగా.. స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అన్నా కొణిదలకు అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. అధికారులు ఆమెకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం నుండి అఖిలాండం వద్దకు చేరుకుని అన్నా కొణిదల టెంకాయలు కొట్టి మొక్కలు తీర్చుకున్నారు.

ఇటీవల సింగపూర్ సమ్మర్ క్యాంప్ వెకేషన్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదల దంపతుల కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. స్కూలు బిల్డింగ్ లో అగ్నిప్రమాదం సంభవించగా.. ఒకరు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 20 మంది వరకు గాయపడ్డారు. వారిలో పదిహేను మంది వరకు చిన్నారులు ఉన్నారు. సింగపూర్ అగ్నిమాపక సిబ్బందికి అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేసి.. మార్క్ శంకర్‌‌తో పాటు ఇతరుల ప్రాణాలు కాపాడింది. హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ వార్డులో మార్క్ శంకర్ కు వైద్య చికిత్స అందించారు.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లారు. తన కుమారుడికి చిన్న ప్రమాదం అనుకున్నాం, కానీ పెద్ద ప్రమాదమే జరిగిందని తరువాత తెలిసిందని పవన్ కళ్యాణ్ అన్నారు. మార్క్ శంకర్‌కు డాక్టర్లు బ్రాంకో స్కోపి నిర్వహించారని తెలిపారు. శ్వాసకోశ నాళాలు, ఊపిరితిత్తుల్లో పొగ చేరడంపై డాక్టర్లు ప్రత్యేక పరికరంతో పరీక్షలు చేశారు. దీర్ఘకాలంలో ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని పవన్ అన్నారు. ఆదివారం నాడు పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా దంపతులు కుమారుడు మార్క్ శంకర్‌తో కలిసి ఏపీకి తిరిగొచ్చారు. కుమారుడు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడితే తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటానని అన్నా కొణిదల మొక్కుకున్నారు.

ఉదయం ఏపీకి, రాత్రి తిరుమలకు..సింగపూర్ నుంచి ఆదివారం ఏపీకి తిరిగొచ్చారు పవన్ కళ్యాణ్, అన్నా కొణిదల దంపతులు. శ్రీవారి దర్శనార్థం అన్నా కొణిదల ప్రత్యేక విమానంలో తిరుపతి రేణిగుంటకి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తిరుమల చేరుకున్న ఆమెకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. మొదట అన్యమతస్తురాలు కావడంతో తనకు హిందూమతంపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఇచ్చిన పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం వరాహస్వామివారిని ఆమె దర్శించుకున్నారు. పద్మావతి కళ్యాణకట్టలో సాధారణ భక్తురాలిగా వెళ్లి తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని అన్నా కొణిదల ప్రార్థించారు.

మొదట పవన్ కళ్యాణ్, అన్నా కొణిదల దంపతులు తిరుమలకు వెళ్లి దర్శించుకుంటారని ఆదివారం ఉదయం నుంచి ప్రచారం జరిగింది. అయితే మొక్కులు చెల్లించుకునేందుకు అన్నా కొణిదల ఒక్కరే తిరుమలకు వెళ్లారు. శనివారం తలనీలాలు సైతం సమర్పించుకున్న అన్నా కొణిదల సోమవారం ఉదయం సుప్రభాతం సేవలో స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమల పర్యటన అనంతరం ఆమె తిరుగు ప్రయాణం కానున్నారు.