ప్రపంచంలో అతి పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి‌ దేవస్ధానాని(TTD)కి కేంద్ర ప్రభుత్వం అరుదైన అవకాశం కల్పించింది. శ్రీవారికి భక్తుల సమర్పించే ఫారెన్ కరెన్సీని బ్యాంకులో డిపాజిట్ చేసుకునే విధంగా టిటిడికి కేంద్ర ప్రభుత్వం ఊరట నిచ్చింది. కానుకలు సమర్పించిన దాతల వివరాలు లేకపోయినా బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకునే విధంగా సెక్షన్ 50 నిబంధనలకు మేరకు టీటీడీకి మినహాయింపు కల్పించింది. దాతల వివరాలు లేకపోయినప్పటికీ భక్తులు స్వామి వారికి సమర్పించిన కానుకల వివరాలు పేర్కొనాలని సూచించింది. ఫారిన్ కరెన్సీ డిపాజిట్ల విషయంలో మూడు కోట్ల రూపాయలను టీటీడీ జరిమానా చెల్లించిన తర్వాత ఫారిన్ కరెన్సీ డిపాజిట్లు చేసుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం లైసెన్స్‌ను రెన్యువల్ చేసింది.


విదేశాల నుంచి తిరుమలకు భక్తుల కానుకలు
కలియుగ దైవం శ్రీనివాసుడిపై అపారమైన భక్తితో వారి వారి స్ధోమతలకు తగినట్లు వివిధ దేశాల నుండి వచ్చిన భక్తులు కానుకలు సమర్పిస్తూ ఉంటారు.. అయితే ఈ హుండి రూపంలో కొందరు పంపతే మరికొందరు నగదు రూపంలో కానుకలు సమర్పించి‌ మొక్కులు చెల్లించుకుంటారు. ఒక్క రూపాయి‌ నుండి కోట్ల రూపాయలు నగదు, బంగారు, వెండి, వివిధ విదేశీ కరెన్సీ నోట్లను శ్రీవారి దర్శనంతరం శ్రీవారి హుండీలో సమర్పిస్తూ‌ ఉంటారు. ఎవరు ఎంత నగదు వేశారో అనే వివరాలు ఎవరికీ తెలియదు.. స్ధోమతకు తగ్గట్టుగా హుండీ కానుకలు సమర్పించే సౌలభ్యం ఉండడంతో కానుకలు వేసి వెళ్ళి పోతుంటారు భక్తులు. ఇక ఈ హుండీలో సైతం ఎంతో మంది అజ్ఞాత భక్తులు, విదేశీ భక్తులు నగదును ట్రాన్సఫర్ చేస్తుంటారు. వీరి వివరాలు ఏమాత్రం టిటిడికి అసలు తెలియజేయరు. ప్రపంచ దేశాల్లో వివిధ దేశాలైన అమెరికా, ఇంగ్లండ్, అరబ్ దేశాలు, ఆస్ర్టేలియా, సింగపూర్, కెనడా, సింగపూర్,‌ మలేషియా వంటి‌ దేశాల నుండి కానుకలను ఈ‌హుండీ ద్వారా భక్తులు నగదును బదిలీ చేస్తుంటారు. ఇలా నగదును బదిలీ‌ చేసిన వారు చాలా వరకూ వివరాలు తెలిపేందులు‌ ఇష్టపడకుండా చాలా గోప్యంగా ఉంచుతారు. ఇలా వివరాలు తెలియజేయకుండా నగదును ఈ-హుండీ‌ ద్వారా పంపడం ద్వారా టిటిడికి సుమారు 26 కోట్ల రూపాయలు అందాయి. 


గతంలో జరిమానా.. ఇక నుంచి ఊరట
ఇందులో ప్రధానంగా చెప్పుకోదగినవి యుఎస్ డాలర్లు 11.50 , మలేషియా రింగిట్స్ రూ.5.93 కోట్లు, సింగపూర్ డాలర్లు రూ.4.06 కోట్లు కూడా ఉండగా, ఆ మొత్తాన్ని స్టేట్ బ్యాంకు టీటీడీ ఖాతాలో జమ చేయకుండా మూడు సంవత్సరాలుగా వరకూ కాలం పొడిగిస్తూ వచ్చింది. అయితే ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని టిటిడి కేంద్ర ప్రభుత్వంకు లేఖ ద్వారా విన్నవించింది. అయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ టీటీడీకి 2019కి గానూ 1.14 కోట్ల రూపాయలు అపరాధ రుసుము విధించింది. మళ్లీ ఈ ఏడాది మార్చి 5 న కేంద్ర ఎఫ్.సి.ఆర్.ఎ విభాగం వార్షిక రిటర్న్‌ల్లో హుండీలో కానుకలు వేసిన వారి చిరునామాలు లేవని, టీటీడీ ఉన్నత అధికారులకు లేఖ రాస్తూ మళ్లీ  రూ. 3.19 కోట్ల జరిమానా విధించింది. ఇలా రెండు సార్లు మొత్తం 4.31 కోట్ల రూపాయలును అపరాధం విధించిన విషయం తెలిసిందే. 
అంతటితో ఆగకుండా టిటిడికి రాసిన లేఖలో ఏపి దేవదాయ శాఖను సైతం తప్పులను ఎత్తు చూపుతూ టిటిడికి లేఖను‌ పంపింది కేంద్రం. అయితే టిటిడికి కేంద్ర ప్రభుత్వం విధించిన అపరాధ రుసుంలో కేవలం మూడు కోట్ల రూపాయలు మాత్రమే కడుతామని టిటిడి కేంద్రానికి విన్నవించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ,‌ శ్రీవారికి భక్తులు సమర్పించే ఫారిన్ కరేన్సీని బ్యాంకులో డిఫాజిట్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఫారిన్ కరేన్సి సమర్పించిన దాతలు వివరాలు లేకపోయినా బ్యాంకులో డిఫాజిట్ చేసుకునేందుకు టిటిడికి కేంద్ర ప్రభుత్వం మినహయింపు ఇచ్చింది. ఇక భక్తులు శ్రీవారికి సమర్పించిన కానుకల వివరాలు మాత్రం తెలియజేయాలని టిటిడిని కేంద్రం‌ కోరింది. అయితే సెక్షన్ 50 నిబంధనల ప్రకారం టిటిడికి మాత్రమే ఇలాంటి మినహయింపు ఇస్తున్నట్లు టిటిడికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి ముత్తుకుమార్ శుక్రవారం సమాచారం అందించారు.
గతంలో ఫారిన్ కరెన్సీ డిపాజిట్లు వ్యవహారంలో టిటిడికి మూడు‌ కోట్ల రూపాయలు కేంద్రం ప్రభుత్వం విధించిన విషయం తెలిసిందే. ఈ జరిమానాను టిటిడి చెల్లించడంతో ఫారిన్ కరెన్సీ డిఫాజిట్లు చేసుకునేందుకు 2018వ సంవత్సరంలో ముగిసిన ఎఫ్సీఆర్ఏ‌ లైసెన్స్ ను సైతం కేంద్రం రెన్యూవల్ చేసింది. గతంలో లైసెన్స్ రెన్యువల్ చేసినా, ఫారిన్ కరెన్సీ డిఫాజిట్ల విషయంలో దాతల వివరాలు కచ్చితంగా తెలియజేయాలని నిభందనలను పెట్టిన కేంద్రం ఆ‌ నిబంధనలను సడలిస్తూ, టిటిడి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించింది.