తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం రోజున 57,702 మంది స్వామి వారి దర్శించుకున్నారు. 27,482 మంది తలనీలాలు సమర్పించారు. 3.43 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు.. సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 15 కంపార్ట్‌మెంట్‌ల్లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటలకుపైగా సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పడుతుంది.. 


మార్చి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాతోపాటు ఈ నెల 23 నుంచి 28వ తేదీ వరకు విడుదల చేయని కోటాను కాసేపట్లో టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం పదకొండు గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేయనుంది. ఈ నెల 22 నుంచి 28 వరకు 300 రూపాయల ఎస్‌ఈడీ టికెట్లను ఆన్‌లైన్ కోటాను ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు విడుదల చేయనుంది. 


శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు.`శనివారం స్వామికి ఇష్టమైన రోజుగా పిలుస్తారు. వేకువ జామునే ప్రత్యూషకాల ఆరాధనతో  ద్వారాలు తెరిచి వైఖానస అర్చకులు, సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామి తొలి దర్శనం చేసుకున్నారు. బంగారు వాకిలి వద్ద వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామిని మేలు కొలిపారు. బంగారు వాకిలి వద్ద సుప్రభాతం స్తోత్రం, ప్రవర్తి, మంగళ శాసనం వంటివి పటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకులు శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చి పాలు సమర్పించారు.అనంతరం "నల్ల నువ్వుల బెల్లంతో " కలిపిన ప్రసాదం నివేదించారు. 


ముందు రోజు రాత్రి పావళింపు సేవలో బంగారు నవారు మంచంపై సేవించి ఉన్న శ్రీవారికి వారిని మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి సింహాసనంపై జీవ స్థానంలో కూర్చోబెడతారు. అనంతరం ఏకాంతంగా కర్పూర నిరాజనం సమర్పిస్తారు. దీనినే కైకర్యపరుల హారతి అని కూడా పిలుస్తారు..


శ్రీవారి మూలవిరాట్ ముఖ మండపంలో గడ్డం మీద అర్చకులు గడ్డం బొట్టుగా పచ్చ కర్పూరాన్ని అద్దిన తరువాత గొల్ల హారతి ఇస్తారు. తర్వాత వైఖానస అర్చకులు బ్రహ్మ తీర్థాన్ని స్వీకరించిన తరువాత జియ్యంగార్లలకు, సన్నిధి గొల్లకు బ్రహ్మ తీర్థం అందిస్తారు. అనంతరం బంగారు వాకిలి వద్ద మంగళ శాసన శ్లోకాలు పఠనం జరుగుతుండగా, సన్నిధిలో శ్రీవారికి కర్పూర నీరాజన సమర్పణ జరుగుతుంది. మహంతి మఠం, మైసూరు రాజావారి ప్రతినిధి, తాళ్ళపాక అన్నమయ్య వంశీయులు తమళపాకు, వక్కలు శ్రీవారికి నివేదించి నవనీత హారతి సమర్పిస్తారు. ఈ సమయంలో జరిగే దర్శనానికి విశ్వరూప దర్శనం అని పిలుస్తారు. 


అనంతరం భోగ శ్రీనివాసమూర్తికి స్నాన పీఠంపై పెట్టిన అర్చకులు.. తోమాల సేవ ప్రారంభిస్తారు. ముందుగా ఆకాశగంగా తీర్థం, పాలు పరిమళం మొదలైన ద్రవ్యాలతో పురుష సూక్త పఠనంతో అభిషేకం నిర్వహిస్తారు. తర్వాత శ్రీవారి బంగారు పాదకవచములకు, సాలగ్రామములకు యథాక్రమం తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం పరధా వేసి ప్రాతఃకాల ఆరాధనకు సంకల్పం చేసి ఆకాశగంగా తీర్థంతో పంచ పాత్రలను నింపి భూతశుద్ధి, ఆవాహనాధులను పూర్తి చేసి పరదా తొలగిస్తారు.


శ్రీవారి మూలవిరాట్ కు ఆసనం, పాద్యం, అర్ఘ్యం,అచమనం మొదలైన 30 ఉపచారాలతో వేద మంత్రోచ్చారణ జరుగుతుంది. శ్రీవారి మూర్తులన్నింటినీ పుష్ప మాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. శ్రీవారి మూలవిరాట్ కు నక్షత్ర హారతి, కర్పూర హారతి సమర్పిస్తారు. ఈ తంతుతో తోమాల సేవ పూర్తి అవుతుంది. తర్వాత ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నపన మండపంలో దర్బార్ నిర్వహిస్తారు.. 


శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జమాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని ఇస్తారు. నవనీత హారతి సమర్పించిన అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలోకి తీసుకొచ్చి శ్రీవారికి సహస్రనామ అర్చన సేవ నిర్వహిస్తారు.. 1008 నామాలు పట్టిస్తుండగా తులసీ దళములతో శ్రీవారికి అర్చన నిర్వహిస్తారు.తర్వాత స్వామి వారికి నక్షత్ర హారతి, కర్పూర హారతి జరిపి మొదటి నివేదనకు సన్నాహాలు జరుపుతారు.


శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదన జరుగుతుంది. స్వామి వారి ప్రాతఃకాల నైవేధ్యంలో భాగంగా అన్న ప్రసాదం, లడ్డూ, వడ, వంటి సమర్పిస్తారు. తర్వాత సన్నిధిలో శ్రీవారికి సాత్తుమొర నిర్వహించిన తరువాత సర్కారు వారి హారతి జరిపి విఐపి బ్రేక్‌ దర్శనానికి అనుమతిస్తారు. తర్వాత శ్రీవారికి రెండో గంట నివేదన, బలి జరిపి తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు. శ్రీవారి ఉత్సవమూర్తి అయినా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రారకారంలోని కళ్యాణ మండపానికి వేంచేపు చేస్తారు.. అక్కడ మధ్యాహ్నం 12 గంటలకు అభిజీలగ్నంలో శ్రీవారికి నిత్య కళ్యాణోత్సవాన్ని అర్చకులు నేత్రపరంగా నిర్వహిస్తారు..


శ్రీవారి ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను శాస్త్రోక్తంగా నిర్వహించి, ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభవోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు.. అక్కడ వారికి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు.. సాయంత్రం కొలువు మంటపంలో సహస్త్ర దీపాల కాంతులతో శ్రీవారికి ఒంజల్ సేవను నిర్వహిస్తారు.. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత తిరుమాఢ వీధిలో నిత్యోత్సవానికి నిర్వహిస్తారు.. అనంతరం శ్రీవారిని సన్నిధిలోనికి వేంచేపు చేస్తారు.. సర్వదర్శనం నిలుపుదల చేసి శ్రీవారికి రాత్రి కైంకర్యాలను ప్రారంభిస్తారు అర్చకులు.. ఈ క్రతువులో భాగంగా శ్రీవారి మూలవిరాట్ కు ఉదయం తోమాల సేవలో అలంకరించిన పుష్పమాలను తొలగించి, సన్నిధి పాత్ర శుద్ధి చేస్తారు.. అనంతరం శ్రీవారికి రాత్రి తోమాల,రాత్రి అర్చన, రాత్రి గంట, తిరువీసం ఘంటాబలి నిర్వహించి సర్వ దర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతిస్తారు.. సర్వదర్శనం పూర్తయిన తర్వాత శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు..