Tirumala Rush: శ్రీనివాసుడి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణ స్ధాయిలో చేరుకుంది. మంగళవారం(26.07.2022) రోజున 68,982 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 29,092 మంది తలనీలాలు సమర్పించారు. 4.60 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. అయితే సర్వదర్శనం భక్తులు వైకుంఠంలో 18 కంపార్ట్మెంట్లల్లో వేచి‌ ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు దాదాపు రెండు గంటల సమయం పడుతోంది.


శ్రీవారి నిత్య కైంకర్యాలు..


శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో‌ భాగంగా బుధవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారమును తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించారు. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీ కొలువు శ్రీనివాస మూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిని స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాస మూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.


కైంకర్యాల తర్వాత దర్శనాలు..


సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వి.ఐ.పి భక్తులను స్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వామి వారికి రెండో గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి "బుధవారం" రోజు నిర్వహించే సహస్ర కళషాభిషేకాన్ని విగ్రహ అరుగుల పరిరక్షణకై టిటిడి రద్దు చేసింది. కేవలం ఏడాదికి‌ ఒకసారి సర్కారు వారి సహస్రకళషాభిషేకం టిటిడి నిర్వహిస్తొంది. అనంతరం  సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తి అయినా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహించనున్నారు.


స్వామి వారికి బ్రహ్మోత్సవం..


ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి, ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు. సాయంకాలం సహస్రదీపాలంకారసేవ  కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన అనంతరం నిత్యోత్సవం నిర్వహిస్తారు. సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు. నిత్య సేవల్లో‌ భాగంగా సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి సహస్ర దీపాలంకారసేవను నిర్వహించి, తిరుఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం ఉత్సవమూర్తులు శ్రీవారి ఆలహం చేరుకోగానే, సృవదర్శనం భక్తులను నిలిపి వేసి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు. రాత్రి కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు.


ఇలా చేరుకోవచ్చు..


శ్రీనివాసుడి దర్శనం కోసం తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులు అలిపిరి‌ నడక మార్గం, శ్రీవారి నడక మార్గం, తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసి తిరుమల పుణ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. ఇలా తిరుమలకు వచ్చిన భక్తులు ముందుగా సిఆర్వో కార్యాలయం వద్ద వసతి గదులు పొంది, స్వామి వారికి తలనీలాలు సమర్పించి స్వామి వారి దర్శన భాగ్యం పొందే అవకాశం కల్పిస్తోంది టిటిడి. ఇక యాత్రికుల సౌఖర్యార్ధం తిరుమలలో ప్రధాన ప్రాంతాల్లో పుడ్ కౌంటర్లతో పాటుగా, మాతృశ్రీ వెంగమాంబ అన్నదాన సత్రంలో ఉదయం ఏడు గంటల నుండి రాత్రి 11 గంటల వరకూ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తోంది టిటిడి. అదే విధంగా భక్తులకు కోరినన్ని లడ్డూలను భక్తులకు టిటిడి అందిస్తోంది. ఇక తిరుమల యాత్రతో పాటుగా వివిధ యాత్ర ప్రదేశాలు భక్తులు సందర్శించేందుకు బస్సు సౌఖర్యం కల్పించింది టిటిడి.