చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ టీడీపీ కార్యకర్తను ఎస్సై తీవ్రమైన పదజాలం, బూతులతో దూషించడం సంచలనంగా మారింది. స్థానిక టీడీపీ కార్యకర్త అయిన గజేంద్రను రామకుప్పం ఎస్సై కృష్ణ తీవ్ర బెదిరించారు. తాను పెట్టిన కేసు రిజిస్టర్ చేయమని అడిగినందుకు గజేంద్రపై ఇక్కడ ప్రస్తావించలేని బూతులతో ఎస్సై కృష్ణ విరుచుకుపడ్డారు. ఈ ఆడియో కాల్ రికార్డింగ్ మంగళవారం (ఏప్రిల్ 25) వెలుగుచూసింది. కానీ, ఈ ఫోన్ కాల్ మాట్లాడినది మాత్రం 2021లో అని బాధితుడు తెలిపాడు.


రామకుప్పం ఎస్సై కృష్ణయ్య వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని, అతనితో 2021లో జరిగిన ఈ ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్‌ను జతపరుస్తూ గజేంద్ర మంగళవారం అమరావతికి వచ్చి డీజీపీ రాజేంద్రనాథ రెడ్డి, గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో పాటు రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.


‘‘రౌడీ షీట్ ఓపెన్ చేస్తా, నీ దిక్కు ఉన్న చోట చెప్పుకో, ఎన్‌కౌంటర్ చేస్తా నా కొడకా. నిన్నూ మీ అన్నను కాల్చిపారేస్తా. తిక్క రేగితే మిమ్మల్ని రిమాండ్‌ చేసి పారదొబ్బుతా. నీ మీద, నీ అన్న మీద రౌడీషీట్‌ తెరుస్తా. నోర్మూసుకుని గమ్మునుండండి. లేదంటే మెట్టుతో కొడతా నా కొడకా’’ అంటూ తీవ్ర అసభ్య పదజాలంతో ఎస్సై బెదిరించినట్లుగా ఆడియో వైరల్ అవుతోంది. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎస్సై తీరుపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నాయకులు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఎస్సై ప్రవర్తనను టీడీపీ అధినే‌త నారా చంద్రబాబు దృష్టికి టీడీపీ నాయకులు తీసుకెళ్ళినట్లు సమాచారం.


ఎస్సై ఆపకుండా అదే పనిగా తిడుతుండగా, బాధితుడు తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. ‘‘సార్‌ మేమిచ్చిన కంప్లైంట్ పై కేసు నమోదు చేయలేదు. వైఎస్ఆర్ సీపీ నాయకుల కంప్లైంట్ ఆధారంగా కేసు కట్టారు. ఇలా వాళ్ల పక్షానే వ్యవహరిస్తే ఎలా సార్‌’’ అంటూ గజేంద్ర ఎస్సై కృష్ణయ్యతో తన గోడు చెప్పుకుంటుండగానే అవతలి నుంచి ఎస్సై బూతుల దాడి చేశాడు. ఉత్‌ అంటే భయపడిపోయేవాడివి నీకు పార్టీ ఎందుకు రా అంటూ ఎస్సై రెచ్చిపోతూ మాట్లాడారు. 


ఈ గొడవ ఎందుకు వచ్చిందంటే..
బాధితుడి సొంత ఊరిలో ఇంటి నిర్మాణానికి ఇసుక తెచ్చుకుంటుండుగా వైఎస్ఆర్ సీపీ గ్రామస్థాయి కార్యకర్త ఒకరు ఆపి డబ్బులు డిమాండు చేశాడు. దీనిపైనే 2021లో రామకుప్పం ఎస్సైకి కంప్లైంట్ ఇచ్చినా కేసు పెట్టలేదు. ఆ వైఎస్ఆర్ సీపీ నాయకుడి నుంచే ఫిర్యాదు తీసుకుని ఉల్టా తనపైనా, తన అన్న పైనా కేసు పెట్టారని బాధితుడు వాపోయాడు. కొన్ని రోజులకే ట్రాన్స్‌ఫర్ పై మరో చోటికి వెళ్లిన కృష్ణయ్య, జనవరిలో మళ్లీ రామకుప్పం ఎస్సైగా వచ్చారు. అప్పటి నుంచి తనను బాగా వేధిస్తున్నాడని, తనపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసు పెట్టారని, హైకోర్టుకు వెళ్లి బెయిల్‌ తెచ్చుకున్నానని వివరించారు. నాలుగు రోజుల క్రితం ఇతర పోలీసు సిబ్బందితో తన ఇంటికొచ్చి తన భార్యను బెదిరించారని చెప్పారు. అందుకే అప్పటి ఆడియో క్లిప్పింగ్‌ను బయటపెట్టానని చెప్పారు.