Greater Chittoor Corporation Budget 2023-24: చిత్తూరు : చిత్తూరు నగరపాలక సంస్థ 2023-24 సంవత్సరం బడ్జెట్ అంచనాలను రూ.273.12 కోట్లతో రూపొందించినట్లు నగర మేయర్ ఎస్. అముద తెలిపారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం మంగళవారం నగరపాలక సమావేశ మందిరంలో నగర మేయర్ ఎస్ అముద అధ్యక్షతన జరిగింది.


చిత్తూరు నగర పాలక సంస్ధ సమావేశంలో ఎమ్మెల్యే పై కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లోనే చిత్తూరు నగరపాలక సంస్థ బడ్జెట్ ను మేయర్ అముద ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా 2023 24 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్ అంచనాలను కౌన్సిల్ ఆమోదించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో నగరపాలక సంస్థకు సాధారణ, మూలధన జమల ద్వారా రూ.273,12,35,033 వస్తుండగా, రూ.195,01,25,860 సాధారణ మూలధనం వ్యయంగా అంచనా వేశారు. ఎక్స్ అఫీషియో సభ్యుల హోదాలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సభకు హాజరయ్యారు.


బడ్జెట్ ప్రాధాన్యత అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 
బడ్జెట్ సమావేశం (Budget Meeting) సందర్భంగా నగర కమిషనర్ డా. జె అరుణ నగరపాలక సంస్థ బడ్జెట్ ప్రాధాన్యత అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కౌన్సిల్ సభ్యులకు వివరించారు. ఈ బడ్జెట్లో నగరంలో రోడ్లు, వీధి దీపాలు, నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్యం అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు కమిషనర్ వివరించారు. విలీన పంచాయతీల్లో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు వివరించారు. చిత్తూరు శాశ్వత తాగునీటి సరఫరా కోసం ఉద్దేశించిన అడవిపల్లి రిజర్వాయర్ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇందులో భాగంగా ఏడు ఈఎల్ఎస్ఆర్ ట్యాంకులు మంజూరు అయినట్లు కమిషనర్ వివరించారు. అనంతరం ఇంజనీరింగ్, ప్రజారోగ్య విభాగం, ప్రణాళిక, రెవెన్యూ, మెప్మా, సాధారణ పరిపాలన, వార్డు సచివాలయాలు అంశాలపై శాఖాధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.


ఆసరా కార్యక్రమంలో అధికారుల అలసత్వం..
జగనన్న ఆసరా (Jagananna Aasara) కార్యక్రమానికి వచ్చిన మహిళకు అధికారులు కనీస వసతులు కూడా ఏర్పాటు చేయలేదు. దాంతో సభలో ఎమ్మెల్యే ప్రసంగిస్తున్నా పట్టించుకోకుండా సభా ప్రాంగణం బయటకు వెళ్లిపోయే ప్రయత్నం చేశారు మహిళలు. కానీ సభ నుంచి మహిళలు బయటకు వెళ్లకుండా అడ్డుకునేందుకు గేట్లకు సిబ్బంది తాళాలు వేయడం వివాదాస్పదమైంది.


చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం (Chitttoor Nagaiah Kalakshetram)లో నిర్వహించిన జగనన్న ఆసరా కార్యక్రమానికి జిల్లా పరిసర ప్రాంతాల ఉదయం 10 గంటలకు మహిళలు భారీగా చేరుకున్నారు. ఉదయం నగర పాలక సంస్థ సర్వసభ సమావేశం ఉండడంతో ఎమ్మెల్యే కార్యక్రమానికి రాలేకపోయారు. అప్పటినుంచి మహిళలను కనీసం వసతులు కూడా ఏర్పాటు చేయకుండా ఆకలితో ఉంచారని పలువురు మహిళలు ఆరోపించారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎటువంటి స్నాక్స్ కానీ భోజనాలు కానీ ఏర్పాటు చేయలేదని చాలామంది మహిళలు అధికారులను దూషిస్తూ వెళ్ళిపోతుండగా అధికారులు అప్రమత్తం అయ్యారు. అధికారుల సూచనతో సిబ్బంది గేట్లకు తాళాలు వేసి మహిళలు ఇష్టం లేకున్నా కళాక్షేత్రంలోకి తిరిగి వచ్చేలా చేశారు. వెనుతిరిగిన మహిళలను దూషించడం చాలా అన్యాయమని పలువురు మహిళలు మీడియాకు చెబుతూ వాపోయారు.
 Also Read: Merugu Nagarjuna: ఎస్సీ సబ్ ప్లాన్ పనులకు రూ.13,112 కోట్లు ఖర్చు - మంత్రి మేరుగు నాగార్జున