Punganur Violence Case:  
- పుంగనూరులో పోలీసులపై దాడి చేసిన ఘటనలో ఘటనలో 62 మంది అరెస్ట్..
- చంద్రబాబు రోడ్ షో సందర్భంగా 50 మంది పోలీసులు గాయపడ్డారు
- పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి కేసు నమోదు చేశాం
- రోడ్ షోను పుంగనూరు టౌన్ కు మళ్ళించేందుకు టిడిపి శ్రేణులు ప్లాన్ చేశాయి 
- పోలీసులపై దాడి ఘటనలో ఏ 1 గా చల్లా రామచంద్రారెడ్డిని చేర్చాం..
- త్వరలోనే పుంగనూరు టిడిపి ఇంఛార్జ్ చల్లా బాబును అరెస్టు చేస్తాం..
- పలమనేరులో మీడియాతో అడిషనల్ ఎస్పీ కె.లక్ష్మీ


టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సాగునీటి విధ్వంసంపై యుద్దభేరి పర్యటనలో పోలీసులపై జరిగిన రాళ్ళ దాడి ఘటనలో 62 మంది టీడీపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా పలమనేరులో అడిషనల్ ఎస్పీ కె.లక్ష్మీ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 4వ తేదీన పుంగనూరులో చంద్రబాబు రోడ్ షో పోలీసులు బందోబస్తు నిర్వహించడం జరిగిందని, ఈ క్రమంలో తెలుగు తమ్ముళ్లకు పోలీసులకు మధ్య జరిగిన ఘటనలో 50 మంది పోలీసులు గాయపడ్డారని ఆమె తెలిపారు.


చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఆదేశాలతో నేడు ఘటనకు సంబందించి పోలీసు వాహనాలకు నిప్పంటించి, పోలీసులపై రాళ్ళ దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు. ముందుగా చెప్పిన ప్లాన్ లో లేకున్నప్పటికీ చంద్రబాబు రోడ్ షో ను పుంగనూరు టౌన్ కు మళ్లించడానికి ముందుగా రొంపిచర్లలో 4వ తేదీన పుంగనూరు టీడీపీ ఇంఛార్జ్ చల్లా బాబు(చల్లా రామచంద్రారెడ్డి) సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో టీడీపీ కార్యకర్తలను ప్రేరేపించడని ఆయన పిఏ గోవర్ధన్ రెడ్డి పోలీసుల విచారణలో చెప్పాడని తెలిపారు. 


ఈ సంఘటనకు సంబంధించి పుంగనూరు టీడీపీ ఇంచార్జి చల్లా రామచంద్రా రెడ్డిని ఏ1 గా పోలీసులపై  దాడికి పాల్పడి రాళ్లు, బీరు బాటిళ్లు విసిరి గాయపరిచారని, ఒక పోలీసు వాహనం మరియు మరొక టీయర్ గ్యాస్ వాహనం ను నిప్పు పెట్టిన వారిపై వివిధ సెక్షన్ల తో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. త్వరలోనే పుంగనూరు టీడీపీ ఇంఛార్జ్ చల్లా బాబును అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తాంమని, అదే విధంగా ఈ కేసులో మరి కొంత మంది నిందుతులను అరెస్టు చేయాల్సి ఉందని అడిషనల్ ఎస్పీ కే.లక్ష్మీ స్పష్టం చేశారు..


టీడీపీ నేతలపైనే ఎస్పీ ఆరోపణలు 
పుంగనూరులో చంద్రబాబు ప్రాజెక్టుల యాత్ర సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి  కూడా చంద్రబాబుదే తప్పని ప్రకటించారు. ప్ర తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రెచ్చగొట్టడం వల్లే దాడులు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారించామని ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. ఉదయం అన్నమయ్య జిల్లాలో ములకలచెరువు గ్రామంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబునాయుడు తంబళ్లపల్లె ఎమ్మెల్యేను రావణ అని సంబోధించారని తెలిపారు. దీంతో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు నిరసన తెలిపేందుకు నిర్ణయించుకున్నారన్నారు.