పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కానీ, ఎన్నికల అధికారులు ఆయనకు డిక్లరేషన్ ఫారం ఇవ్వకుండా ఆలస్యం చేసినందుకు ఆయన, టీడీపీ నేతలతో కలిసి అర్ధరాత్రి నిరసన చేశారు. దీంతో పోలీసులు రాత్రి 2 గంటల సమయంలో ఆయనతో పాటు టీడీపీ నేతలను అరెస్టు చేశారు. తాజాగా దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన వ్యక్తి డిక్లరేషన్ ఫారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. టీడీపీ గెలిచిందనే అక్కసుతోనే సీఎం ఇలా చేయించారని ఆరోపించారు. రాంగోపాల్ రెడ్డి అరెస్టుకు సంబంధించి వీడియోను కూడా షేర్ చేశారు.


‘‘ఏం బతుకయ్యా జగన్ రెడ్డీ.. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి కి డిక్లరేషన్ ఇవ్వకుండా ఒత్తిడి చేసి అడ్డుపడతావా? పులివెందుల టీడీపీ నేత రామగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచాడని అక్కసుతో ఆర్థరాత్రి అరెస్టు చేస్తావా? ఇంతకంటే నువ్వు ఇంకేం భ్రష్టుపట్టిపోవాల్సింది ఉంది? ప్రజా తీర్పును గౌరవించి క్షమాపణ కోరు!’’ అని చంద్రబాబు ఘాటుగా ట్వీట్ చేశారు. 






రిటర్నింగ్ అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం?
భూమిరెడ్డి విషయంలో రిటర్నింగ్ అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. టీడీపీ తరఫు నుంచి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించిన రామ్‍గోపాల్ రెడ్డికి డిక్లరేషన్ ఎందుకివ్వలేదని రిటర్నింగ్ అధికారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వెంటనే రామ్‍గోపాల్ రెడ్డికి డిక్లరేషన్ ఫారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే డిక్లరేషన్ ఇచ్చేందుకు రిటర్నింగ్ అధికారి సిద్ధమయ్యారు. ఉదయం 8.30 గంటలకు డిక్లరేషన్ ఇస్తామని టీడీపీ నాయకులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఉదయం 8.30కి కలెక్టరేట్ వద్దకు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. 


జేఎన్టీయూ కాలేజీ వద్ద ఉద్రిక్తత
డిక్లరేషన్ ఫారం ఇంకా ఇవ్వనందుకు రాత్రివేళ జేఎన్టీయూ కాలేజీ మెయిన్ గేట్ ముందు ఆయన శనివారం రోజు ధర్నాకు దిగారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బి.కె పార్థసారథి, కడప పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పరిటాల శ్రీరామ్, ప్రభాకర్ చౌదరి, మాదినేని ఉమామహేశ్వర నాయుడు, శ్రీధర్ చౌదరి, ఆలం నరసానాయుడు, ఆదినారాయణ, నెట్టం వెంకటేష్‌ కూడా నిరసన తెలిపారు. దీంతో వారిని అరెస్ట్ చేసి అనంతపురం మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు.


టీడీపీ అభ్యర్థి రామ్ గోపాల్ రెడ్డి కి ఇంకా డిక్లరేషన్ ఇవ్వకపోవడంతో టీడీపీ నేతలు చేసిన ఆందోళనలో భాగంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వాహనాలను నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. కార్యకర్తలను పోలీసులు ఈడ్చుకువెళ్లారు. జేఎన్టీయూ కాలేజ్ దగ్గర ఉద్రిక్తంగా మారడంతో ముందుగానే ప్రత్యేక భద్రతా బలగాలను కూడా రప్పించారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద భయానక వాతావరణం నెలకొంది. కలెక్టర్ గారి వాహనాన్ని అడ్డగించి నిరసన తెలుపుతున్న సందర్భంలో పోలీసులు తమను అక్రమంగా అరెస్టు చేశారని మాజీ మంత్రులు, టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రజాస్వామ్య బద్ధంగా డిక్లరేషన్ ఇవ్వకుండా సరైన రీతిలో స్పందించని కలెక్టర్ కు నిరసన ద్వారా తమ బాధని వ్యక్తపరిచామని చెప్పారు. ఆయన తీరుపై నిరసన చేస్తే, అరెస్ట్ చేసి అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోలీస్ నిర్బంధంలోకి తీసుకున్నారని వాపోయారు.