ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు తిరుపతిలో ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఎన్నికల సంఘం, పోలీసులు ఎంత పటిష్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ దొంగ ఓట్లు, ప్రలోభాలు ఆపలేకపోయారు. దీనిపై ప్రతిపక్షం ఆందోళనకు దిగడం, నిలదీయడంతో వారిని పోలీసులు అరెస్టు  చేస్తున్నారు. 


తిరుపతి ఎస్జిఎస్ హైస్కూల్ పోలింగ్ బుత్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపి నాయకులు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ పొలింగ్ వద్దకు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టిడిపి నాయకులు రావడం కాసేపు టెన్షన్ వాతావరణం కనిపించింది. వారిని వైసీపీ లీడర్లు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నడిచింది. పోలీసులు రంగంలోకి దిగడంతో గొడవ సద్దుమణిగింది. 


వైసీపీ లీడర్ల అభ్యంతరంతో టిడిపి నాయకులను పోలింగ్ బూత్ నుంచి పోలీసులు బయటకు పంపించేశారు. దీనిపై మండిపడ్డా టీడీపీ నాయకులు పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దొంగ ఓట్లను కట్టడి చేయాలంటూ పోలీసులను మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నిలదీశారు. అక్రమాలు చేసి గెలవాలని ప్రభుత్వం భావిస్తోందని... అందుకు పోలీసుల సాయం తీసుకుంటుందని మండిపడ్డారు. 
తిరుపతి లోని 223వ పోలింగ్ బూత్‌లో టీడీపీ ఏజెంట్‌గా ఉన్న టీడీపీ నేత పులిగోరు మురళిని పోలీసులు అరెస్టు చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన వారిని మురళి ప్రశ్నించడంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దొంగ ఓట్లు వేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని అందుకే వారిని నిలదీశారు చెబుతున్నారు. మురళిని అరెస్ట్ చేసి పోలీసులు రేణిగుంట స్టేషన్ కి తరలించారు. 


సత్యనారాయణ పురం పోలింగ్ బూత్ వద్ద టిడిపి నాయకుడు కండ్ర లక్ష్మీపతిని పోలీసులు అరెస్టు చేశారు. దొంగ ఓట్లు వేస్తున్నారని వారిని ప్రశ్నించినందుకే లక్ష్మీపతిని అరెస్టు చేశారని మండిపడుతున్నారు టీడీపీ లీడర్లు. అదుపులోకీ తీసుకొని పోలీస్ స్టేషన్‌కీ తరలించారు. వైసీపీ నాయకులు పోలింగ్ కేంద్రం వద్దే ఉన్నా పోలీసులు పట్టించుకోవడం లేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


సంజయ్ గాంధీ కాలనీ వద్ద దొంగ ఓట్లు వేసేందుకు మహిళలు వచ్చారు. ఏం చదువుకున్నారు... విద్యార్హతలు ఏంటని ప్రశ్నించడంతో 6,9 వ తరగతి చదువుకున్నామని మీడియాకు చెప్పారు. దొంగ ఓట్లు వేస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ చెప్పిన విషయాన్ని మీడియా ప్రతినిధులు గుర్తు చేయడంతో అక్కడి నుంచి వాళ్లు జారుకున్నారు. ఓటు వేయకుండానే మహిళలంతా వెళ్లిపోయారు. 


సంజయ్‍గాంధీ కాలనీ 228 పోలింగ్ బూత్‍ వద్ద కొంతమంది అనర్హులతో ఓట్లు వేయించేందుకు వైసీపీ ప్రయత్నించదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారిని అడ్డుకోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని టీడీపీ లీడర్లను అక్కడి నుంచి తీసుకెళ్లడంతో అంతా సర్దుకుంది. 


అన్నమయ్య జిల్లాలో పట్టభద్రుల కోసం 51 పోలింగ్‌ కేంద్రాలు, ఉపాధ్యాయుల కోసం 30 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3890 మంది ఓటర్లు హక్కును వినియోగించుకోనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 44432 మంది ఓటర్లు ఓటు వేస్తారు. జిల్లాలో 51 గ్రాడ్యుయేట్‌, 30 టీచర్స్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌ కేంద్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.