Jagan Speech At Raptadu Meeting: రాప్తాడు: వచ్చే ఎన్నికలు కేవలం రెండు సిద్ధాంతాలకు మధ్య జరగుతున్న ఎన్నికలని.. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు కాదన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy). ఈ అయిదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఇంటింటికీ అందించిన సంక్షేమం మరో 5 ఏళ్లు కొనసాగాలని మనం భావిస్తున్నాం. కానీ ఈ పథకాలు రద్దు చేయడమే టార్గెట్ గా డ్రామాలు ఆడుతున్న చంద్రబాబు (Chandrababu)కు జరిగే యుద్ధమే ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికలన్నారు. ఫ్యాన్ ఎప్పుడూ ప్రతి ఇంట్లో ఉండాలని, సైకిల్ ఎప్పుడూ బటయే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలన్నారు. గత ఎన్నికల్లోనే జనం చొక్కాలు మడతపెట్టి, చంద్రబాబు కుర్చీలు 23కి మడతపెట్టారంటూ జగన్ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ జనం మరోసారి చంద్రబాబు కుర్చీలు మడతపెట్టాలంటూ ప్రజలకు జగన్ పిలుపునిచ్చారు.


250 ఎకరాల విస్తీర్ణంలో రాయలసీమ పరిధిలోని 52 నియోజకవర్గాలకు సంబంధించి అనంతపురం జిల్లాలోని రాప్తాడులో వైసీపీ నిర్వహించిన సిద్ధం భారీ బహిరంగ సభకు సీఎం జగన్ హాజరయ్యారు. వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ. మాట ఇచ్చి నిలబెట్టుకునే జగన్‌కు, ఇచ్చిన మాట తప్పే చంద్రబాబుకు.. విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరిగే యుద్ధంలో ప్రజలు తనతో కలిసి రావాలని, అందుకు సిద్ధమేనా అని జగన్ అడిగారు. 



వేరే రాష్ట్రంలో ఉండి, అప్పుడప్పుడు ఏపీకి వచ్చే నాన్ రెసిడెంట్స్‌ (చంద్రబాబు, పవన్ కళ్యాణ్)కు, ఈ గడ్డమీద మమకారంతో ఇక్కడి ప్రజల మధ్య ఉండే తమకు మధ్య జరగబోయే యుద్ధమే ఎన్నికలన్నారు. 14 ఏళ్లు, మూడు పర్యాయాలు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్క పథకమైనా ఉందని చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్ విసిరారు. చంద్రబాబు పేరు చెబితే అక్కాచెల్లెమ్మలకు గుర్తొచ్చే పథకం ఒక్కటీ లేదన్నారు. విద్యార్థులకు సైతం చంద్రబాబు పథకం ఒక్కటీ గుర్తురాదన్నారు. చంద్రబాబు ఏదో వర్గానికైనా మేలు చేశాడా అని ఆలోచిస్తే ఒక్క పథకం కూడా గుర్తుకురాదన్నారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు చూస్తే.. ఏ ఒక్కగ్రామంలోనైనా చంద్రబాబు మార్క్ పాలన ఉందా అని జగన్ ప్రశ్నించారు. ఎన్నికల్లో విడుదల చేసే మేనిఫెస్టోల్లోని హామీలను నెరవేర్చడం ఆయనకు అలవాటు లేదంటూ సెటైర్లు వేశారు. 


1995, 1999, 2014 మేనిఫెస్టోలలో టీడీపీ ఇచ్చిన హామీలను కనీసం 10 శాతం అమలు చేయలేదంటూ జగన్ మండిపడ్డారు. బాబు వంచన, మోసాలు చూడలేక ప్రజలు ఆయన కుర్చీ మడతపెట్టి ఇంటికి పంపించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూడుసార్లు సీఎం అయ్యాక.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చని నేత చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు సంగతి అర్థమై 102 నుంచి 23 సీట్లకు తగ్గించారని.. మరోసారి అదే సీన్ రిపీట్ చేయాలని ప్రజలకు జగన్ పిలుపునిచ్చారు. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోట్లు, మోసాలు తప్పా, ప్రజలకు అవసరమయ్యే పథకాలు ఏవీ లేవన్నారు. సామాన్యులే వైసీపీకి స్టార్ క్యాంపెయినర్లు అని, తమ ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని, పథకాలకు వివరిస్తే సరిపోతుందన్నారు.


‘2019లో ఒక్కసారి అధికారం ఇస్తే రైతులకు రైతు భరోసా ఇచ్చాం. గ్రామ స్థాయిలో ఆర్బీకేలను తీసుకొచ్చాం. రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ నిరంతరాయంగా అందించాం. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించాం. రైతులకు ఉచిత పంటల బీమా ఇచ్చింది వైసీపీ సర్కారే. 87 వేల కోట్ల రుణమాఫీని చంద్రబాబు ఓ మోసంలా మార్చారో రైతులందరికీ తెలుసు. వైసీపీ ప్రభుత్వంలో అక్కాచెల్లెమ్మలకు అమ్మ ఒడి, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం. 31 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ, లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. మహిళల రక్షణ కోసం దిశా పోలీస్ యాక్ట్. పిల్లలకు ఇంగ్లీష్ చదవులు తీసుకొచ్చాం. పెత్తందార్ల పిల్లలతో సామాన్యుల పిల్లలు పోటీ పడాలన్నా, ఇంగ్లీష్ లో మాట్లాడాలన్నా మరోసారి జగన్ అధికారంలోకి రావాలి. అప్పుడే పేదల పిల్లలకు ఇతర రాష్ట్రాల్లోనే కాదు, విదేశాల్లోనూ ఉపాధి అవకాశాలు లభిస్తాయని’ జగన్ పేర్కొన్నారు.