TTD News: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. పెరటాసి మాసం సందర్భంగా తమిళనాడు నుంచి భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు‌‌‌. భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అక్టోబరు 1, 7, 8, 14, 15వ తేదీల్లో ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.



అలిపిరి వద్ద పార్కింగ్ ప్రదేశాలు ఫుల్
పవిత్రమైన పెరటాసి మాసంలో రెండవ  శనివారంతో పాటు అక్టోబర్ 2వ తేదీ వరకు వరుస సెలవులు ఉండడంతో తిరుపతి, తిరుమలకు వెళ్లే రహదారులన్నీ భక్తులతో నిండిపోయాయి. అలిపిరి వద్ద ఉన్న పార్కింగ్ ప్రాంతాలన్నీ వాహనాలతో నిండిపోయాయి. అలిపిరి నుంచి ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వరకు తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చిన బస్సులతో నిలిచి ఉన్నాయి. శుక్రవారం నుంచి అలిపిరి రహదారికి ఇరువైపులా బస్సులు బారులు తీరాయి.



వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2, నారాయణగిరి షెడ్‌లలోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, క్యూ లైన్లు నందకం విశ్రాంతి భవనం దాటి ఐదు కిలోమీటర్లకు పైగా విస్తరించాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, అన్నప్రసాదాలు, వసతి తదితర అంశాలపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. ఈవో ధ‌ర్మారెడ్డి  ఆదేశాల మేరకు టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గురువారం నుంచి క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ నిరంతరాయంగా టీటీడీ అందిస్తోంది. 


దాదాపు 2500 మంది శ్రీవారి సేవకులు నిరంతరాయంగా భక్తులకు సేవలు అందిస్తున్నారు. వైకుంఠం కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూ లైన్లు, లగేజీ కౌంటర్లు, లడ్డూ కౌంటర్లు, అన్నప్రసాదం, రిసెప్షన్, కల్యాణకట్ట, ఆలయం లోపల క్యూ లైన్ల నిర్వహణ, చెప్పల్ స్టాండ్‌లు మొదలైన వాటి వద్ద వివిధ షిఫ్టుల్లో సేవలందిస్తున్నారు. వివిధ శాఖలు యాత్రికుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ వేచి ఉన్న యాత్రికులకు సౌకర్యాలు కల్పిస్తున్నాయి.


సెప్టెంబర్ 30వ తేదీ నాటికి శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి టోకెన్ లేని భక్తులకు దాదాపు 48 గంటల సమయం పడుతోంది. టీటీడీ  రేడియో. బ్రాడ్‌కాస్టింగ్ విభాగం ఈ విషయమై తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషలలో నిరంతరం ప్రకటనలు చేస్తోంది. దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండవలసి వస్తోందని, ఈ దర్శన సమయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తీర్థయాత్రను రూపొందించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. క్యూలెన్లలో ఉన్న భక్తులకు ఇబ్బంది కలుగకుండా టీటీడీ సిబ్బంది అన్న ప్రసాదం, తాగునీరు అందిస్తున్నారు. 


అక్టోబ‌ర్ 10 నుంచి ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబ‌ర్ 10 నుంచా 12వ తేదీ వ‌ర‌కు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించ‌నున్నారు. ఇందుకోసం అక్టోబ‌ర్ 9న సాయంత్రం అంకురార్పణ జ‌రుగ‌నుంది. యాత్రికులు, సిబ్బందితో తెలియక జరిగే దోషాలతో ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పవిత్రోత్సవాల్లో మొదటి రోజైన అక్టోబ‌ర్ 10న పవిత్ర ప్రతిష్ఠ, అక్టోబ‌ర్ 11న పవిత్ర సమర్పణ, పవిత్ర హోమాలు చేపడతారు. చివరిరోజు అక్టోబ‌ర్ 12న మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన జ‌రుగ‌నుంది.  ప‌విత్రోత్సవాల సంద‌ర్భంగా ప్రతి రోజు ఉద‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్రస‌న్న వేంక‌టేశ్వర‌స్వామివారి ఉత్సవ‌ర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.