Leopard Caught : తిరుపతి ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ ఆవరణలో కొద్ది రోజులుగా చిరుత పులి సంచారంతో విద్యార్థులు హడలిపోతున్నారు. ఇటీవల ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ బంగ్లాలో ప్రవేశించిన చిరుత ఓ కుక్కను చంపి ఎత్తుకెళ్లింది. దీంతో యూనివర్సిటీలోని హాస్టల్స్ లో ఉండే విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. అయితే యూనివర్సిటీలో‌ చిరుత పులి సంచారంపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు శుక్రవారం చిరుత పులి సంచరించిన వీసీ బంగ్లా వెనుక వైపు బోన్లు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం చిరుతపులి అటవీశాఖ అధికారుల బోనుకు చిక్కింది. అయితే చిరుత పులి కోసం రెండు వేర్వేరు ప్రదేశాల్లో బోన్లను ఏర్పాటు చేయడంతో పాటుగా దాదాపు 6 కెమెరా ట్రాప్ లను ఏర్పాటు చేశారు  అధికారులు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి నుంచి చిరుత పులి కోసం అటవీ అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. ఆదివారం ఉదయం చిరుతను బోన్ లో బంధించారు. చిక్కిన చిరుత పులిని దట్టమైన శేషాచలం అటవీ ప్రాంతంలో వదిలేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక చిరుత పులి సంచారంతో తిరుపతి రూరల్ మండలంలోని లక్ష్మీపల్లె, పెరుమాళ్ పురం గ్రామాల ప్రజలు‌ భయాందోళనకు గురవుతున్నారు. శేషాచల‌ అటవీ ప్రాంతానికి దగ్గరలో గ్రామాలు ఉండడంతో తరచూ రాత్రి సమయాల్లో‌ చిరుత పులి గ్రామాల్లో సంచరించి కుక్కలను వేటాడి చంపి‌తింటోంది. ఈ క్రమంలో అటవీ శాఖ‌ అధికారులు చిరుతను బంధించి తమకు రక్ష కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. 


పది రోజులుగా చిరుతలు సంచారం 


తిరుపతి ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో పది రోజుల క్రితం చిరుత కన్పించింది. రాత్రిపూట కుక్కలపై చిరుత దాడి చేసిన సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. చిరుత సంచరిస్తున్న విషయం తెలియడంతో విద్యార్థులు భయాందోళన చెందారు. కొందరు విద్యార్ధులు ఏకంగా హాస్టల్ గదులు ఖాళీ చేసి ఇంటికి వెళ్లిపోయారు. చిరుతను పట్టుకోవాలని విద్యార్థులు ఆందోళన కూడా చేశారు. చిరుత పులిని పట్టుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. యూనివర్సిటీ పరిధిలో రెండు చిరుతలు తిరుగుతున్నాయని అటవీ అధికారులు గుర్తించారు. ఈ చిరుతలను పట్టుకునేందుకు రెండు బోన్లను  ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి వర్సిటీలోకి వచ్చిన చిరుత  బోనులో చిక్కింది. ఈ విషయాన్ని గుర్తించిన  అటవీ శాఖ అధికారులు  చిరుతను  బంధించి జూపార్క్ కు తరలించారు. మరో  చిరుతను కూడా బంధించేందుకు  అటవీ అధికారులు చర్యలు చేపట్టారు.  గత కొంతకాలంగా  వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో  చిరుతలు సంచరిస్తూ కుక్కల్ని చంపుతున్నాయి.  


తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత పిల్ల మృతి 


 తిరుపతి నుంచి తిరుమల వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో ఇటీవల చిరుత పులి పిల్ల మృతి చెందింది. శుక్రవారం ఉదయం‌ వేకువజామున నాలుగు గంటల సమయంలో అలిపిరి సమీపంలోని వినాయక స్వామి వారి‌ ఆలయం వద్ద గుర్తు తెలియని‌ వాహనం‌ ఢీ కొనడంతో చిరుత పులి పిల్ల ఘటనా స్థలంలోనే మృతి చెందింది. అయితే విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ ‌సిబ్బంది అటవీ‌శాఖ అధికారులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలం వద్దకు చేరుకున్న అటవీశాఖ అధికారులు పులి పిల్లకు పోస్టు మాస్టం కోసం తిరుపతి జూపార్క్ కు తరలించారు. చిరుత పులి పిల్లకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఖననం చేశారు.