Chaganti Koteswara Rao : ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం టీటీడీ మూడేళ్లుగా వివిధ పారాయణాలు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చాగంటి కోటేశ్వరరావును సలహాదారుగా నియమిస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని పద్మావతి విశ్రాంతి గృహంలో ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో హెచ్‌డీపీపీ, ఎస్వీబీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు శుక్రవారం నిర్వహించారు. గ్రామీణ యువత భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 


మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచారం 


బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమిస్తున్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. గ్రామీణ యువత భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచార విస్తృతంగా నిర్వహించాలని, గ్రామస్తులకు భజన, కోలాటం సామాగ్రి అందించాలని నిర్ణయించారు.   మానవాళి శ్రేయస్సు కోసం యాగాలు, హోమాలు నిర్వహించాలని నిర్ణయించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఎస్వీబీసీ తెలుగు, తమిళ ఛానళ్ల తరహాలో కన్నడ, హిందీ ఛానళ్లు ప్రాచుర్యం పొందేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.  


తిరుమల సమాచారం


తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం శ్రీనివాసుడికి ప్రీతికరమైన రోజు కావడంతో సుప్రభాతం నువ్వుల గింజలతో ప్రసాదం నివేదిస్తారు అర్చకులు. శుక్రవారం 60,756 మంది తిరుమల స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 26,725 మంది తలనీలాలు సమర్పించగా, 3.82 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. అయితే సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 6 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనంకు దాదాపు 12 గంటలకు పైగా సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది.  శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. శనివారం స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ క్రమంలో ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారాన్ని తెరిచిన అర్చకులు.. వైఖానస అర్చకులు, సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామి వారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామి వారి తొలి దర్శనం చేసుకుంటారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతం స్తోత్రం, ప్రవర్తి, మంగళ శాసనం వంటివి పటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకుల ప్రత్యూష కాలరాతనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చి పాలను నివేదన సమర్పించిన అనంతరం "నల్ల నువ్వుల బెల్లంతో " కలిపిన ప్రసాదాన్ని స్వామి వారిని నివేదిస్తారు. ముందు రోజు రాత్రి పావళింపు సేవలో బంగారు నవారు మంచంపై సేవించి ఉన్న శ్రీవారి కౌతుక బేరం  భోగ శ్రీనివాసమూర్తి వారిని మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి సింహాసనంపై జీవ స్థానంలో వేయించేపు చేస్తారు. అనంతరం ఏకాంతంగా శ్రీవారికి కర్పూర నిరాజనం సమర్పణ జరుపుతారు అర్చకులు. దీనినే కైకర్యపరుల హారతిని కూడా పిలుస్తారు.