Tirumala Drone Video : తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ వీడియో వైరల్ అవడంతో  టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ కెమెరాల్లో శ్రీవారి ఆలయాల చిత్రీకరించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. తిరుమల శ్రీవారి ఆలయంపై, పరిసర ప్రాంతాల్లో విమానాలు, డ్రోన్ కెమెరాలు నిషేధం ఉంది. అయితే శ్రీవారి ఆలయానికి సంబంధించిన వీడియాను ఐకాన్ అనే ఓ యూట్యూబ్ ఛానల్ పోస్టు చేయడం కలకలంగా మారింది. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారడంపై శ్రీవారి భక్తులు, ఆగమ సలహాదారులు మండిపడుతున్నారు. 


తిరుమల డ్రోన్ వీడియో కలకలం 


కోట్లాది మంది ఆరాధ్య దైవంమైన శ్రీనివాసుడి దర్శనార్థం ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుండి తిరుమల పుణ్యక్షేత్రానికి వస్తుంటారు.  అయితే తిరుమల కట్టుదిట్టమైన భద్రత వలయాలతో పటిష్టమైన సెక్యూరిటీ కలిగిన దేవస్థానం. ప్రతినిత్యం మాన్యువల్ సెక్యూరిటీ నుంచి మూడో కన్ను వరకు అన్ని కాపు కాస్తూనే ఉంటాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా హైసెక్యూరిటీ నడుమ టీటీడీ విజిలెన్స్, పోలీసు, ఆక్టోపస్ అంటూ వివిధ సెక్యూరిటీ ఫోర్స్ లతో పాటు సీసీ కెమెరాలు నిత్య పర్యవేక్షణలో తిరుమల సురక్షితంగా ఉంటుంది. ఇలాంటి హైసెక్యూరిటీ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలు ఎగరవేయరాదనే నిబంధనలు ఉన్నాయి. ఒకవేళ అనుమతి లేకుండా డ్రోన్స్ ఎగురవేస్తే కటకటాల పాలుకావాల్సిందే. ఇక ఇప్పటికే నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని టీటీడీ కేంద్ర పౌర విమానయాన శాఖను పలుమార్లు కోరింది. అయితే సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసిన పౌర విమానయాన శాఖ అధికారులు అది సాధ్యం కాదని తేల్చారు. విమానం సంగతి పక్కన బెట్టిన డ్రోన్స్ ఎగరేయరాదనే నిబంధనలు మాత్రం పటిష్టంగా అమలు చేస్తుంది టీటీడీ.


సోషల్ మీడియాలో చక్కర్లు 


కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. పలు ఇన్ స్టగ్రాం అకౌంట్లతో పాటుగా  యూట్యూబ్ ఛానెల్స్ లో స్వామి వారి ఆలయానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. టీటీడీ భద్రత సిబ్బంది కళ్లుగప్పి... ఓ డ్రోన్ స్వామి వారి ఆలయంపై చక్కర్లు కొట్టి, స్వామి వారి ఆలయం హై సెక్యూరిటీ అయినా ఏరియల్ వ్యూ వీడియో షూట్ చేసినట్లు ఆ వీడియోలో ఉంది. ఇప్పుడు  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెక్యూరిటీ పరమైన ఆంక్షలు ఉండి.... స్వామి వారి ఏరియల్ వ్యూ ను బయటకు రాకుండా చూస్తుంది టీటీడీ. అయితే ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్ చేసిన నిర్వాకం మాత్రం ఇప్పుడు కలకలం రేపిందని చెప్పుకోవాలి. డ్రోన్ రైడర్1  అనే యూట్యూబ్ ఛానెల్ లో  నవంబర్ 13, 2022లో తిరుమల వీడియోను అప్లోడ్ చేసింది.  అనంతరం అదే వీడియోని ఐకాన్ ఫాక్ట్స్/ ఐకాన్  అనే యూట్యూబ్ ఛానెల్ లో జనవరి 07, 2023లో పోస్ట్ చేశాయి. ఇక గృహశ్రీనివాస అనే ఇన్ స్టాగ్రాం అకౌంట్ లో అదే వీడియోను పోస్ట్ చేశారు.


ఫేక్ వీడియో 


టీటీడీ శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించినట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వీడియో వాస్తవం కాదని,  దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి పరిశీలిస్తామని టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్ తెలిపారు. తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం సాధ్యం కాదన్నారు. ఆ వీడియోను పరిశీలించిన అనంతరం బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.