Tirumala News : తిరుపతి ఎయిర్ పోర్టులో శ్రీవారి దర్శనం టికెట్ల కౌంటర్ ఏర్పాటు చేసింది టీటీడీ. ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్ల కౌంటర్ ను టీటీడీ జేఈవో వీరబ్రహ్మం గురువారం ప్రారంభించారు. శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం టికెట్ అందిస్తారు. అయితే దర్శనం టికెట్ కోసం రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. దేశ విదేశాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం తిరుపతి విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్లు జారీ చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే తిరుపతి మాధవం గెస్ట్ హౌస్ లో శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కౌంటర్లు ఏర్పాటుచేశారు. ఎయిర్‌పోర్టు, తిరుపతిలోని శ్రీవాణి టికెట్ల కౌంటర్లలో దాతలు దర్శనానికి ముందురోజు తిరుమలకు వచ్చి అవసరమైన పత్రాలు సమర్పించి టికెట్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. భక్తుల ఇబ్బందులను గుర్తించి శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు తిరుపతిలోనే జారీ చేసి మాధవంలో వసతి కేటాయించేందుకు నిర్ణయించామని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ టికెట్ కౌంటర్ల నిర్వహణకు ముందుకొచ్చిన హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు యాజమాన్యానికి జేఈవో వీరబ్రహ్మం కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎయిర్‌పోర్టు డీజీఎం టెర్మినల్ చంద్రకాంత్, కమర్షియల్ మేనేజర్ అవినాష్, పలువురు సిబ్బంది, అధికారులు ఈ కార్యకర్రంలో పాల్గొన్నారు.






తిరుమలలో కొనసాగుతున్న రద్దీ 


తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రతి శుక్రవారం అభిషేకం నిర్వహించే క్రమంలో గురువారం మధ్యాహ్నం నుండి స్వామి వారికి పూలంగి సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. స్వామి వారిపై ఉన్న ఆభరణాలు అన్ని తొలగించి, అరుదైన సుంగంధ పుష్పాలతో స్వామి వారిని అలంకరిస్తారు అర్చకులు దీనినే పూలంగి సేవ అని కూడా పిలుస్తారు. ఎటువంటి ఆభరణాలు లేకుండా పూలతో అలంకరించిన స్వామి వారు భక్తులను మంత్రముగ్ధులను చేస్తారు. బుధవారం 59,752 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 26,000 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించగా, నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 3.65 కోట్లు రూపాయలు ఆదాయం లభించింది. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 5 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనం కోసం దాదాపుగా 28 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు 3 గంటల సమయం పడుతుంది.  


శ్రీవారి సేవలు


శ్రీవారి ఆలయంలో ప్రతినిత్యం వైఖానస భగవచ్చాస్త్ర ప్రకారం అనేక వైదిక కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారు అర్చకులు. శ్రీవారి ఆలయంలో ప్రతి నిత్యం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారములు తెరిచిన అర్చకులు... బంగారు వాకిలి వద్ద సుప్రభాత శ్లోకాల పఠనంతో వేద పండితులు స్వామి వారిను మేలుకొల్పారు. వైఖానస అర్చకులు సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామివారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామివారి తొలి దర్శనం చేసుకున్నారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతం స్తోత్రం, ప్రవర్తి, మంగళ శాసనం వంటివి పటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకుల ప్రత్యూష కాలరాతనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చి పాలను నివేదించారు. అంతకుముందు రోజు రాత్రి పావళింపు సేవలో బంగారు నవారు మంచంపై సేవించి ఉన్న శ్రీవారి కౌతుక బేరం శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి వారిని మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి సింహాసనంపై జీవ స్థానంలో వేయించేపు చేశారు. అనంతరం ఏకాంతంగా శ్రీవారికి కర్పూర నిరాజనం సమర్పణ నిర్వహించారు. దీనికే కైకర్యపరుల హారతిని కూడా పిలుస్తారు.