Kadapa Tipu Sultan Circle controversy: రాయలసీమ నడిబొడ్డున ఉన్న కడప నగరంలో టిప్పు సుల్తాన్ పేరుతో ఒక సర్కిల్ను ఏర్పాటు చేయాలని జరుగుతున్న ప్రయత్నాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. భారత చరిత్రలో అత్యంత వివాదాస్పద వ్యక్తిగా ముద్రపడిన టిప్పు సుల్తాన్ పేరును ప్రజా ప్రదేశాలకు పెట్టడం సరికాదని పలు హిందూ సంఘాలు , భారతీయ జనతా పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి చర్యలు మతపరమైన విభేదాలను సృష్టించే కుట్రలో భాగమని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. టిప్పు సుల్తాన్ తన పాలనలో హిందూ సమాజంపై దాడులు చేశారని, దేవాలయాలను ధ్వంసం చేయడమే కాకుండా వేలాది మందిని బలవంతంగా మతమార్పిడి చేశారని బిజెపి నాయకులు గుర్తు చేస్తున్నారు. అటువంటి వ్యక్తిని గొప్పగా చిత్రీకరించడం భావ్యం కాదని, ఇది స్థానిక ప్రజల సెంటిమెంట్లను గాయపరచడమేనని వారు వాదిస్తున్నారు. గతంలో ఇదే జిల్లాలోని ప్రొద్దుటూరులో కూడా ఇటువంటి ప్రయత్నం జరిగినప్పుడు, హిందూ సమాజం తిరుగుబాటుతో అది ఆగిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు.
ప్రస్తుత ప్రభుత్వం ఇటువంటి సున్నితమైన అంశాల్లో కఠినంగా వ్యవహరించాలని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను అడ్డుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కావాలనే సమాజంలో చీలిక తెచ్చేందుకు కొందరు ఇటువంటి ప్రతిపాదనలను తెరపైకి తెస్తున్నారని, దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి శాంతిభద్రతలను కాపాడాలని బాధితులు , సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.
ఈ వివాదంతో, కడప మున్సిపల్ కమిషనర్ , జిల్లా కలెక్టర్ ఈ ప్రతిపాదనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వకూడదని బిజెపి డిమాండ్ చేస్తోందది. స్థానిక ప్రజల మనోభావాలను గౌరవించాలని కోరుతోంది.
అసలు కడపలో టిప్పు సుల్తాన్ పేరు ఎందుకంటే ?
టిప్పు సుల్తాన్ మద్దతుదారులు ఆయనను బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకగా పోరాడిన మొట్టమొదటి పాలకుల్లో ఒకరిగా చూస్తారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించిన మైసూరు పులి గా, దేశభక్తుడిగా ఆయనను గౌరవిస్తూ, ఆ జ్ఞాపకార్థం సర్కిల్కు ఆయన పేరు పెట్టాలని కోరుతుంటారు. కడప , ప్రొద్దుటూరు ప్రాంతాల్లో ముస్లిం జనాభా గణనీయంగా ఉంది. తమ సామాజిక వర్గానికి చెందిన ఒక చారిత్రక వీరుడి పేరును ఒక సర్కిల్కు పెట్టాలనేది ఆయా ప్రాంతాల్లోని ముస్లిం పెద్దలు మరియు నాయకుల దశాబ్దాల కాలం నాటి కోరిక. దీనిని మత సామరస్యానికి మరియు తమ గుర్తింపుకు చిహ్నంగా వారు భావిస్తారు. చారిత్రక ఆధారాల ప్రకారం టిప్పు సుల్తాన్ కుటుంబానికి కడపతో సంబంధం ఉంది. టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ తల్లి ఫాతిమా ఫక్రున్నీసా, అప్పటి కడప కోట గవర్నర్ అయిన మీర్ ముయినుద్దీన్ కుమార్తె. ఈ చారిత్రక అనుబంధాన్ని కూడా కొందరు కారణంగా చూపుతుంటారు.
